Monday 24 September 2012

అదే మాట.. పాత బాట


ఆ మధ్య టీడీపీ అధినేత తెలంగాణపై మరోసారి కేంద్రానికి లేఖ ఇవ్వబోతున్నారనే వార్తలు కొంత కాలం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చనే లేవదీశాయి. సెప్టెంబర్ 15 కల్లా బాబు లేఖ ఇస్తారని ఒకసారి, అసెంబ్లీ సమావేశాల తర్వాత ఇస్తారని మరోసారి వార్తలు వచ్చాయి. ఇంకా కొన్ని పత్రికలు, ఛానళ్లు అయితే తెలంగాణపై తేల్చేశాడు అన్నట్టు చెప్పాయి. అయితే సీమాంధ్ర నేతలతో బాబు భేటీ తర్వాత ఆ అంశం పక్కదారి పట్టింది. తెలంగాణపై లేఖ ఎవరు అడిగారు? ఎవరికి ఇవ్వాలి అని కొందరు సీమాంధ్ర నేతలు బాబును ప్రశ్నించగానే బాబు మాట మార్చేశారు. ఇక ఆ అంశంపై చర్చనే లేదు. తెలంగాణపై బాబు చిత్తశుద్ధి లేదు అనేది చాలాసార్లు రుజువైంది.  మొదట తెలంగాణ ప్రాంతం నుంచి బాబు పాదయాత్ర మొదలు పెడదామని అనుకున్నారట. అందుకే తెలంగాణపై బాబు అండ్ కో చాలా హడావుడి చేశాయి.  ఓ చానల్ అయితే ఏకంగా బాబు లేఖ చారిత్రక తప్పిదం అని ఒక కథనం ప్రసారం చేసింది. బాబు ఆంతర్యం ఏమిటో వీళ్లకు తెలియకపోయినా తెలంగాణ ప్రజలకు మాత్రం తెలుసు. అందుకే బాబు తెలంగాణపై ఎన్ని కుప్పిగంతులు వేసినా నమ్మలేదు.

తెలంగాణపై తాము చెప్పాల్సింది చెప్పామని తేల్చాల్సింది కేంద్రమే అని బాబు పదేపదే వల్లెవేస్తుంటారు. అందుకే బాబు తెలంగాణపై మరోసారి కేంద్రానికి లేఖ రాయనవసరం లేదు. కానీ ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం మాత్రం ఉన్నది. మొన్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా వచ్చింది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణపై అసెంబ్లీ తీర్మానం కోసం సభను స్తంభింపజేశారు. ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీకి రాష్ట్ర విభజనపై స్పష్టమైన అభిప్రాయం ఉండి ఉంటే అధికార పార్టీని అసెంబ్లీ వేదికగా ప్రశ్నించి ఉండేది. కాంగ్రెస్ పార్టీ కపటనీతి ఎండగట్టి ఉండేది. కానీ టీడీపీ ఆ పని చేయలేదు, చేయదుకూడా. ఎందుకంటే తెలంగాణ విషయంలో ఈ రెండు పార్టీలు దొందూ దొందే. వచ్చిన తెలంగాణను అడ్డుకున్నది ఈ రెండు పార్టీలే. అందుకే ఇవ్వాళ తెలంగాణలో ఈ రెండు పార్టీల మనుగడ ప్రశ్నార్థకం అయ్యింది.

అలాగే బాబుకు ఇప్పుడు తెలంగాణ కంటే చాలా సమస్యలు ఉన్నాయి. మూడు ఫ్రంట్ ద్వారా కేంద్రంలో మళ్లీ చక్రం తిప్పాలి. పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం చాటి చెప్పాలి. తనయుడు లోకేశ్‌ను రాజకీయాల్లో తెరంగేట్రం చేయించాలి. ఇన్ని సమస్యలుండగా తెలంగాణపై స్పష్టత ఎందుకు ఇస్తారు? ఎలాగూ ఈ సమస్యను సాగదీసేందుకు కాంగ్రెస్ పార్టీ ఉండనే ఉన్నది. అందుకే యూపీఏ తెలంగాణ ఇవ్వదని బాబు అన్న వార్తలు కూడా వచ్చాయి. టీడీపీ విస్తృతస్తాయి సమావేశంలో తెలంగాణ అంశం గురించి తర్వాత చూద్దాం అని బాబు దాటవేసినట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీ నాలుగున్నర కోట్ల ప్రజాకాంక్షను నలుగురు పెట్టుబడిదారుల కోసం పక్కనపెట్టినట్టే... బాబు కూడా నలుగురు సీమాంధ్ర టీడీపీ నేతల అభిప్రాయం మేరకే నడుచుకుంటారు. అందుకే బాబుకు రాని డౌటు వారికి వచ్చింది. అఖిలపక్ష భేటీలో మన అభిప్రాయాన్ని చెబుదామని అర్థంలేని వాదన చేస్తారు. ఒకవేళ ఈ లోగా కేంద్రం తెలంగాణపై  ఏదైనా నిర్ణయం తీసుకోవాలని భావిస్తే మరో కొత్తనాటకానికి తెరతీస్తారు.  బాబు మూడేళ్లుగా చేస్తున్నది ఇదే. అందుకే బాబును తెలంగాణ ప్రజలే కాదు సీమాంధ్ర ప్రజలు కూడా విశ్వసించడం లేదు. అది ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లోనూ రుజువైంది. అయినా బాబు మారడు. తన మనసులోని మాట బైట పెట్టడు.
-రాజు

Labels:

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home