Tuesday 31 August 2021

కష్టకాలంలో కాంగ్రెస్


వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని గద్దెదింపడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ పావులు కదుపుతున్నది. ఇందుకోసం ఇటీవల 19 పార్టీలతో వర్చువల్‌ సమావేశం కూడా నిర్వహించింది. దేశ క్షేమం కోసం మనమంతా కలిసి పనిచేయడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని సోనియాగాంధీ ఆ సమావేశంలో స్పష్టం చేశారు. అలాగే ప్రజాసమస్యలపై ఐక్యపోరాటం చేయాలని నిర్ణయించారు. ఇంతవరకు బాగానే ఉన్నది. కాంగ్రెస్‌ పార్టీ వివక్ష పార్టీలను ఏకం చేసే పనిపెట్టుకున్నది. కానీ ఆ పార్టీలో నెలకొన్న అంతర్గత సమస్యలను పరిష్కరించకుండా విపక్ష పార్టీలకు సారథ్యం ఎలా వహిస్తుంది? జాతీయస్థాయిలో కాంగ్రెస్‌ పార్టీకి పటిష్ట నాయకత్వం లేదు. దీనికితోడు ఎన్నికల్లో వరుస ఓటములతో క్యాడర్‌లో నైరాశ్యం నెలకొన్నది. పార్టీలో అంతర్గతంగా అసమ్మతి రాగం కొంతకాలంగా కొనసాగుతున్నది. ఫలితంగా మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోయింది. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ర్టాలలో సీఎం కుర్చీ కోసం కొట్లాట నడుస్తున్నది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరిగే ఏడు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని ఎలా సమాయత్తం చేస్తుంది. ఈ ఎన్నికల ఫలితాలే 2024 పార్లమెంటు ఎన్నికలను ప్రభావితం చేస్తాయి.


2022లో జరిగే ఏడు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ  పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, మణిపూర్‌, గోవాలో నేరుగా ఎదురుకోనున్నది. ఇందులో గోవాలో గోవా ఫార్వార్డ్‌ పార్టీ (జీఎస్‌పీ) 2022 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసే ప్రయత్నాలు చేస్తున్నది. ఇక పంజాబ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీలో సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌, కొత్తగా ఎన్నికైన పీసీపీ అధ్యక్షుడు సిద్దూ వర్గాల మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తున్నది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న పరిస్థితుల్లో ఇరువురు నాయకుల మధ్య నెలకొన్న ఆధిపత్యపోరు పంజాబ్‌లో పరిస్థితులు ప్రతికూలంగా మారే అవకాశం ఉన్నది. కేంద్రంలో అధికారాన్ని అందించే అతిపెద్ద రాష్ట్రం యూపీ. అక్కడ కాంగ్రెస్‌ పార్టీ మూడుదశాబ్దాలుగా మనుడగ పోరాటం చేస్తున్నది. యూపీ సీఎం ఆదిత్యనాథ్‌, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ ఇప్పటికే ఎన్నికల వ్యూహరచన చేస్తున్నారు. ఈ సమయంలో కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేసి, ఎన్నికలకు సిద్ధం చేయాల్సిన బాధ్యత ప్రియాంక వాగ్రాపై పడింది. ఉత్తరాఖండ్‌లోనూ మాజీ సీఎం హరీశ్‌సింగ్‌ రావత్‌, ఆ రాష్ట్ర మాజీ పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ ప్రీతమ్‌ సింగ్‌ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఒకే సంవత్సరంలో ఇద్దరు ముఖ్యమంత్రులను మార్చి రాజకీయంగా ఇబ్బందులు కొనితెచ్చుకున్న కమలం పార్టీని ఎదుర్కొని కాంగ్రెస్‌ పార్టీ అధికారాన్ని దక్కించుకునే అవకాశాలను అంతర్గత కుమ్ములాటలతో చేజార్చుకుంటున్నది. అలాగే కీలక రాష్ట్రం గుజరాత్‌లో కాంగ్రెస్‌ పార్టీ చేతులు ఎత్తేసింది. ఆ రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. దీనికి బాధ్యత వహిస్తూ రాష్ట్రస్థాయి కీలక నేతలైన పీసీసీ అధ్యక్షుడు అమిత్‌ చావ్లా, ప్రతిపక్ష నేత పరేశ్‌ ధనాని రాజీనామా చేశారు. రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి రాజీవ్‌ సతావ్‌ చనిపోయి నాలుగు నెలలు దాటింది. దీంతో కీలకమైన మూడు పదవులకు పూర్తి స్థాయి నియామకాలు జరగలేదు. దీంతో నాయకులు లేని కాంగ్రెస్‌ క్యాడర్‌లో అయోమనం నెలకొన్నది. హిమాచల్‌ ప్రదేశ్‌లోనూ అంతే. ఆ రాష్ట్ర మాజీ సీఎం వీరభద్రసింగ్‌ మరణం కాంగ్రెస్‌ పార్టీకి పెద్దలోటే అంటున్నారు. అక్కడ బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నది. ఈ అవకాశాన్ని కాంగ్రెస్‌ పార్టీ అందిపుచ్చుని అధికారాన్ని కైవసం చేసుకునే ప్రయత్నాలు ఏవీ మొదలుపెట్టలేదు. ఇట్లా కాంగ్రెస్‌ పార్టీ ఒంటరిగా పోటీచేసే రాష్ర్టాల్లో అంతర్గత కలహాలు, భాగస్వామ్య పార్టీలతో కలిసి పోటీచేసే చోట విభేదాలు పరిష్కరించుకోనంత కాలం కాంగ్రెస్‌ పార్టీకి కష్టకాలమే.

Labels:

ప్రత్యక్ష తరగతులు-ప్రమాద హెచ్చరికలు

 


సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి బడులు తెరువాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దాదాపు ఏడాదిన్నర కాలం తర్వాత స్కూళ్లు ప్రారంభం కావడం సంతోషమే. కానీ కరోనా థర్డ్‌వేవ్‌ ప్రమాదం పొంచి ఉన్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరిస్తూనే ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉన్నదని చెప్తున్నది. ఈ విషయాల సంగతి ఎలా ఉన్నా పిల్లల ప్రాణాలతో చెలాగాటం వద్దు అన్నది మెజారిటీ ప్రజల నుంచి వస్తున్న డిమాండు. సుదీర్ఘకాలం ప్రత్యక్ష తరగతులకు దూరంగా ఆన్‌లైన్‌ క్లాస్‌లతో పాఠాలు వింటున్న పిల్లల మానసికస్థితి దెబ్బతింటుందన్న వైద్య నిపుణుల మాటలు నిజమే. కానీ ఏడాదిన్నర కాలంగా బడులు బంద్‌. పారిశుద్ధ్యం అనేది లేకపోవడంతో చాలా స్కూళ్లు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ముఖ్యంగా ప్రభుత్వ బడులలో ఈ సమస్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక, పట్టణ సంస్థలు స్కూళ్ల పారిశుద్ధ్య పనులు చూసుకుంటాయని చెప్పింది. కానీ ఆ ఆదేశాలు అక్కడక్కడా అమలవుతున్నా క్షేత్రస్థాయిలో సరైన స్పందన లేదన్నది ప్రధాన పత్రికల్లో వస్తున్న కథనాలలో కనిపిస్తున్నది. 


