Thursday 18 November 2021

కొనుగోలు డిమాండుతో కేంద్రంతో కొట్లాట


ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద చేపట్టిన మహాధర్నాలో పాల్గొన్న కేసీఆర్‌ మాట్లాడారు.


‘‘మా ప్రశ్న ఒక్కటే.. తెలంగాణ వడ్లు కొంటారా.. కొనరా?’’ అని సీఎం కేసీఆర్‌ కేంద్రాన్ని ప్రశ్నించారు. రైతులు కొత్త కోరికలు కోరడం లేదన్నారు. పండించిన పంట కొంటారా.. కొనరా? అనే అడుగుతున్నారన్నారు. కేంద్రం అడ్డగోలుగా మాట్లాడుతున్నదని అన్నారు రైతుల గోస తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా ఉందని ఆయన అన్నారు. 


ఇది ఆరంభం మాత్రమే అని అన్నారు. కేసీఆర్ చాలా కాలంగా కేంద్రం బీజేపీ, కాంగ్రెస్ ఏతర కూటమి ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ, యూపీఏ  కూటముల్లో దేనికీ స్పష్టమైన మెజారిటీ రాదనే అంచనాల్లో టీఆర్ ఎస్ అధినేత ఉన్నారు. కాబట్టి కేంద్రంలో ఎవరు అధికారంలోకి రావలన్నా ప్రాంతీయ పార్టీలే కీలకం అనేది కేసీఆర్ వాదన. బెంగాల్ గెలిచిన తర్వాత తృణమూల్ అధినేత కూడా ఇతర రాష్ట్రాల్లో తన ప్రాబల్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నది. ఆప్ కూడా అదే బాటలో ఉన్నది. పంజాబ్, గోవా లలో ఎవరు అధికారంలోకి రావాలన్నా ఆప్ మద్దతు అవసరం అన్నది ఇటీవల వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ద్వారా తెలుస్తున్నది.  శివసేన కూడా మొన్న లోక్ సభ ఉప ఎన్నికల్లో మహారాష్ట్ర అవతల దాద్రా నగర్ హవేలి లో జెండా ఎగురవేసింది. మొన్న జరిగిన వివిధ రాష్ట్రాల్లో జరిగిన 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగింది. అందుకే మహాధర్నా వేదిక ద్వారా వరి కొనుగోలు అంశంతో పాటు దేశం ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను కేసీఆర్ ప్రస్తావించారు.


‘‘ఏడాదిగా దేశ వ్యాప్తంగా రైతులు నిరసన చేస్తున్నారు. సాగు చట్టాలు వద్దని డిమాండ్‌ చేస్తున్నారు. రైతులను బతకనిస్తారా? బతకనివ్వరా? నిజాలు చెప్పలేక కేంద్రం అడ్డగోలు వాదనలు చేస్తున్నది అన్నారు. దేశంలో 40 కోట్ల ఎకరాల భూములున్నాయి. అద్భుతమైన శాస్త్రవేత్తలు ఉన్నారు. బంగారం పండే భూములను నిర్లక్ష్యం చేస్తున్నారు. భారత్‌ ఆకలి రాజ్యమని హంగర్ ఇండెక్స్ లో వెల్లడైందని, ఆకలి సూచీలో పాకిస్థాన్‌ కంటే దిగువన భారత్‌ ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. ఉత్తర భారత రైతులు డిల్లీలో ఆందోళనలు చేస్తున్నారు. దేశాన్ని పాలించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. మేం తెచ్చిన సాగు విధానాలతో రైతులోకం ఓ దరికి వచ్చింది. దిక్కుమాలిన కేంద్రం బుర్రలు పని చేయడం లేదు. ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం చెప్పింది. కేంద్రం తీరుతోనే ఇష్టం లేకున్నా ధాన్యం సాగు వద్దని చెప్పాం. వరికి ప్రత్యామ్నాయ పంటలు వేయమని కోరాం.

ఈ వ్యాఖ్యల వెనుక రాజకీయ వ్యూహాలు ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్ యేతర పార్టీలతో కలసి కార్యాచరణ రూపొందించి పోరాడాలనే ఆలోచన ఉండి ఉండొచ్చు. అట్లనే ధాన్యం కొనుగోలు విషయం కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయాలు, రాష్ట్ర బీజేపీ నాయకత్వ రాజకీయ విధానాల్లో వ్యత్యాసం కనిపిస్తున్నది. ఇదే విషయాన్ని ప్రజల్లో చర్చకు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇటు కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నది. రానున్న శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశం చర్చకు వస్తే అసలు విషయం వెల్లడి అవుతుంది. అప్పుడుఎవరు ఏమిటి అన్నది ప్రజలకు బోధపడుతుంది. అప్పటిదాకా ఎవరి వాదనలు వారు వినిపిస్తూనే ఉంటారు.

Tuesday 16 November 2021

ఎమ్మెల్సీ అభ్యర్థుల కూర్పులో కేసీఆర్ మార్కు


ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను టీఆర్ ఎస్ అధినేత ఖరారు చేశారు. మండలి మాజీ ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, బండ ప్రకాశ్‌, కౌశిక్‌రెడ్డి, సిద్దిపేట మాజీ కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్‌రావులను అభ్యర్థులుగా ప్రకటించారు. ఈ ఆరుస్థానాల్లోనూ ఎన్నిక ఏకగ్రీవం కానున్నది.



అధికార పార్టీ కి ఉన్న సంఖ్యా బలానికి తోడు వారి మిత్రపక్షమైన ఎం ఐ ఎం సభ్యుల మద్దతుతో ఈజీగాఎమ్మెల్యే ల కోటాలో ఆరు స్థానాలు గెలిచే అవకాశం ఉన్నది. ఎమ్మెల్సీ పదవుల కోసం అధికార పార్టీలో ఆశావహుల జాబితా పెద్దగానే ఉన్నది.  సోమవారం పొద్దుగాల నుండే గుత్తా సుఖేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, కౌశిక్‌రెడ్డి, కోటిరెడ్డి, ఆకుల లలిత, ఎర్రోళ్ల శ్రీనివాస్‌, మధుసూదనాచారి, మరికొందరు ఆశావహుల పేర్లపై సీఎం కేసీఆర్‌ టీఆర్ఎస్ ముఖ్యనేతలతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. సిద్దిపేట మాజీ కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డికి గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలని భావించారు. కానీ చివరికి ఎమ్మెల్యే కోటా కిందే ఆయనను ఎంపిక చేశారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండ ప్రకాశ్‌ను అనూహ్యంగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఈటల రాజేందర్ పార్టీ నుంచి బైటికి పోవడం, బీజేపీ నుంచి తిరిగి ఎమ్మెల్యేగా గెలవడం జరిగిపోయాయి.  మొన్న ఉప ఎన్నికల్లో ముదిరాజ్ సామాజిక ఓట్లలో మెజారిటీ ఈటలకే పడ్డాయి. అందుకే భవిష్యత్తు ను దృష్టిలో పెట్టుకొని ఆ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో ఆయన్ను ఎంపిక చేసినట్లు తెలుస్తున్నది. అంతేకాదు కేబినెట్‌ విస్తరణలోనూ బండ ప్రకాశ్‌కు చోటు కల్పించే అవకాశం ఉన్నట్లు అధికారపార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. బండ ప్రకాశ్‌ స్థానంలో రాజ్యసభకు కల్వకుంట్ల కవితను పంపుతారు అంటున్నారు. 

ఇక గవర్నర్ కోటా లోఎమ్మెల్సీకి కౌశిక్‌ రెడ్డి పేరును ప్రతిపాదించారు. అది పెండింగ్ లో ఉండటంతోతాజాగా ఆయన్ను ఎమ్మెల్యే కోటాలో ఎంపిక చేశారు. దీంతో గవర్నర్‌ కోటాకు మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్, ఎర్రోళ్ల శ్రీనివాస్ ల పేర్లు ప్రచారం ఉన్నాయి. ఇంకా వీరితో పాటు చాలా మంది ఎమ్మెల్సీ సీటును ఆశిస్తున్నారు. కేసీఆర్ ఎవరి పేరు ఫైనల్ చేస్తారన్నది చూడాలి. తాజా ఎమ్మెల్సీ కూర్పులో కేసీఆర్ కంప్లీట్ మార్క్ కనిపిస్తున్నది.








   





Labels: , ,