Saturday 8 September 2012

ఏకాభిప్రాయం మాట ఎన్నిసార్లు?



దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఎన్నో సమస్యలు వచ్చాయి. వాటిలో చాలావరకు పాలకుల చిత్తశుద్ధి వల్ల కొన్ని పరిష్కారమైతే, వారి అసమర్థత వల్ల కొన్ని అలానే ఉన్నాయి. అంటే కోల్డ్ స్టోరేజీలోకి నెట్టబడినాయి. అలా దశాబ్దాల తరబడి ఒక ప్రజాస్వామిక ఆకాంక్షను తమ అవసరాలకు అనుగుణంగా బయటకు తీయడం తర్వాత దాన్ని పక్కనబెట్టడం ఒక్క తెలంగాణ విషయంలో జరిగిందేమో! అది చేసింది కూడా నూటా పాతికేళ్ల కాంగ్రెస్ పార్టీయే. ప్రపంచ వ్యాప్తంగా చాలా అంశాలు అభిప్రాయభేదాలతోనే పరిష్కారమయ్యాయి కానీ ఏకాభిప్రాయం అనే మాట ఎక్కడా వినిపించలేదు. కానీ తెలంగాణ విషయంలో మాత్రం ఏకాభిప్రాయం అనే మాటను కాంగ్రెస్ నేతలు ఎన్నిసార్లు చెప్పారో వారికే తెలియదు. సరే ఏకాభిప్రాయం కోసం వాళ్లు ఏమైనా కృషి చేశారా అంటే అదీ లేదు. అంతేకాదు ఆ పార్టీలోనే ఏకాభిప్రాయం లేదు. మరి సమస్య ఎలా పరిష్కారం అవుతుంది? మన్మోహన్ అన్న ఏకాభిప్రాయం సమైక్యాంధ్రపై ఉన్నదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పడినప్పుడూ లేదు. ఒప్పందాలపైనే కదా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించింది. అవి సీమాంధ్ర పాలకులు ఉల్లంఘింస్తున్నారనే కదా దశాబ్దాలుగా తెలంగాణ సమస్య రగులుతూనే ఉన్నది. అసలు తెలంగాణపై ఏకాభిప్రాయం రాలేదన్న ప్రధాని మన్మోహన్ ఎంపికపైనే ఏకాభిప్రాయం లేదు. ప్రపంచబ్యాంకుకు తాబేదారుగా వ్యవహరించే మన్మోహన్‌కు ప్రజల మనోభావాలు ఎలా తెలుస్తాయి.

తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారనే విషయాన్ని తాజా ఒక జాతీయ చానల్ నిర్వహించిన సర్వే తేల్చింది. సీమాంధ్రలో కూడా 25 శాతం మంది ప్రజలు దీనికి మద్దతు తెలుపుతున్నారని తెలిపింది. ప్రజల్లో ఉన్న ఆకాంక్షకు పార్టీల ద్వంద్వ వైఖరితో ముడిపెట్టి దానికి ఏకాభిప్రాయం అనే అసంబద్ధ వాదనను ముందుకు తెస్తే అది ఎన్నటికి పరిష్కారం కావాలి?  రాష్ట్రంలో తెలంగాణ సమస్య జటిలం కావడానికి ప్రధాన కారణం కాంగ్రెస్, టీడీపీలు.  ముందు ఈ రెండు పార్టీలు ఈ అంశంపై ఏకాభిప్రాయానికి రావాలి. తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటున్నది తెలంగాణపై ఈ రెండు పార్టీల స్పష్టమైన వైఖరి మాత్రమే. ఈ రెండు పార్టీలు చెబుతున్నట్టు మేం తెలంగాణకు వ్యతిరేకం కాదనే మాటను ఆచరణలో చూపెడితే  పార్లమెంటులో తెలంగాణకు అనుకూలంగా భారీ మెజార్టీ ఖాయం. కానీ అదే సమస్య. టీడీపీ తెలంగాణపై తేల్చాల్సింది కేంద్రమే అని చెబుతుంది. కాంగ్రెస్ పార్టీ ఏకాభిప్రాయం, సంప్రదింపులు, సంక్లిష్ట సమస్య అని కాలయాపన చేస్తుంది. ఈ రెండు పార్టీల వైఖరి వల్ల ఇరు ప్రాంతాల్లోని ప్రజల్లో విద్వేషాలు పెరిగిపోతున్నాయి. అలాగే ప్రధాని చెప్పిన పాత పాటను కొన్ని పత్రికలు ఏకాభిప్రాయం ఎక్కడ అనే పెద్ద పెద్ద శీర్షికలతో హెడ్డింగులు పెట్టాయి. నిజంగా ప్రసారమాధ్యమాలు ప్రజాహితం కోసం పనిచేస్తే ఇంకా ఎంత కాలం పాడుతారు ఈ పాత పాటను అని ప్రధానిని నిలదీయాల్సింది. కానీ అవి ఆ పని చేయలేదు. కానీ తెలంగాణపై చంద్రబాబు స్పష్టత ఇస్తారు అనే మాట అనగానే ఆ పార్టీలోని సీమాంధ్ర నేతలు నిరసన గళం వినిపిస్తున్నారని లేనిపోని కథనాలను మాత్రం అల్లుతున్నాయి. నిజానికి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలు రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం ఏదో ఒకటి తేల్చాలని కోరుకుంటున్నారు. కానీ బాధ్యతాయుతంగా వ్యవహరించవలసిన మీడియా మాత్రం అగ్నికి ఆజ్యంపోసే విధంగా వ్యవహరించడం సరికాదు. అందుకే రాష్ట్ర ప్రజల్లో రాష్ట్ర విభజనపై ఎవరికి మనోభావాలు వారికి ఉన్నాయి. వారి వారి అభిప్రాయాలు కమిటీల ముందు, ఎన్నికల్లోనూ చూపారు. ఇందులో ఏ పేచీ లేదు. సమస్యల్లా పార్టీల వైఖరితోనే. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీలతోనే. ఈ రెండు పార్టీలు వారి పార్టీల్లో తెలంగాణ, సమైక్యాంధ్రలపై ఏదో ఒక క్లారిటీకి వస్తే సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా ఈ అంశంపై గోడపిల్లిలా ఉన్న మిగిలిన పార్టీలు కూడా దారికి వస్తాయి. అందుకే పార్టీలు నిజాయితీగా వ్యవహరిస్తే నిర్ణయం తీసుకోవడం సులభం అవుతుంది. అప్పుడు ఏకాభిప్రాయం రాకున్నా ఏదో అభిప్రాయం మాత్రం చెప్పవచ్చు. ఆ దిశగా పార్టీలు ఆలోచిస్తాయని ఆశిద్దాం.
-రాజు

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home