మరోవైపు ప్రైవేటు స్కూళ్లల్లోనూ ఆన్‌లైన్‌ క్లాసులు ఉండవని ప్రభుత్వం అంతర్గతంగా నిర్ణయించింది. ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన జీవోలో, పాఠశాల విద్యాశాఖ ఇచ్చిన మార్గదర్శకాల్లోనూ ఆన్‌లైన్‌ క్లాస్లులు ఉండబు అన్న విషయాన్ని స్పష్టం చేయలేదు. దీనిపై అధికారులను వివరణ అడిగితే ప్రత్యక్ష బోధన ప్రారంభమంటే ఆన్‌లైన్‌ క్లాసులు ఉండవనే అర్థం అని చెప్తున్నారు. దేశంలో కొన్నిరోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. అక్టోబర్‌లో థర్డ్‌ వేవ్‌ పొంచి ఉన్నదన్న హెచ్చరికల నేపథ్యంలో రాష్ర్టాలను కేంద్రం అప్రమత్తం చేసింది. రానున్న రెండు నెలలు పండుగల సీజన్లు. వీటిని దృష్టిలో పెట్టుకుని సెప్టెంబర్‌ 30 వరకు కోవిడ్‌ ఆంక్షలను పొడిగించింది. ఈ నేపథ్యంలో కోవిడ్‌ నిబంధనలను అనుసరించి క్లాసుకు ఎంతమంది ఉండాలన్న గైడ్‌లైన్స్‌ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు రాలేదు అన్నది ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాల వాదన. పిల్లల తల్లిదండ్రులలో 30 శాతం మంది ప్రత్యక్ష తరగతుల వైపు, 40 శాతం మంది ఆన్‌లైన్‌ క్లాసులే కావాలని, ఇంకా కొంతశాతం మంది పరిస్థితులను బట్టి తమ పిల్లలను బడులకు పంపాలా వద్దా అన్నది నిర్ణయం తీసుకుంటామని అంటున్నారు. ఇదిలా ఉండగా మీ పిల్లల బాధ్యత మీదే, మీకు ఇష్టమైతేనే బడికి పంపండి అని ప్రైవేటు స్కూళ్ల వాళ్లు సర్క్యులర్లు జారీచేస్తున్న విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం భయం వద్దు నిశ్చింతగా పిల్లలను బడికి పంపండి అని ప్రకటనలు చేస్తున్నది. అయితే పర్యవేక్షణ లేకుండా, పారిశుద్ధ్య పనులు పూర్తికాకుండా స్కూళ్లకు పిల్లలను పంపడానికి ఏ తల్లిదండ్రులు సాహసం చేయరు.

 ప్రత్యక్ష తరగతులు, ప్రమాద హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిల్‌ దాఖలు అయ్యింది.  తెలంగాణ విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనపై రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యక్ష బోధనకు కచ్చితంగా  విద్యార్థులను బలవంతం చేయొద్దని ఆదేశించింది. తరగతులకు హాజరుకాని విద్యార్థులపై చర్యలు తీసుకోవద్దని.. ప్రత్యక్ష తరగతులు నిర్వహించని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. మరోవైపు గురుకులాలు, హాస్టళ్లలో ప్రత్యక్ష బోధన ప్రారంభించవద్దని హైకోర్టు ఆదేశించింది. గురుకులాలు, హాస్టళ్లను ఇప్పుడే తెరవద్దని స్పష్టం చేసింది. కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. అప్పుడే తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపుతారు.

Labels: , ,

Friday 27 August 2021

పార్టీలు కాదు వ్యక్తులే ప్రధానమట

 హుజురాబాద్ లో ఉప ఎన్నికల్లో పార్టీలతో పనిలేదు. వ్యక్తులే ప్రధానం అంటున్నారు అంట ఆ నియోజకవర్గంలో ని ప్రజలు. ప్రచారంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు మీరేం చేశారు అంటే మీరేం చేశారు అని విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. అయితే అక్కడి ప్రజల మనోగతం భిన్నంగా ఉన్నదని సమాచారం.

రాష్ట్ర ప్రభుత్వం హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలని సర్వశక్తులు ఒడ్డుతున్నది. ఎన్నిచేసినా ఆ నియోజకవర్గంలోని ప్రజలతో ఈటల రాజేందర్ కు ఉన్న వ్యక్తిగత అనుబంధం ఫలితంగా ప్రభుత్వం ప్రయోగిస్తున్న పథకాలు ఏవీ పనిచేసేలా లేవు అంటున్నారు. ఈ ఉప ఎన్నిక వరకు అక్కడ పార్టీలతో సంబంధం లేకుండా ఈటల రాజేందర్ వైపే ఉన్నారట. పార్టీ లతో సంబంధం లేకుండా అన్ని పార్టీల నేతలు, కార్యకర్తల సమస్యలు పరిష్కారం చేయడం, పక్షపాతం చూపకపోవడం, ప్రజలకు అందుబాటులో ఉండటం వంటివి ఈటల రాజేందర్ కు కలిసి వచ్చే అంశాలని ప్రజల అభిప్రాయం. అలాగే కోవిడ్ సమయంలో ఆరోగ్య శాఖ మంత్రిగా తాను అందించిన సేవలను అక్కడి ప్రజలు మననం చేసుకుంటున్నారు.


 ఈ నియోజకవర్గంలో పరిస్థితుల గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిఘా విభాగాల ద్వారా సమాచారం తెప్పించుకుంటున్నది. బహుశా అందుకే మొన్న కేటీఆర్ హుజురాబాద్ ఉప ఎన్నిక మా ప్రభుత్వం కూలిపోదు అనే మాటలు మాట్లాడి ఉంటారు. 

