- బెర్లిన్ లో రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
బెర్లిన్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల భారతదేశంలో తయారీరంగం (Manufacturing Sector) పూర్తిగా దెబ్బతిందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. తన జర్మనీ పర్యటనలో భాగంగా బెర్లిన్లోని 'హెర్టీ స్కూల్'లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
భారత్ వంటి భారీ జనాభా ఉన్న దేశంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలను సృష్టించాలంటే తయారీరంగం ఒక్కటే మార్గమని, కానీ బీజేపీ ప్రభుత్వం దీన్ని నిర్లక్ష్యం చేసిందని రాహుల్ ఆరోపించారు. దేశ ఆర్థిక అధికారాన్ని ముగ్గురు నలుగురు బడా పారిశ్రామికవేత్తల (అదానీ, అంబానీ వంటి వారు) చేతుల్లో పెట్టారని, వారు కేవలం వ్యాపారం పైనే ఆసక్తి చూపుతున్నారని, వస్తువుల ఉత్పత్తి పై కాదని ఆయన మండిపడ్డారు. ప్రస్తుతం మన చుట్టూ ఉన్న వస్తువుల్లో మెజారిటీ 'మేడ్ ఇన్ చైనా'వే ఉంటున్నాయని, భారత్కు ఉత్పత్తి సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రభుత్వం దాన్ని ప్రోత్సహించడం లేదని రాహుల్ పేర్కొన్నారు.ప్రజాస్వామ్య విలువలు, పర్యావరణ స్పృహ, సమాజంలోని బలహీనవర్గాల అభివృద్ధిని కలుపుకుని సాగే కొత్త అభివృద్ధి నమూనా భారత్కు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
బీఎండబ్ల్యూ ప్లాంట్ సందర్శన
అంతకుముందు మ్యూనిచ్లోని బీఎండబ్ల్యూ ఫ్యాక్టరీని సందర్శించిన ఆయన, అక్కడ టీవీఎస్ బైక్లను చూడటం సంతోషంగా ఉందని, అయితే భారత్ సొంతంగా గ్లోబల్ తయారీ కేంద్రంగా ఎదగాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు.రాహుల్ గాంధీ చేసిన ఈ విమర్శలపై బీజేపీ నేతలు స్పందిస్తూ.. గత పదేళ్లలో ఎలక్ట్రానిక్స్, మొబైల్ తయారీరంగంలో భారత్ సాధించిన వృద్ధిని గణాంకాలతో సహా వివరిస్తూ ఆయన వ్యాఖ్యలను తిప్పికొట్టారు.
No comments:
Post a Comment