గౌహతి: బీజేపీ కార్యకర్తగా ఉండటమే తన జీవితంలో అత్యున్నత గౌరవమని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. అసోం పర్యటనలో భాగంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, పార్టీ కార్యకర్తల కృషి వల్లే బీజేపీ ఈ స్థాయికి చేరుకుందని కొనియాడారు. సంస్థాగత బలంపై తమకు ఎంతో విశ్వాసం ఉందని, "భారత్ మాతా కీ జై" అనే ఒకే మంత్రంతో అందరం ఐక్యంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోడీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ఈశాన్య ప్రాంతాన్ని చాలాకాలం పాటు నిర్లక్ష్యం చేసిందని ఆయన ఆరోపించారు. తమ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని 'అష్టలక్ష్మి'గా పరిగణిస్తుందని, దీనిని ఆర్థికంగా స్వతంత్రంగా మార్చేందుకు కట్టుబడి ఉన్నామని ప్రధాని స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని, ఒకప్పుడు పేలవమైన రోడ్లు ఉంటే, నేడు విమానాలు కూడా ల్యాండ్ అయ్యే స్థాయికి హైవేలు అభివృద్ధి చెందాయని ఆయన వివరించారు.
పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన భద్రతా సిబ్బందికి ప్రధాని నివాళులర్పించారు. దేశంపై ఉగ్రవాద చర్యలకు పాల్పడిన వారిని శిక్షించే సామర్థ్యం భారత్కు ఉందని, 'ఆపరేషన్ సింధూర్' ద్వారా భారత్ శక్తిని ప్రపంచం చూసిందని ఆయన గుర్తుచేశారు. ఈశాన్య ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రధాని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment