- మళ్ళీ 'హిందూ రేట్ ఆఫ్ గ్రోత్' వైపు దేశం?
న్యూఢిల్లీ: భారత ఆర్థికవ్యవస్థ గమనంపై ఆర్థిక నిపుణుల్లో కొత్త చర్చ మొదలైంది. ఒకప్పుడు తక్కువ వృద్ధి రేటును సూచించడానికి వాడిన "హిందూ రేట్ ఆఫ్ గ్రోత్" అనే పదాన్ని ప్రస్తుత పరిస్థితులతో పోలుస్తూ అనేక విశ్లేషణలు వెలువడుతున్నాయి. దేశ జీడీపీ వృద్ధి రేటు ఆశించినస్థాయిలో లేకపోవడంపై ఆర్థికవేత్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఏమిటీ 'హిందూ రేట్ ఆఫ్ గ్రోత్'?
1950ల నుంచి 1980ల మధ్య కాలంలో భారత ఆర్థికవ్యవస్థ ఏడాదికి సగటున 3.5 శాతం నుంచి 4 శాతం వృద్ధికి పరిమితమైంది. దీనిని ఆర్థికవేత్త రాజ్ కృష్ణ 'హిందూ రేట్ ఆఫ్ గ్రోత్' అని పిలిచేవారు. ప్రస్తుత గణాంకాలు కూడా మళ్ళీ అదే దిశగా పడిపోయే ప్రమాదం ఉందా అన్న చర్చ జరుగుతోంది. ఇటీవలి త్రైమాసికాల్లో జీడీపీ వృద్ధి రేటు నెమ్మదించడం ఆందోళన కలిగిస్తోంది. పెట్టుబడులు తగ్గడం, వినియోగం మందగించడం దీనికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. కేవలం వృద్ధి రేటు అంకెల్లో ఉండటమే కాకుండా, అది సామాన్యుల ఆదాయంలో మార్పు తీసుకురావడంలో విఫలమవుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిరుద్యోగిత, అసమానతలు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి.
ప్రభుత్వ చర్యలు - సవాళ్లు
కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై భారీగా ఖర్చు చేస్తున్నప్పటికీ, ప్రైవేటు పెట్టుబడులు ఆశించినస్థాయిలో రావడం లేదు. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కూడా భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని పెంచుతున్నాయి. అందుకే భారతదేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే, ప్రస్తుత మందగమనం నుంచి బయటపడి స్థిరమైన, వేగవంతమైన వృద్ధిని సాధించాల్సిన అవసరం ఉందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
No comments:
Post a Comment