- ఇజ్రాయెల్, ఇరాన్ విదేశాంగ మంత్రులతో జైశంకర్ కీలక మంతనాలు
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరిన వేళ, శాంతి స్థాపన కోసం భారత్ తన దౌత్యపరమైన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. శనివారంభారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ ఇటు ఇజ్రాయెల్, అటు ఇరాన్ విదేశాంగ మంత్రులతో వేర్వేరుగా ఫోన్లో మాట్లాడారు. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియాన్ సార్తో మాట్లాడిన జైశంకర్, ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు చర్చలు, దౌత్య మార్గమే సరైనవని భారత్ తరపున పునరుద్ఘాటించారు. ఆ తర్వాత ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్చీతో టెలిఫోన్ ద్వారా సంభాషిస్తూ, ఇరాన్, ఆ ప్రాంతంలో చోటుచేసుకున్న తాజా పరిణామాల పట్ల భారత్ పడుతున్న "తీవ్ర ఆందోళన"ను ఆయన వ్యక్తం చేశారు.
అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన 'ఆపరేషన్ రోరింగ్ లయన్' దాడుల అనంతరం ఇరాన్ క్షిపణి దాడులతో విరుచుకుపడుతుండటంతో ఈ ప్రాంతం యుద్ధ క్షేత్రంగా మారింది. ఈ నేపథ్యంలో జైశంకర్ జరిపిన ఈ మంతనాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇరుపక్షాలు సంయమనం పాటించాలని, హింసను వీడి శాంతి వైపు అడుగులు వేయాలని భారత్ కోరుతున్నది. ఇప్పటికే సిరియా, ఇరాన్ , యూఏఈలో చిక్కుకుపోయిన భారతీయ పౌరుల భద్రత గురించి జైశంకర్ ఆయా దేశాల ప్రతినిధులతో చర్చించారు. ముఖ్యంగా ఇరాన్లో వైద్య విద్యనభ్యసిస్తున్న వెయ్యి మందికి పైగా కశ్మీరీ విద్యార్థుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో, భారత విదేశాంగ శాఖ వారి రక్షణ కోసం నిరంతరం పర్యవేక్షిస్తున్నది. మరోవైపు, సిరియాలోని భారత రాయబార కార్యాలయం తమ పౌరులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని, స్థానిక అధికారుల సూచనలను పాటించాలని కోరింది.
No comments:
Post a Comment