Thursday, 26 February 2026

ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు


దేశంలో సరికొత్త 'గ్రేడ్-బేస్డ్' డ్రైవింగ్ లైసెన్స్ విధానం

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటన

న్యూఢిల్లీ: దేశంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు వాహనదారుల్లో బాధ్యతాయుతమైన డ్రైవింగ్‌ను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇకపై ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారి కోసం 'గ్రేడ్-బేస్డ్' (పాయింట్ల ఆధారిత) డ్రైవింగ్ లైసెన్స్ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. న్యూఢిల్లీలో జరిగిన 'రోడ్డు భద్రత జాతీయ సదస్సు'లో ఆయన మాట్లాడుతూ, నిబంధనలు అతిక్రమించిన ప్రతిసారీ లైసెన్స్ నుంచి పాయింట్లు కోత పడతాయని, అన్ని పాయింట్లు కోల్పోయిన పక్షంలో ఆ వ్యక్తి లైసెన్స్‌ను ఆరు నెలల పాటు సస్పెండ్ చేయడం లేదా శాశ్వతంగా రద్దు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కొత్త విధానాన్ని అతి త్వరలోనే దేశవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.



దేశంలో  ఏటా సుమారు 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, అందులో 1.8 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, అతి వేగం, రాంగ్ సైడ్ డ్రైవింగ్ , మద్యం సేవించి వాహనం నడపడం వల్లే అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. మరణించిన వారిలో 72 శాతం మంది 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు గల యువకులే ఉండటం దేశానికి తీరని లోటని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హెల్మెట్లు ధరించకపోవడం వల్ల 54 వేల మంది, సీట్ బెల్టులు పెట్టుకోకపోవడం వల్ల 14 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని గణాంకాలను వివరించారు. ప్రభుత్వం జరిమానాలను పెంచినప్పటికీ, ప్రజల్లో చట్టం పట్ల భయం లేకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని, అందుకే ఈ కఠినమైన పాయింట్ల విధానాన్ని తీసుకువస్తున్నామని వివరించారు.


అదేవిధంగా, రోడ్డు ప్రమాద బాధితులను కాపాడేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'పీఎం రాహత్'  పథకం గురించి మంత్రి ప్రజలకు అవగాహన కల్పించారు. ఏ రకమైన రహదారిపైనైనా ప్రమాదానికి గురైన బాధితులకు, ఎటువంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండానే రూ. 1.5 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం లభిస్తుందని తెలిపారు. ప్రమాదం జరిగిన మొదటి ఏడు రోజుల పాటు ఈ నగదు రహిత చికిత్స అందుబాటులో ఉంటుందని, కాబట్టి చట్టపరమైన ఇబ్బందులు లేదా చికిత్స ఖర్చుల గురించి భయపడకుండా బాధితులను ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. రోడ్డు భద్రత అనేది కేవలం ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడు ట్రాఫిక్ నిబంధనలను గౌరవించినప్పుడే మరణాల సంఖ్యను తగ్గించగలమని ఆయన స్పష్టంగా చెప్పారు.

No comments:

Post a Comment

Featured post

లైక్స్, వ్యూస్ అన్నీ మోసం.. ఏవైనా కొనొచ్చు!

పాటల సక్సెస్‌పై శ్రేయా ఘోషల్ సంచలన వ్యాఖ్యలు  అసలైన విజయం అంటే ఇదే! న్యూఢిల్లీ: నేటి డిజిటల్ యుగంలో ఒక పాట విజయవంతమైందా లేదా అన్నది సోషల్ మీ...