ప్రస్తుతం హుజురాబాద్ లో నెలకొన్న పరిస్థితులు ఇవి. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించి, ప్రచారం మొదలు పెడితే పరిణామాలు ఎలా ఉంటాయి అన్నది నోటిఫికేషన్ వచ్చేవరకు తెలుస్తుంది. 

Labels: ,

Wednesday 25 August 2021

నేతలు.. దూషణలు


రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు దూషణలకు కేంద్ర బిందువు అయ్యాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య వ్యక్తిగత దూషణల కాలం నడుస్తున్నది. ఇవి సామాజిక మాధ్యమాల్లో కూడా అనుకూల, ప్రతికూల వాదనలకు వేదిక అవ్వడమే ఇప్పటి విషాదం. ప్రజా సమస్యల పేరుతో జరుగుతున్న ఈ వాదోపవాదాలు చివరికి అసలు అంశాలను పక్కదోవ పట్టిస్తున్నాయి. ఇందులో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అంటే తమను ఎన్నుకున్న ప్రజలదే అసలు తప్పు అనేలా ఉన్నారు.

నాయకులు సహనం  కోల్పోతున్నారు అంటేనే వాళ్ళకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్స సందర్భంలోనే అసహనానికి గురవుతుంటారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్, బీజేపీ నేతల నుంచి రాజకీయ విమర్శలతో పాటు ప్రతిఘటనలు ఎదురవుతున్నాయి. దీనికి ప్రతిగా ఏడేండ్ల బీజేపీ పాలనపై, అంతకుముందు పదేండ్ల కాంగ్రెస్ పాలనపై అధికార పార్టీ నుంచి విమర్శలు వస్తున్నాయి. కేంద్రంలో, రాష్ట్రంలో వివిధ అంశాలపై ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాలపై జరుగుతున్న రాజకీయ చర్చలు అదుపుతప్పి బూతుల దాకా వెళ్తున్నాయి. అవి సామాజిక మాధ్యమాల్లో కి వచ్చే సరికి మరింత శృతి మించుతున్నాయి. 

చర్యకు ప్రతిచర్య అన్నట్టు కొంతమంది నేతల వ్యవహార శైలి పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేసే దాకా వచ్చింది. కాబట్టి నాయకులు వ్యక్తిగత దూషణలు మాని, ప్రజా సమస్యలపై నిర్మాణాత్మక. చర్చలు చేస్తేనే ప్రజల్లో విశ్వసనీయత పెరుగుతుంది.. చాలా సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయి.

Labels: ,

ఆ మాటల ఆంతర్యం!


హుజురాబాద్ ఉప ఎన్నిక తమకు చిన్న విషయం అంటున్న అధికార పార్టీ అగ్ర నాయకుల మాటల ఆంతర్యం ఏమిటి అన్నది వాళ్ళ క్యాడర్ కే అర్థం కావడం లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ పాలనా విధానాల పై, కొంతమంది అధికారుల పై జరుగుతున్న వివక్షను ఈటల రాజేందర్ తన ప్రచారంలో ఎండగడుతున్నాడు. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలను రాజకీయ విశ్లేషకులు దిద్దుబాటు చర్యలు గానే భావిస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికతో ప్రభుత్వం కూలిపోదు. కేంద్రంలో అధికారంలోకి వచ్చేది లేదు అని కేటీఆర్ వ్యాఖ్యలు, కేసీఆర్ హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలని ఆ నియోజకవర్గంలో కురిపిస్తున్న నిధుల, పదవుల వరాలతోఈటల నైతిక విజయం సాధించారు అంటున్నారు. 

ఈటల రాజీనామా ఫలితంగా దళితబంధు పథకం అమలు కోసం హుజురాబాద్ కు 2000 కోట్ల కేటాయింపు జరిగింది. ఇందులో 1200 కోట్ల నిధులు విడుదల అయ్యాయి. ఎస్ సీ, బీసీ కార్పొరేషన్ ల చైర్మన్ ల పదవులు హుజురాబాద్ కే దక్కాయి. దళిత బంధు మాక్కూడా కావాలనే డిమాండు మేరకు టైమొస్తే బీసీ బంధు, మైనారిటీ, ఇతర బంధులు కూడా పెడుతామని కేసీఆర్ ప్రకటించారు. హుజురాబాద్ చిన్న ఉప ఎన్నిక అంటూనే.. అక్కడ ఇన్ని చేస్తున్నా.... ఏదో తేడా కొడుతున్నదనే అభిప్రాయం అధికార పార్టీ నేతల మాటలతోనే అర్థం అవుతోంది.

2014 తర్వాత రాష్ట్రంలో అనేక ఉప ఎన్నికలు జరిగాయి. ఏ ఎన్నిక అయినా అలవోకగా గెలిచే అధికార పార్టీ దుబ్బాక ఫలితం తర్వాత జరిగిన అన్నీ ఎన్నికల్లో చమటోడుస్తున్నది. ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నిక అయితే కేసీఆర్ తో సహా అందరినీ కలవరపాటుకు గురిచేస్తోంది. నోటిఫికేషన్ రాక ముందే ప్రభుత్వం, పార్టీలో అనేక పరిణామాలు జరుగుతున్నాయి. ఇక నోటిఫికేషన్ వచ్చాక ఇంకా ఎలా ఉంటుందో అని అంతా అనుకుంటున్నారు.

Labels: ,

Saturday 14 August 2021

పార్టీల బీసీ బాట

 హుజురాబాద్ ఉప ఎన్నికల్లో దళితబంధు పథకం ప్రభావం ఉంటుంది అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఆ జనరల్ స్థానంలో ఇప్పుడు అన్ని పార్టీలు బీసీ పాట పాడుతుండటం గమనార్హం. రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా ఈటల రాజేందర్ ది బీసీ సామాజిక వర్గమే. టీ ఆర్ ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ బీసీనే. ఇంకా అక్కడ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించలేదు. కానీ వాళ్ళు కూడా బీసీ అభ్యర్థి వైపే మొగ్గుచూపుతారని అంచనా. ముఖ్యంగా కొండా సురేఖ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. బహుజనవాదం వినిపిస్తున్న  బీఎస్పీ కూడా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో  తమ అభ్యర్థిని నిలబెట్టే అవకాశం ఉన్నది. ఆ పార్టీ కూడా ఆ నియోజకవర్గంలో 50 శాతానికి పైగా ఉన్న బీసీల కే సీటు కేటాయించవచ్చు.  ఇలా ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నిక దాదాపు అన్ని పార్టీలును బీసీల వైపు మళ్లించింది. 


