- ఒకే ఫోన్ కాల్తో వ్యవసాయ సమాచారం పొందండి
వ్యవసాయ రంగంలో సాంకేతిక విప్లవాన్ని తీసుకురావడమే లక్ష్యంగా కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రైతులకు డిజిటల్ తోడుగా నిలిచే 'భారత్ విస్తార్' (Bharat Vistaar) వేదికను జైపూర్లో ఆవిష్కరించారు. రైతులను స్మార్ట్గా, సమాచారంతో బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన ఈ వినూత్న కార్యక్రమం ద్వారా, రైతులు తమ మొబైల్ ఫోన్ల నుంచి ఒకే ఒక్క కాల్తో వ్యవసాయానికి సంబంధించిన అన్నిరకాల అవసరమైన సమాచారాన్ని పొందవచ్చు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. 'భారత్ విస్తార్' వ్యవసాయ రంగంలో డిజిటల్ విప్లవం దిశగా చరిత్రాత్మక అడుగు అని అభివర్ణించారు. ఈ వేదిక ద్వారా రైతులకు పంట ఆధారిత శాస్త్రీయ సలహాలు, మండి ధరలు, వాతావరణ సమాచారం అందుతాయని ఆయన స్పష్టం చేశారు. డిజిటల్ ఇండియా దార్శనికతను గ్రామీణ భారతానికి విస్తరించడంలో ఈ చొరవ నిర్ణయాత్మకంగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రైతుల ఆదాయాన్ని పెంచడానికి, వారిని కేవలం వ్యవసాయంతో మాత్రమే కాకుండా పశుసంవర్ధకంతో కూడా అనుసంధానం చేయడం అవసరమని, ఇందుకు సాంకేతికత కీలకమని ఆయన నొక్కి చెప్పారు.
ఈ డిజిటల్ కార్యక్రమాన్ని రైతుల విప్లవానికి నాందిగా అభివర్ణించిన రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, రైతులు దీనిని గరిష్టంగా ఉపయోగించుకోవాలని కోరారు. దుర్గాపురలోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ మేనేజ్మెంట్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి డాక్టర్ కిరోరి లాల్ మీనా, రైతులు సమగ్ర వ్యవసాయ సేవలను, సమాచారాన్ని తమ స్వంత భాషలోనే ఒకే ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ప్లాట్ఫారమ్లో పొందవచ్చని తెలిపారు.
No comments:
Post a Comment