- స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై ఎక్స్ వేదికగా స్పందించిన ప్రధాని
- తిరువనంతపురంలో 'చారిత్రక తీర్పు'
న్యూఢిల్లీ: కేరళలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ, ఎన్డీఏ అభ్యర్థులకు ఓటు వేసిన ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ శనివారం కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన యూనైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్), లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) కూటములపై విమర్శలు గుప్పించారు. తిరువనంతపురం కార్పొరేషన్లో బీజేపీ- ఎన్డీఏ కూటమికి లభించిన తీర్పును కేరళ రాజకీయాల్లో ఒక చారిత్రక మలుపుగా ప్రధాని అభివర్ణించారు.
యూడీఎఫ్, ఎల్డీఎఫ్ పట్ల ప్రజలకు విసుగు
ప్రధాని మోడీ 'ఎక్స్' లో పోస్ట్ చేస్తూ.. కేరళ స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ, ఎన్డీఏ అభ్యర్థులకు ఓటు వేసిన ప్రజలందరికీ నా కృతజ్ఞతలు. కేరళ ప్రజలు యూడీఎఫ్, ఎల్డీఎఫ్ పట్ల విసుగు చెందారు. మెరుగైన పాలన అందించగల, అందరికీ అవకాశాలతో కూడిన వికసితకేరళంను నిర్మించగల ఏకైక ఎంపికగా వారు ఎన్డీఏ ను చూస్తున్నారని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
తిరువనంతపురంలో 'చారిత్రక తీర్పు'
"తిరువనంతపురానికి ధన్యవాదాలు! తిరువనంతపురం కార్పొరేషన్లో బీజేపీ-ఎన్డీఏ కు లభించిన తీర్పు కేరళ రాజకీయాల్లో ఒక మలుపు. రాష్ట్ర అభివృద్ధి ఆకాంక్షలను మా పార్టీ మాత్రమే పరిష్కరించగలదని ప్రజలు కచ్చితంగా విశ్వసిస్తున్నారు. మా పార్టీ ఈ శక్తివంతమైన నగరం అభివృద్ధికి, ప్రజలకు 'జీవన సౌలభ్యాన్ని' పెంచడానికి కృషి చేస్తుంది" అని మోడీ తన పోస్ట్లో పేర్కొన్నారు. అలాగే, తిరువనంతపురం కార్పొరేషన్లో అద్భుతమైన ఫలితాలు సాధించేందుకు కృషి చేసిన బీజేపీ కార్యకర్తలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
తాజా ఎన్నికల ట్రెండ్
కేరళ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన తాజా ట్రెండ్ ప్రకారం.. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ 3155 వార్డుల్లో ముందంజలో ఉంది. సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ 2565 వార్డుల్లో, కాగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 577 వార్డుల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఈ సంఖ్యలు పట్టణ , సెమీ-అర్బన్ ప్రాంతాలలో యూడీఎఫ్ కు గణనీయమైన ఆధిక్యాన్ని సూచిస్తున్నాయి.
No comments:
Post a Comment