Monday, 23 February 2026

ఉదయ్ భాను చిబ్‌కు 4 రోజుల కస్టడీ

 

  • కేంద్రంపై ఖర్గే, రాహుల్ ఘాటు విమర్శలు
  • యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి అరెస్టుతో ఢిల్లీలో పొలిటికల్ హీట్



న్యూఢిల్లీ: దేశ రాజధానిలో జరిగిన అంతర్జాతీయ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సమ్మిట్ వేదికగా సాగిన నిరసనలు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. భారతీయ యువ కాంగ్రెస్ (IYC) జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయగా, కోర్టు ఆయనకు నాలుగు రోజుల పోలీసు కస్టడీ విధించింది. ఈ పరిణామంపై కాంగ్రెస్ అగ్ర నాయకత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ఏఐ సదస్సు వద్ద ఉద్రిక్తతలకు కారణమయ్యారనే ఆరోపణలతో అరెస్టయిన ఉదయ్ భానును పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఈ నిరసన వెనుక ఉన్న కుట్రను ఛేదించడానికి, ఇతర నిందితులను గుర్తించడానికి ఆయనను విచారించాల్సి ఉందని పోలీసులు వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, ఉదయ్ భాను చిబ్‌కు 4 రోజుల పోలీసు కస్టడీ విధిస్తూ నిర్ణయం తీసుకుంది.


  • కేసు నేపథ్యం

భారత్ మండపంలో అంతర్జాతీయ ఏఐ సమ్మిట్ జరుగుతున్న తరుణంలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు వినూత్నంగా నిరసన తెలిపారు. నిరుద్యోగం, పెరుగుతున్న ధరలు,  భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాలను నిరసిస్తూ కార్యకర్తలు తమ చొక్కాలు విప్పి  ఆందోళన చేపట్టారు. "ప్రధాని రాజీ పడ్డారు" (PM is compromised) అనే నినాదాలతో కూడిన టీ-షర్టులను ప్రదర్శిస్తూ సదస్సు వేదిక వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో నిషేధాజ్ఞలు ఉల్లంఘించినందుకు ఉదయ్ భానుపై కేసు నమోదైంది.



  • బబ్బర్ షేర్ కామ్రేడ్స్.. భయపడకండి: రాహుల్ గాంధీ భరోసా

యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి అరెస్టుపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు. తన కార్యకర్తలను "బబ్బర్ షేర్" (సింహాల్లాంటి వారు) గా అభివర్ణించిన రాహుల్.. ప్రభుత్వం భయపడి నిజాన్ని అణచివేయాలని చూస్తున్నదని విమర్శించారు. నిరసన తెలపడం మన వారసత్వమని, రైతులు, పరిశ్రమల నష్టాల గురించి ప్రశ్నించడం నేరం కాదని, అది దేశభక్తి అని ఆయన పేర్కొన్నారు.





  • కాంగ్రెస్ పిరికి పార్టీ కాదు: మల్లికార్జున ఖర్గే హెచ్చరిక

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ అరెస్టును నిరంకుశ చర్యగా అభివర్ణించారు. ప్రజల సమస్యల నుండి దృష్టి మళ్లించేందుకే కేంద్రం ఇలాంటి అరెస్టులకు పాల్పడుతున్నదని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి బెదిరింపులకు భయపడదని, ప్రజల పక్షాన తమ పోరాటం మరింత ఉధృతం అవుతుందని కేంద్రానికి హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ఎత్తున ఆందోళనలకు సిద్ధమవుతుండటంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

No comments:

Post a Comment

Featured post

దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి కన్నుమూత

  న్యూఢిల్లీ: దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి (71) కన్నుమూశారు. 1980, 1990 దశకాల్లో దూరదర్శన్‌ వార్తా ప్రసారాల్లో పరిచయమైన ...