కేంద్రంలో ఇటీవల మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ జరిగింది. అందులో ఎక్కువ శాతం ఓబీసీ లకే బెర్తులు దక్కాయి. యూపీలో గత ఎన్నికల్లో బీజేపీ ఈ ఓబీసీ ప్రయోగం తోనే మంచి ఫలితాలు సాధించిన విషయం విదితమే. అందుకే ఇప్పుడు రాజకీయ పార్టీలు జనరల్ స్థానాల్లో బీసీ ప్రయోగాలు చేస్తున్నాయి. రాష్ట్రంలో హుజురాబాద్ ఇప్పుడు ఆ ప్రయోగానికి వేదిక అయ్యింది. పార్టీల రాజకీయ అవకాశవాదం ఎలా ఉన్నా బీసీలకు జనరల్ స్థానంలో ప్రాతినిధ్యం లభిస్తున్నది. 


మార్పు ఎక్కడో ఒక దగ్గర మొదలు కావాలె. అది రాష్ట్రంలో హుజురాబాద్ నుంచి ప్రారంభం కావడం మంచి పరిణామం అని బీసీ నాయకులు భావిస్తున్నారు. పార్టీలన్నీ దాదాపు అగ్ర కులాల నాయకత్వంలోనే నడుస్తున్నది వాస్తవమని వారి వాదన. ఒక బలమైన పార్టీ అభ్యర్థి బీసీ కావడంతో మిగిలిన పార్టీలు కూడా బీసీ అభ్యర్థుల వైపే చూసే అనివార్యత ఇప్పుడు హుజురాబాద్ లో ఏర్పడింది. అందుకే అక్కడ అన్ని పార్టీలు బీసీ వాదాన్ని జపిస్తున్నాయి. 


Labels: ,

Friday 13 August 2021

రాష్ట్ర కాంగ్రెస్ దయనీయ స్థితి

వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే అంటున్న కాంగ్రెస్ నేతల మాటలు ఆశ్చర్యంగా, హాస్యాస్పదంగా ఉన్నాయి. రాష్ట్రంలో దుబ్బాక, నాగార్జున సాగర్, జీ హెచ్ ఎం సీ, ఇటీవల జరిగిన రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. రాష్ట్రంలో ఆ పార్టీ నాయకత్వ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కొంత ఉత్సాహం కనిపించిన మాట వాస్తవం. ఇటీవల ఇంద్రవెల్లి సభ కూడా సక్సెస్ అయ్యింది. అయినా ప్రజలు ఆ పార్టీని అధికార పార్టీకి ప్రత్యామ్నాయం అనుకోవడం లేదు. ఎందుకంటే ఎన్నికలను సీరియస్ గా తీసుకోకపోవడం, పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక (సీనియర్లు నిలబడే స్థానాల్లో తప్ప) త్వరగా తేలకపోవడం వంటివి ఆ పార్టీని పట్టి పీడిస్తున్న సమస్యలు.

అంతేకాదు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ దళిత సాధికారికత కోసం తెచ్చిన పథకం దళిత బంధుపై విమర్శలు చేస్తున్నది. వాళ్ళ హయాంలో తెచ్చిన సబ్ ప్లాన్ అమలుపై అధికార పార్టీని నిలదీస్తున్నది. కానీ సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్రమంత్రి  సర్వే సత్యనారాయణ పార్టీ విధానానికి వ్యతిరేకంగా అధికార పార్టీకి అనుకూలంగా ప్రకటనలు చేశారు. ఇది ఒక్క సర్వే తోనే మొదలు కాలేదు. గతంలో జానారెడ్డి లాంటి వాళ్ళు కూడా పార్టీకి ఇబ్బందులు తెచ్చే ప్రకటనలు చేశారు. అలాగే రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడుగా ఎన్నిక కాకముందు ఆయనకు వ్యతిరేకంగా అనేకమంది సీనియర్ నేతలు బహిరంగ విమర్శలు చేశారు. కానీ అధిష్ఠానం ఆయనను ఎంపిక చేసిన తర్వాత కొంత సద్దుమణిగినట్టు అనిపించినా ఇప్పుడు అంతర్గత కలహాలు మళ్లీ కనిపిస్తున్నాయి. కోమటిరెడ్డి వెంకట రెడ్డి వంటి నేతల వ్యవహారశైలినే దీనికి నిదర్శనం. 

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకో రెండున్నర ఏండ్ల సమయమే ఉన్నది. ఇప్పటికి చాలా నియోజకవర్గాల్లో నేతలు ఉన్నా వాళ్ళు ఎప్పుడు ఏ పార్టీలోకి జంప్ అవుతారో తెలియని పరిస్థితి. హుజురాబాద్ ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి అందుకు అద్దం పడుతున్నది. గతంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కౌశిక్ రెడ్డి "కారు" ఎక్కారు. అక్కడ ఉప ఎన్నికల్లో పోటీ చేసే టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ప్రచారంలో ఉన్నారు. కానీ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో ఇప్పటికీ ఖరారు కాలేదు. ప్రచారం మొదలుపెట్టలేదు. వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే అనే పార్టీ ఉప ఎన్నికల్లో పోటీ విషయాన్ని సీరియస్ గా పట్టించుకోవడం లేదని అక్కడి నియోజకవర్గ ప్రజల అభిప్రాయం. ఇలా అయితే పార్టీ నిలబడేది ఎట్లా, అధికారంలోకి వచ్చేది ఎట్లా అని ఆ పార్టీ కార్యకర్తలే అనుకునే స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది.



Labels: ,

Thursday 12 August 2021

అభ్యర్థులు ఖరారు, ఎన్నిక ఎప్పుడు?

 టీఆర్ఎస్ పార్టీకి మొదటి నుంచి ఒక అడ్వాన్టేజ్ ఉన్నది. ఉద్యమం, ఉద్యమకారుల అంశాన్ని ప్రతిపక్షాలు తెరమీదికి తెస్తే ఆ పార్టీకే మేలు చేసినవాళ్ళు అవుతున్నారు. ఎందుకంటే కే సీఆర్ మాది ఫక్తు రాజకీయ పార్టీ అన్నా, సన్నాసుల మఠం కాదు అన్నా అవకాశం వచ్చిన ప్రతీసారి ఉద్యమకారులకు పెద్దపీట వేస్తున్నారు. చట్ట సభల్లో వారిని నిలబెడుతున్నారు. ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నికల్లో విద్యార్థి నాయకుడు, ఉద్యమకారుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు టికెట్ ఇచ్చి ప్రత్యర్థులపై పైచేయి సాధించాడు. 


