న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్)' (VB-G RAM G) పై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ కొత్త చట్టం గతంలో జరిగిన 'నోట్ల రద్దు' (Demonetisation) తరహాలోనే రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ, పేదల పొట్ట కొట్టేలా ఉందని ఆయన ఆరోపించారు.
రాష్ట్రాల నిధులపై కోత
ఉపాధి హామీ పథకంలో కేంద్రం తన వాటాను 90 శాతం నుంచి 66 శాతానికి తగ్గించిందని, మిగిలిన భారాన్ని రాష్ట్రాలపై మోపడం వల్ల గ్రామీణ ఆర్థికవ్యవస్థ కుప్పకూలుతుందని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది కేవలం చట్టం మార్పు కాదని, పేద ప్రజల జీవనాధారంపై జరుగుతున్న 'విధ్వంసకర దాడి' అని ఆయన అభివర్ణించారు. కాంగ్రెస్ హయాంలో తెచ్చిన MGNREGA పథకాన్ని నీరుగార్చడమే కేంద్రం ఉద్దేశమని విమర్శించారు.
ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం
రాష్ట్రాల అభిప్రాయం తీసుకోకుండా, ఏకపక్షంగా నిధుల వాటాను మార్చడం ఫెడరల్ వ్యవస్థకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం కేవలం తన ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్రాలను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెడుతోందని మండిపడ్డారు. శనివారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో కూడా ఈ అంశంపై చర్చించామని, పేదల హక్కుల కోసం దేశవ్యాప్త పోరాటం చేస్తామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
No comments:
Post a Comment