- వారం రోజుల ఉత్కంఠకు తెర
రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లాలో వారం రోజులుగా హడలెత్తిస్తున్న పులి చివరకు అటవీశాఖ అధికారులకు చిక్కింది. కూర్మాపురం గ్రామంలోని వ్యవసాయ పొలాల సమీపంలో ఉన్న ఒక పశువుల పాకలో దాక్కున్న మూడేళ్ల మగ పులిని అధికారులు మత్తుమందు ఇచ్చి బంధించారు. ఈ ఘటనతో స్థానిక గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.
- సుదీర్ఘ సెర్చ్ ఆపరేషన్
అటవీశాఖ జిల్లా అధికారి వి. ప్రభాకర్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ పులి జనవరి 20 నుంచి ఏలూరు జిల్లాలో సంచరిస్తూ, జనవరి 31న తూర్పుగోదావరి జిల్లా అటవీ పరిధిలోకి ప్రవేశించింది. మహారాష్ట్రలోని తాడోబా అటవీ ప్రాంతం నుంచి తెలంగాణ మీదుగా వందల కిలోమీటర్లు ప్రయాణించి, గోదావరి నది వెంట ఇక్కడికి వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. గత వారం రోజులుగా ఈ ప్రాంతంలో సంచరిస్తున్న పులి, ఎనిమిది పశువులను (నాలుగు ఆవులు, నాలుగు దూడలు) చంపింది. పులిని పట్టుకోవడానికి అటవీశాఖ అధికారులు ట్రాప్లు, డ్రోన్లు, థర్మల్ కెమెరాలు, బోన్లను ఏర్పాటు చేశారు. విజయవాడ, విశాఖపట్నం (ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్), మహారాష్ట్రలోని పుణే నుంచి వచ్చిన నిపుణులతో కూడిన బృందాలు ఈ ఉమ్మడి ఆపరేషన్లో పాల్గొన్నాయి.
మత్తుమందు
పులి చాలా కోపంగా ఉండటంతో, నివాస ప్రాంతాలకు సమీపంలో ఉన్నందున, గ్రామస్తులకు ఎటువంటి హాని కలగకుండా అత్యంత జాగ్రత్తగా మత్తుమందును ఉపయోగించి బంధించారు. పులిని తదుపరి పరిశీలన, పునరావాసం కోసం విశాఖపట్నంలోని ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్కు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, వన్యప్రాణుల సంచారం కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.
No comments:
Post a Comment