ఈటల రాజీనామా ఎపీసోడ్, కౌశిక్ రెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ వంటి పరిణామాల తర్వాత ఉద్యమకారులు, ఉద్యమ కారులపై రాళ్లు వేసిన వారికి పదవులు అన్న చర్చ గెల్లు శ్రీనివాస్ ను ఎంపిక చేసి వాటికి ఫుల్ స్టాప్ పెట్టాడు. మంత్రి హరీశ్ రావు కూడా ఇంతకాలం ఉప ఎన్నిక వ్యూహాలను అమలు చేస్తూనే ఉన్నా నియోజకవర్గానికి రాలేదు. ఈటల దమ్ముంటే కేసీఆర్, హరీశ్ లు నాపై పోటీ చేయాలని సవాల్ విసిరిన 24 గంటల్లోనే హుజురాబాద్ లో పార్టీ అభ్యర్థి తో కలిసి ప్రచారం మొదలుపెట్టాడు. పోటీ టీఆర్ ఎస్, బీజేపీ ల మధ్యే అని తేల్చాడు. ప్రధాన పార్టీల  అభ్యర్థులు ఖరారు కావడంతో ఉప పోరు ప్రచారం ఉధృతం కానున్నది. సంక్షేమ పథకాలు, ఉద్యమకారుడు పోటీలో ఉండటం, ఈటల ప్రచారంలో పెట్టిన బీసీ వాదానికి బీసీనే రంగంలోకి దింపడం వంటివి అధికారపార్టీకి కలిసి వచ్చే అంశాలు. 


కాంగ్రెస్ కూడా హుజురాబాద్ నుంచే మార్పు అంటున్నది. ఆ పార్టీ అభ్యర్థి ఎవరూ అన్నది వారం రోజుల్లో తేలుతుంది. ఇప్పటి వరకు అయితే హుజురాబాద్ ఉప ఎన్నిక లో ద్విముఖ పోరే కనిపిస్తున్నది. కేసీఆర్ ఈ ఎన్నిక గురించి పలు సందర్భాల్లో తేలికగా తీసుకున్నట్టు, ఈటల పెద్దోడేమీ కాదన్నట్టు పత్రికలలో వార్తలు వచ్చాయి. అయితే ఈ ఎన్నిక


ను సీరియస్ గానే తీసుకుంటున్నారు. దాని ఫలితమే వివిధ పథకాల ప్రకటన అనే ఆరోపణల్లోనూ వాస్తవాలు ఉన్నాయి. కేసీఆర్ కూడా పథకాలను విమర్శించే వాళ్ళు ఓట్లు అడుగవచ్చు, పథకాలు పెట్టే మేము అడుగవద్దా అని కుండబద్దలు కొట్టారు. సంక్షేమ పథకాలతో కేసీఆర్ ఓట్ల రాజకీయాలు చేస్తున్నారు అని విపక్ష నేతల విమర్శలను పట్టించుకోకుండా తాను అనుకుంటున్న పనులు చేసుకుంటూ పోతున్నారు. 


హుజురాబాద్ ఉపఎన్నికల నోటిఫికేషన్ రాకముందే రాష్ట్ర రాజకీయాలు హీటెక్కాయి. ఈటల రాజేందర్ గెలిస్తే జరిగే రాజకీయ పరిణామాల ఎలా ఉంటాయో కేసీఆర్ గ్రహించారు. అందుకే అలర్ట్ అయ్యారు. పరిస్థితులు ఎలా ఉన్నా ప్రత్యర్థి పార్టీలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నారు. అందుకే అన్నీ అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఎంపిక ఇందులో భాగమే.

కొసమెరుపు: రాష్ట్ర శాసనమండలిలో ఏర్పడిన ఆరు స్థానాలకు జరగాల్సిన ఎన్నికలను కరోనా ఉధృతి కారణంగా వాయిదా వేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జరగాల్సిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో ఏర్పడిన దాదాపు 35 స్థానాలతో పాటు హుజురాబాద్ ఉప ఎన్నిక నిర్వహణపై పార్టీల అభిప్రాయం ఈ నెల 30 లోగా చెప్పాలని అన్ని పార్టీలకు కేంద్రం ఎన్నికల సంఘం లేఖ రాసింది. హుజురాబాద్ లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు అయ్యారు. ఈ నెల 30 వరకు ఈ ఎన్నిక నిర్వాహన పై పార్టీల అభిప్రాయం తర్వాత ఎన్నికల సంఘం నిర్ణయం వెలువడనున్నది. ఆ తర్వాతే ఎన్నిక ఎప్పుడు అనే షెడ్యూల్ విడుదల అవుతుంది. అప్పటి వరకు పార్టీల ఆరోపణలు, ప్రత్యారోపణలతో ప్రచారం కొన..సాగుతూ ఉంటుంది. 

Labels: , , , ,

Tuesday 10 August 2021

మరుగునపడుతున్న ప్రజా సమస్యలు


 రాజకీయాల్లో విమర్శలకు ప్రతి విమర్శలు సహజమే. కానీ రాష్ట్రంలో హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో టీఆర్ఎస్, బీజేపీల నాయకుల మధ్య, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ చేరిక సందర్భంగా జరిగిన సభలో వారి ప్రసంగం, ఇంద్రవెల్లి లో కాంగ్రెస్ సభలో రేవంత్ రెడ్డి అధికార పార్టీ అధినేత పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదం అయి మీడియాలో చర్చనీయాంశాలు అయ్యాయి.

ఎన్నికలకు ఇంకో రెండేండ్ల సమయం ఉన్నది. అప్పుడే పార్టీలు వ్యూహాలు, ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు హుజురాబాద్ ఉప ఎన్నికనే వేదిక అవుతున్నది. అందుకే ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఫల్యాలను ఏకరువు పెడుతున్నాయి. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్నాయి. అధికారపార్టీ నేతలు మీ హయాంలో ఏం చేసారో చెప్పాలని అడుగుతున్నారు. టీవీ చర్చల్లో ఈ అంశాలపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటలతో అసలు విషయాలు పక్కకుపోతున్నాయి. రానున్న రోజుల్లో రాష్ట్రంలో పాదయాత్రలు కూడా మొదలు కానున్నాయి. ఈలోగా హుజురాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ రావొచ్చు. అందుకే 16న హుజురాబాద్ లో ప్రారంభం కావాల్సిన దళిత బంధు పథకం వాసాలమర్రిలోనే ముఖ్యమంత్రి ప్రకటించారు. అందుకు సంబంధించిన నిధులు కూడా విడుదల అయ్యాయి. ముఖ్యమంత్రి హుజురాబాద్ పర్యటనకు ముందే దళిత బంధు పథకం అమలు కోసం కావలసిన నిధులు మంజూరు చేసింది. ఎన్నిక షెడ్యూల్ వస్తే పథకం అమలుకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల చర్యలు చేపట్టింది. 

వచ్చే ఎన్నికల నాటికి ఓటు బ్యాంకు పదిల పరుచుకోవడానికి సంక్షేమ పథకాలతో అధికార పార్టీ రెండు అడుగులు ముందే ఉన్నది. ఈ పథకాలు ఏడేండ్లుగా అమలు చేయలేదని, ఎన్నికల కోసమే మొదలుపెడుతున్నారు అని ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివిధ వర్గాల్లో ఉన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఈ క్రమంలో నాయకులు మధ్య జరుగుతున్న చర్చలు దూషణలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో అదుపు తప్పుతున్నాయి. ప్రజా సమస్యలు మరుగున పడుతున్నాయి.




Labels: ,

Monday 9 August 2021

పథకాలు సరే, కొలువుల సంగతి?

దళిత సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన దళిత బంధు పథకంపై ప్రశంసలు, విమర్శలు వస్తున్నా ముఖ్యమంత్రి అడుగులు ముందుకే వేస్తున్నారు. ముదావహం. సమాజంలోని అన్నివర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా కేసీఆర్ ఆయా పథకాల లక్ష్యం, వీటి ద్వారా వారికి జరిగే రాజకీయ ప్రయోజనాల గురించి ఇప్పటికే కుండబద్దలు కొట్టారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించే కొన్ని విధాన నిర్ణయాల అమలులో ఉన్న వేగం కొలువుల భర్తీ విషయంలో కనిపించడం లేదన్నది నిరుద్యోగుల నుంచి వస్తున్న ప్రశ్న. 

ఒకేసారి పెద్ద మొత్తంలో కొలువుల భర్తీకి నోటిఫికేషన్లు త్వరలో వెలువడనున్నాయి అనే ప్రకటనలు ప్రాధాన్యం కోల్పోయాయి. కారణం దీనికి సంబంధించిన కార్యాచరణ ఏదీ లేదు. అందుకే నోటిఫికేషన్లపై నిరుద్యోగుల్లో అయోమయం నెలకొన్నది. ప్రకటనలతోనే కాలం వెళ్లదీస్తున్న తీరును ప్రతిపక్షాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి దీనిపై సరైన సమాధానం రావడం లేదు. నియామకాలపై ముఖ్యమంత్రి అదేశాలు అమల్లోకి రావడం లేదు. దీనికి బాధ్యత ఎవరిది అని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. 

ప్రభుత్వం వివిధ పథకాల అమలులో చూపిస్తున్న శ్రద్ధ కొలువుల భర్తీలోనూ చూపెట్టాలి అని నిరుద్యోగులు కోరుతున్నారు. నియామకాల విషయంలో ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. ఇచ్చిన మాటను పదే పదే విస్మరిస్తే ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోతుంది. 


ఆ పార్టీలకు ఇక్కడ ఆదరణ ఉంటుందా?

 


ఒక రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం ప‌నిచేసే ప్రాంతీయ పార్టీ మ‌రో రాష్ట్రంలో మ‌నుగ‌డ సాగించ‌లేదు. తెలుగువారి ఆత్మ‌గౌర‌వం పేరు మీద టీడీపీ ఆవిర్భావించింది. ఉమ్మ‌డి రాష్ట్రాన్ని దాదాపు రెండు ద‌శాబ్దాలు పాలించింది. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత మెల్ల‌మెల్ల‌గా ఆ పార్టీ ప్ర‌భావం త‌గ్గిపోయింది. 2014, 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కొన్ని సీట్లు గెలుచుకున్న‌ది. అయితే ఆ పార్టీ మూలాలు ఆంధ్ర‌లో ఉన్నాయి. అందుకే  2014 నుంచి 2019 వ‌ర‌కు ఏపీలో టీడీపీ అధికారంలోకి ఉండ‌టం, చంద్ర‌బాబు తెలంగాణ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు వ్య‌తిరేకంగా ప‌నిచేయ‌డంతో పార్టీ ఇక్క‌డ ఉన్నా ప్ర‌భావాన్నికోల్పోయింది. దాదాపు సీనియ‌ర్ నేత‌లంతా టీఆర్ఎస్‌, కాంగ్రెస్, బీజేపీల‌లో చేరిపోయారు. 


ఇప్పుడు ఆ పార్టీలో కొన‌సాగుతున్ననేత‌లు కొంత‌మంది మాత్ర‌మే. రానున్న రోజుల్లో తెలంగాణ‌లో టీడీపీ త‌న అస్తిత్వాన్ని పూర్తిగా కోల్పోనున్న‌ది.  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారంలో ఉండి, అక్క‌డి ప్ర‌యోజ‌న‌ల కోసం ప‌నిచేస్తూ తెలంగాణ‌లో రాజ‌కీయం చేసినా ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌నే వాస్త‌వాన్ని బ‌హుశా జ‌గ‌న్ పార్టీ గ్ర‌హించి ఉంటుంది. అందుకే  ఒక్క తెలంగాణ‌లోనే కాదు ప‌క్క‌రాష్ట్రాల రాజ‌కీయాల‌లో వేలు పెట్ట‌మ‌ని క‌రాఖండిగా చెప్పారు. వైఎస్ ఆర్ తెలంగాణ‌కు కూడా ఇదే సూత్రం వ‌ర్తిస్తుంది. ఆ పార్టీ అధినేత్రి ష‌ర్మిల కొన్నిరోజులుగా చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు చూస్తే వారి ఆశ‌లు వ‌మ్ము అవుతాయే త‌ప్పా అధికారంలోకి రావ‌డం అన్న‌ది జ‌ర‌గ‌ని ప‌ని. ఎందుకంటే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మ‌ధ్య అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయి. వీటి విష‌యంలో వారు తెలంగాణ వైపే నిల‌బ‌డ‌తామ‌ని స్ప‌ష్టంగా చెప్ప‌డం లేదు. రొటీన్ కామెంట్ల లెక్క రెండు రాష్ట్రాల‌కు అన్యాయం జ‌రుగ‌వ‌ద్ద‌నేదే మా పార్టీ విధానం అని స‌మ‌స్య‌ల‌ను దాట‌వేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇది గ‌తంలో చంద్ర‌బాబు చెప్పిన రెండు కండ్ల సిద్ధాంతం వంటిదే.  ఉమ్మ‌డి పాల‌కుల విధాన నిర్ణ‌యాల వ‌ల్ల‌నే తెలంగాణ ప్రాంతం అన్నిరంగాల్లో అన్యాయానికి, అణిచివేత‌కు గురైంది. అందుకే వారి పాల‌న‌కు వ్య‌తిరేకంగా తెలంగాణ ప్ర‌జ‌లు పోరాడారు. ఉమ్మ‌డి రాష్ట్ర పాల‌కులు అంటే వారి తండ్రి దివంగ‌త వైఎస్ పాల‌న‌ను కూడా తెలంగాణ వ్య‌తిరేకించారు. వారి తండ్రి అధికారంలో ఉన్న‌స‌మ‌యంలోనే ఉద్య‌మాన్ని అణిచివేసే, ఉద్య‌మ‌పార్టీలో చీలిక‌లు తెచ్చే అనేక కుట్ర‌లు చేశారు. ఇదంతా తెలంగాణ ప్ర‌జ‌ల అనుభ‌వంలో ఉన్న‌దే. ఇప్పుడు వైఎస్ కూతురు ష‌ర్మిల రాజ‌న్న రాజ్యం తెస్తామ‌న్న నినాదం తెలంగాణ‌లో ఫ‌లించ‌దు. 


తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం త‌ర్వాత ఉద్య‌మ‌పార్టీనే అధికారంలోకి వ‌చ్చింది. ఉద్య‌మ స‌మ‌యంలో నినాదాల‌ను ఇక్క‌డి పాల‌నా విధానాల్లో చూపెట్ట‌లేదు.  ఇక్క‌డ ఉన్న అన్నిప్రాంతాల ప్ర‌జ‌లు మావాళ్లే అని ప్ర‌క‌టించ‌డ‌మే కాదు భ‌ధ్ర‌త‌, భ‌రోసా క‌లిగించింది. కొంద‌రు ప‌నిగ‌ట్టుకొని ప్ర‌చారం చేసిన భ‌యాందోళ‌న‌ల‌ను తొలిగించింది. అందుకే ఈ ఏడేండ్ల కాలంలో రాష్ట్రంలో అన్నిప్రాంతాల ప్ర‌జ‌ల మ‌ధ్య స‌హృద్భావ వాతావ‌ర‌ణ‌మే ఉన్న‌ది. బాబు హ‌యాంలో సెక్ష‌న్ 8 పేరుతో రెండు రాష్ట్రాల‌ ప్ర‌జ‌ల మ‌ధ్య అపోహ‌లు సృష్టించి, రాజ‌కీల ల‌బ్ధి పొందాల‌నే కుట్ర‌ల‌ను కూడా తెలంగాణ ప్ర‌భుత్వం చేధించింది. 


అయితే తెలంగాణ‌లో ఎవ‌రైనా పార్టీ పెట్ట‌వ‌చ్చు. విస్త‌ర‌ణ కోసం ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు. త‌మ‌కు అవ‌కాశం ఇవ్వ‌మ‌ని ప్ర‌జ‌లను కోర‌వ‌చ్చు. అయితే ఇక్క‌డ ఏ పార్టీ మ‌న‌గ‌డ సాగించాలంటే తెలంగాణ సోయితోనే ప‌నిచేయాలి. తెలంగాణ అభివృద్ధిని ఆకాంక్షించాలి. ద్వంద్వ విధానాలు విడనాడాలి. అప్పుడే తెలంగాణ ప్ర‌జ‌ల విశ్వాసాన్ని పొంద‌గ‌లుగుతారు. ఇవేవీ లేకుండా రాజ‌కీయాలు చేస్తామ‌ని అనుకుంటే వారి ఆశ‌లు అడియాశ‌లే అవుతాయ న్నది చరిత్ర చెప్తున్న సత్యం.

 

Labels: , , , ,

Saturday 7 August 2021

ప్రశంసలను స్వాగతించాలె. విమర్శలను స్వీకరించాలె.

టీఆర్ఎస్ ఉద్యమ నేపథ్యం నుంచి పుట్టి రాజకీయపార్టీగా రూపాంతరం చెందింది. అందుకే ఉద్యమం, ఉద్యమ కారులు, ఉద్యమ ఆకాంక్షలు అన్నవి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిత్యం చర్చలలో ఉంటున్నాయి. అదే కాంగ్రెస్ లేదా బీజేపీ అధికారంలో ఉండి ఉంటే పైన చెప్పిన అంశాలకు ప్రాధాన్యం ఉండేదో లేదో కచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే అవి రెండు జాతీయ పార్టీలు. రాష్ట్ర నాయకత్వానికి ఆయా పార్టీలు ఎంత స్వేచ్ఛను ఇచ్చినా అంతిమ నిర్ణయం మాత్రం ఆ పార్టీల హస్తిన పెద్దలదే అన్నది వాస్తవం. జాతీయ పార్టీల అధినాయకత్వాల మద్దతు లేకుంటే అధికార ఖుర్చీ లో కూర్చొవడం కష్టం అన్నది ఇటీవల వివిధ రాష్ట్రాల్లో జరిగిన నాయకత్వ మార్పులే అందుకు ఉదాహరణ.


ఇదంతా ఎందుకు చర్చించాల్సి వస్తున్నది అంటే ప్రాంతీయ పార్టీలకు స్థానిక సమస్యలే ప్రాధాన్య అంశాలు. కానీ జాతీయపార్టీలకు వీటితో పాటు అనేకం ఉంటాయి. అందుకే ప్రాంతీయ సమస్యలపై వాటి వైఖరి రాజకీయ అవసరాలను బట్టి మారుతుంటాయి. అందుకే బీజేపీ కాంగ్రెస్ ముఖ్త్ భారత్ అన్న నినాదం ఆచరణలో విఫలమైంది. ప్రాంతీయపార్టీలతో బీజేపీ నేరుగా పోటీ పడిన చోట బీహార్, ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ ఒడిశా, కేరళ, తమిళనాడు, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో ప్రాంతీయపార్టీలు బీజేపీకి చెక్ పెట్టాయి. 


