- ఆమాల్ మల్లిక్ సంచలన వ్యాఖ్యలు!
ముంబై: కార్తీక్ ఆర్యన్ నటించిన 'భూల్ భులయ్యా 3' చిత్రంలోని ఐకానిక్ సాంగ్ "మేరే ధోల్నా 3.0" రికార్డింగ్ వెనుక జరిగిన ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన విషయాలను సంగీత దర్శకుడు ఆమాల్ మల్లిక్ వెల్లడించారు. ఈ పాట కోసం తాను సోనూ నిగమ్ను ఎంపిక చేయగా, చిత్ర యూనిట్లోని కొందరు మాత్రం ఆయన వద్దని అడ్డుచెప్పారని ఆమాల్ తెలిపారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. ప్రస్తుతం హిందీ చిత్ర పరిశ్రమలో సంగీత దర్శకులకు తమకు నచ్చిన గాయకులను ఎంచుకునే స్వేచ్ఛ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. సోనూ నిగమ్ వంటి దిగ్గజ గాయకుడిని కూడా అనుమానించడం, ఆయన ప్రతిభకు పరీక్ష పెట్టాలనుకోవడం అత్యంత విచారకరమని ఆయన పేర్కొన్నారు.
- అసలు ఏం జరిగిందంటే..
ఈ పాట కంపోజ్ చేసేటప్పుడు ప్రొడక్షన్ టీమ్, నటుడి మేనేజ్మెంట్ టీమ్ నుంచి సోనూ నిగమ్కు బదులుగా అరిజిత్ సింగ్ లేదా విశాల్ మిశ్రాలను తీసుకోవాలని ఒత్తిడి వచ్చిందట. "నిర్మాత భూషణ్ కుమార్, దర్శకుడికి సోనూ నిగమ్ మీద నమ్మకం ఉన్నా, మార్కెటింగ్ టీమ్, నటుడి టీమ్ మాత్రం ఆయన వద్దని వారించారు. కానీ, శాస్త్రీయ సంగీతంలో పట్టున్న సోనూ సర్ మాత్రమే ఈ పాటకు పూర్తి న్యాయం చేయగలరని నేను గట్టిగా నమ్మాను. ఇప్పుడు ఆ పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరం చూస్తున్నాం" అని ఆమాల్ మల్లిక్ వివరించారు. టాలెంట్ ఉన్న లెజెండ్స్ కూడా ఈ రోజుల్లో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావడం ఇండస్ట్రీ పరిస్థితికి అద్దం పడుతున్నదని ఆయన వ్యాఖ్యానించారు.
No comments:
Post a Comment