- భారతీయులు వెంటనే దేశం విడిచి రావాలని ఎంబసీ హెచ్చరిక
- అత్యవసరమైతే తప్ప వెళ్లవద్దని సూచన!
టెహ్రాన్/న్యూఢిల్లీ: ఇరాన్ దేశవ్యాప్తంగా చెలరేగుతున్న తీవ్రమైన ప్రభుత్వం వ్యతిరేక నిరసనలు, అశాంతి నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న భారతీయ పౌరులకు భారత రాయబార కార్యాలయం (Indian Embassy) అత్యవసర హెచ్చరికలను జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితులు రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతున్నందున, ఇరాన్లో ఉన్న భారతీయులందరూ వీలైనంత త్వరగా ఆ దేశాన్ని విడిచి సురక్షిత ప్రాంతాలకు లేదా స్వదేశానికి రావాలని ఎంబసీ గట్టిగా సూచించింది. ముఖ్యంగా నిరసనలు ఉధృతంగా ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్న వారు తక్షణమే ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని కోరింది.
ఇరాన్లో పరిస్థితులు చక్కబడే వరకు భారత పౌరులెవరూ అత్యవసరమైతే తప్ప ఆ దేశానికి ప్రయాణించవద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే అక్కడ ఉన్న వారు స్థానిక చట్టాలను గౌరవిస్తూ, నిరసనలకు లేదా జన సమూహాలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. తమ భద్రతకు సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయాన్ని లేదా బందర్ అబ్బాస్లోని కాన్సులేట్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచిస్తూ అత్యవసర హెల్ప్లైన్ నంబర్లను కూడా అందుబాటులోకి తెచ్చింది.
ప్రభుత్వ వ్యతిరేక నిరసనల కారణంగా ఇరాన్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడం, రవాణా వ్యవస్థకు ఆటంకాలు కలగడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని, పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని విదేశాంగ శాఖ తెలిపింది. ఇరాన్లో ఉన్న విద్యార్థులు, ఉద్యోగులు , పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని, ఎంబసీ ఇచ్చే తదుపరి సూచనలను క్రమం తప్పకుండా అనుసరించాలని అధికారులు కోరారు.
No comments:
Post a Comment