- ఛోటాఉదయ్పూర్ జిల్లాకు చెందిన గిరిజనుడి అరెస్ట్
ఛోటాఉదయ్పూర్, గుజరాత్: దేశ సార్వభౌమత్వానికి ముప్పు కలిగించే, ప్రజల మధ్య సామరస్యాన్ని దెబ్బతీసే అభియోగాలు కింద, గుజరాత్లోని ఛోటాఉదయ్పూర్ జిల్లాకు చెందిన ఒక గిరిజన నివాసిని పోలీసులు అరెస్టు చేశారు. సీనియర్ నక్సల్ కమాండర్ మాడ్వి హిడ్మాను కీర్తిస్తూ ఇతను ఇన్స్టాగ్రామ్ రీల్ పోస్ట్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.అరెస్ట్ అయిన వ్యక్తి పరేష్ రాథ్వా (31), క్వాంట్ తాలూకా నివాసి.
ఆంధ్రప్రదేశ్ మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మా మరణించిన దాదాపు నెల రోజుల తర్వాత, పరేష్ రాథ్వా ఈ వారంలో ఇన్స్టాగ్రామ్లో వివాదాస్పద రీల్ను అప్లోడ్ చేశారు. తాజా నివేదికల ప్రకారం.. ఈ పోస్ట్లో హిడ్మాను "స్వాతంత్య్ర సమరయోధుడు"గా అభివర్ణించారు.ఛోటాఉదయ్పూర్ ప్రత్యేక ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్వోజీ) స్థానిక సోషల్ మీడియా ప్రొఫైల్లను స్కాన్ చేస్తుండగా మంగళవారం ఈ రీల్ను గుర్తించింది. ఎస్వోజీ నివేదిక ఆధారంగా, క్వాంట్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, బుధవారం రాథ్వాను అరెస్టు చేశారు.
ఛోటాఉదయ్పూర్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇమ్తియాజ్ షేక్ దీనిపై మీడియాతో మాట్లాడుతూ.. రీల్ కంటెంట్ తీవ్ర పరిణామాలను కలిగిస్తుందని పేర్కొన్నారు. “వీడియోలో, పరేష్ రాథ్వా హిడ్మాను స్వాతంత్య్ర సమరయోధుడిగా పొగిడారు. అంతేకాకుండా, గిరిజన సమాజాలను నక్సలిజంతో కలుపుతూ వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి కంటెంట్ దేశ సార్వభౌమత్వం, ఐక్యతకు సవాలుగా ఉంది అంతర్గత భద్రతకు ముప్పు కలిగిస్తుంది,” అని ఎస్పీ షేక్ తెలిపారు. ఈ పోస్ట్ దేశంలోని వివిధవర్గాల మధ్య విభేదాలను రెచ్చగొట్టే విధంగా రూపొందించబడిందని ఆయన అన్నారు. మేము ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి, ఎస్వోజీ ఇన్స్పెక్టర్ ద్వారా కేసు నమోదు చేశాము. నిందితుడిని అరెస్టు చేశాం. తదుపరి విచారణ కొనసాగుతోందని ఆయన వివరించారు.

No comments:
Post a Comment