Saturday, 21 February 2026

కాంగ్రెస్‌లో స్వేచ్ఛ ఉంది.. వేధింపులు లేవు

  •  అనంతగిరి శిక్షణ తరగతుల్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!

వికారాబాద్ (అనంతగిరి): కాంగ్రెస్ పార్టీ అంటేనే అంతర్గత ప్రజాస్వామ్యానికి మారుపేరని, ఇక్కడ భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసే స్వేచ్ఛ అందరికీ ఉంటుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. వికారాబాద్ జిల్లా అనంతగిరిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన డీసీసీ (DCC) అధ్యక్షుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పార్టీలో ఎవరైనా తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పవచ్చని, అలా చెప్పినంత మాత్రాన వారిని వేధించే సంస్కృతి కాంగ్రెస్‌లో లేదని స్పష్టం చేశారు. అయితే, నాయకులు తమలో తాము కొట్లాడుకుంటే పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడే లక్షలాదిమంది కార్యకర్తలకు అన్యాయం చేసినట్లవుతుందని ఆయన హెచ్చరించారు.



నెహ్రూ-గాంధీ కుటుంబాల త్యాగాలను స్మరించుకుంటూ, మోతీలాల్ నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ వరకు దేశం కోసం చేసిన పోరాటాలను రేవంత్ రెడ్డి వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువయ్యారని, అదే స్ఫూర్తితో తాము కూడా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తాను పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, కొంతమంది నుంచి వ్యతిరేకత ఎదురైనప్పటికీ అందరినీ కలుపుకునిపోయి మెరుగైన ఫలితాలు సాధించామని గుర్తుచేశారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి సముచిత స్థానం లభిస్తుందని, ఎమ్మెల్యే టికెట్లు రాని వారికి ఎమ్మెల్సీలుగా, కార్పొరేషన్ ఛైర్మన్లుగా అవకాశం కల్పించడమే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.


నాయకుల ఎంపికలో ఎటువంటి 'సిఫార్సుల జాబితాలకు' చోటులేదని, కేవలం 'మెరిట్' ఆధారంగానే పదవులు వస్తాయని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డీసీసీ అధ్యక్ష పదవి అనేది ఎంతో బాధ్యతాయుతమైనదని, దీనిని సమర్థవంతంగా వినియోగించుకుంటే భవిష్యత్తులో పీసీసీ అధ్యక్షులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, చివరకు ముఖ్యమంత్రులుగా కూడా ఎదిగే అవకాశం ఉంటుందని ఆయన ఉద్బోధించారు. ఎన్నికలకు సమగ్రంగా సన్నద్ధమవ్వడమే కాకుండా, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారితో నిరంతరం అనుసంధానమై ఉండాలని డీసీసీ నేతలకు దిశానిర్దేశం చేశారు.

No comments:

Post a Comment

Featured post

అస్సాం అసెంబ్లీ పోరు: కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష

ప్రియాంక గాంధీ ముందున్న సవాళ్లు ఇవే డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కిం...