Tuesday 25 September 2012

ఇది మన్మోహన్‌సింగ్ కాలం!


యూపీఏ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక విధానాలు ఇప్పటివి కావు. మన్మోహన్ సర్కార్ ఎనిమిదిన్న సంవత్సరాలుగా ప్రజాసంక్షేమాన్ని మరిచి కార్పొరేట్ స్వామ్యానికి జై కొడుతూనే ఉన్నారు. అయితే మన్మోహన్ సర్కార్ కూలిపోయే పరిస్థితి వచ్చినప్పుడల్లా సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) తన సహకారాన్ని అందిస్తున్నది. యూపీఏ-1 హయాంలో అమెరికా అణు ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ వామపక్షాలు కేంద్ర ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరించాయి. అప్పుడు అమర్‌సింగ్ (అప్పుడు సమాజ్‌వాదీ పార్టీలో కీలక నేత) సహకారంతో ఎస్పీని దగ్గర చేర్చుకున్నారు. ఆ తర్వాత అమర్‌సింగ్ పరిస్థితి ఏమైందో మనకు విదితమే. కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ అవసరాలకు ఎవరితోనైనా కలిసిపోగలదు.. ఎవరితోనైనా కయ్యం పెట్టుకోగలదు. అందుకే కాంగ్రెస్ పార్టీలో ఛరిష్మా కలిగిన నేతల కంటే ఫ్యూహాలకు పదునుపెట్టే వారి సంఖ్య ఎక్కువ.

ఇప్పుడు కూడా చిల్లర వర్తకంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ)లను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతున్నది. దీన్ని వ్యతిరేకిస్తూ యూపీఏలోని ప్రధాన భాగస్వామ్య పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించింది. దీంతో మన్మోహన్ సర్కార్ ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితి. అయితే యూపీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఎస్పీ తన సైకిల్‌పై మన్మోహన్ సర్కార్ పడిపోకుండా కూర్చోబెట్టుకున్నది. అయితే ఇక్కడో విశేషమున్నది. ములాయం కూడా ఎఫ్‌డీఐలను వ్యతిరేకిస్తున్నారు. కానీ మతతత్వ శక్తులు అధికారంలోకి రాకుండా ఉండేందుకే తాము మన్మోహన్ సర్కార్‌కు మద్దతు తెలుపుతున్నామంటున్నారు. ప్రజావ్యతిరేక విధానాలకు పరోక్ష మద్దతునిస్తూ దానికి ఎస్పీ ఏవో సాకులు చెప్పడం విడ్డూరంగా ఉన్నది. సామాన్యుడిపై మోయలేని భారాన్ని మోపుతూ మన్మోహన్ దానికి సంస్కరణలు పేరు పెడుతున్నారు. ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నా.. వాటిని నియంత్రించలేక చేష్టలుడిగిన కేంద్ర సర్కార్ తాను తీసుకుంటున్న నిర్ణయాలను సమర్థించుకోవడం సిగ్గుచేటు. ఇలాంటి ప్రభుత్వాలకు ఎస్పీ వంత పాడడం ఎంత వరకు సబబో ఎస్పీ అధినేత తెలుసుకోవాలి.
కేంద్ర సర్కార్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తమ అమ్ములపొదిలో ఉన్న సంస్కరణ అస్త్రాన్ని ప్రయోగించడం ఈ ఎనిమిదేళ్లుగా మనం చూస్తున్నదే.  ఏ వెల్గులకీ ఈ సంస్కరణలు అంటే సరైన సమాధానం ఉండదు. పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెంచేస్తూ అదే అభివృద్ధి అని ప్రజలను భ్రమింపజేయ చూస్తున్నది కేంద్ర ప్రభుత్వం. అయితే  మన్మోహన్, మాంటెక్‌సింగ్, చిదంబరం, రంగరాజన్‌ల అభివృద్ధి లెక్కలు మాత్రం ఆకుకు అందడం లేదు, పోకుకు పొందడం లేదు. అగ్రరాజ్యం అనుగ్రహం కోసం భారత్ భాగ్యవంతమైన దేశం అని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇలాంటి ప్రభుత్వాలను ప్రజలు ఎప్పుడు అవకాశం వస్తుందా తమ ఓటుతో వేటు వేద్దామని అనుకుంటుంటే సమాజ్‌వాదీకి మాత్రం అది అర్థం కావడం లేదు. మతతత్వ శక్తులను అడ్డుకునే పేరుతో మన్మోహన్ మరిన్ని ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకునేందుకు రాజమార్గం కల్పించింది.అంతేకాదు మన్మోహన్ సర్కార్ చర్యలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) బాసగా నిలిచింది. ఇక మన్మోహన్ దూకుడు మరింత పెరగనుంది. అది ప్రజలనే కాదు, ప్రాంతీయ పార్టీలను మింగేస్తుంది. బహుపరాక్...
-రాజు

Labels: ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home