ఇక రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం మేమే అని కాంగ్రెస్, బీజేపీలు చెప్పుకుంటున్నాయి. కానీ టీ ఆర్ఎస్ అధినేత వివిధ ఎన్నికల సందర్భంగా అనుసరిస్తున్న వ్యూహాలతోనే వాటి స్థానాలు మారుతున్నాయి. వారి వ్యవహార శైలి నచ్చక పార్టీ వీడుతున్నవారికి రాజకీయ ఆశ్రయాలుగా  మారుతున్నాయి. ఇంకా కొన్ని కొత్త పార్టీలు పురుడుపోసుకోవడానికి కారణం అవుతున్నాయి. రాజకీయ పునరేకీకరణలో భాగంగా టీఆర్ఎస్ అధినేత తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. ఇవి ఒక్క టీఆర్ఎస్ ను మాత్రమే ఎందుకు చుట్టుముడుతున్నాయి? ఉద్యమకాలంలో కలిసి పనిచేసిన వారికి పార్టీలో మొదటి నుంచి ఉన్నవారి కంటే ముందే పదవులు దక్కాయి. కానీ రాజకీయ నేపథ్యం ఉన్నవారు పదవులు ఉన్నంత వరకే మౌనంగా ఉంటున్నారు. పార్టీలో కొనసాగుతున్నారు. పదవీకాలం పూర్తి అయ్యాక ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. సిద్ధాంత వైరుధ్యాలు ఉన్నా విపక్ష పార్టీలలోకి వెళ్ళి పోతున్నారు. ఇదంతా టీఆర్ ఎస్ అధినాయకత్వం వైఫల్యమే. కొందరి అసంతృప్తి అందరి అసంతృప్తి కాకపోవచ్చు. కానీ సుదీర్ఘ కాలం కలిసి నడిచిన వారిని కాదని రాజకీయ అవసరాల కోసం తెచ్చుకున్న వారితో వీసమెత్తు పార్టీకి ప్రయోజనం కలుగకపోగా కొన్ని నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. విపక్ష పార్టీలకు అవే ఆయుధాలు అవుతున్నాయి. పార్టీని నమ్ముకుని, పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేస్తున్న వారిని పట్టించుకోకుండా ఎన్ని పథకాలు తెచ్చినా కొన్నిసార్లు ప్రతికూల ఫలితాలే వస్తాయి. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాలని కోరుకునే వారు కూడా ప్రభుత్వాన్ని  ప్రశ్నించడానికి కారణం కొన్ని నిర్ణయాలే. 


ప్రశంసలను స్వాగతించాలె. విమర్శలను స్వీకరించాలె.తెలంగాణ ఉద్యమం నేర్పిన పాఠాలు ఇవే.

Labels: , , , , ,

Thursday 5 August 2021

జోహార్ జయశంకర్ సార్

జీవితమంతా ఉద్యమమే ఊపిరిగా బతికారు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్. నాటి ఫజల్ అలీ కమిషన్ మొదలు మొన్నటి శ్రీకృష్ణ కమిటీ వరకు తెలంగాణ పై వేసిన అన్నీ కమిటీల ముందు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను శాస్త్రీయంగా వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అన్నది సార్ కల. ఆ కల సాకారం కోసం తన జీవితకామంతా కృషి చేశారు. 

ఉమ్మడి రాష్ట్రంలో ఆయా ప్రభుత్వాలు రాష్ట్రంలో వివిధ రంగాల్లో సాధించిన అభివృద్ధి పై అధికారిక నివేదికలు విడుదల చేసేవారు. అందులో పేర్కొన్న లెక్కల ఆధారంగా నే తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని, ఈ ప్రాంతం పై వారు చూపిన వివక్షను ఏకరువు పెట్టేవారు. అందుకే సార్ అంటే అందరికీ అభిమానం. 

రాష్ట్ర సాధన అంశాన్ని ఎవరు ఎత్తుకున్నా సార్  తెలంగాణ కు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని వారికి అందించారు. దశాబ్దాల పాటు తెలంగాణ ఉద్యమం అనేక ఆటుపోట్ల గురైంది. అయినా ఆ ఉద్యమ జ్వాల ఆరిపోకుండా కాపాడినవారు జయశంకర్ సార్. మలి దశ తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న సందర్భంలో కొన్ని స్వార్థ శక్తులు ఇరు ప్రాంతాల ప్రజల్లో వైషమ్యాలు సృష్టించాలని చూశాయి. అలాంటి కుట్రలను సార్ బద్దలు కొట్టారు. ప్రాంతాలుగా విడిపోదాం, ప్రజలుగా కలిసి ఉందాం అనే సందేశాన్ని సార్ అందించారు. ఉద్యమానికి దశను, దిశ ను చూపెట్టారు.

తెలంగాణ సిద్ధాంత కర్తగా రాష్ట్ర ఏర్పాటు కోసం సార్ చేసిన కృషి సువర్ణాక్షరాలతో లిఖించగలది. రాష్ట్ర సాధన కోసం అన్ని రాజకీయ పార్టీల నేతలతో కలిసి పనిచేసినా తన స్వేచ్ఛను కోల్పోలేదు. ఉద్యమ సమయంలో తెలంగాణ వస్తే ఏమస్తుందో సారు చెప్పిన మాటలు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆవిష్కృతం అవుతున్నాయి. నీళ్ళు, నిధుల గురించి సార్ చెప్పిన సత్యాలు నేడు నిజం అవుతున్నాయి. సార్ చెప్పినట్టే గోదావరి, కృష్ణ నదుల్లో మన వాటాను హక్కుగా వినియోగించుకుంటున్నాం. నిధులు ఇక్కడి అభివృద్ధికి ఖర్చు చేసుకుంటున్నాం.

తెలంగాణ కు జరిగిన అన్యాయం వల్ల నాలుగు తరాలు నష్టపోయాయి. కాబట్టి యువత త్యాగాలు చేయవద్దు. త్యాగాలు మేము చేస్తాం. మీరు రేపటి రాష్ట్ర ఫలాలు అందుకోవాలి అన్నారు. నియామకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలి. అప్పుడే నీళ్లు, నిధులు, నియామకాలు అన్న ట్యాగ్ లైన్ లక్ష్యం నెరవేరుతుంది. సార్ కల సంపూర్ణం కావాల్సి ఉన్నది. ఇందుకోసం సార్ ఆశయాలను నెరవేర్చాల్సిన బాధ్యత నాటి ఉద్యమ పార్టీ అయిన నేటి అధికార పార్టీపై ఉన్నది.

(సార్ జయంతి నేడు. జోహార్ ఆచార్య కొత్త పల్లి జయశంకర్ సార్)


-రాజు

Labels: ,

ఆశావహులకు అశనిపాతమే

 

తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన 2026 తర్వాత చేపడుతామని కేంద్ర హోం శాఖ మంగళవారం ఎంపీ రేవంత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో సమాధానం ఇచ్చింది. ఈ ప్రకటన రాజకీయ ఆశావహుల ఆశలపై నీళ్లు చల్లింది.  నిజానికి విభజన చట్టంలోని సెక్షన్ 15తో సంబంధం లేకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్ 170లోని నిబంధనల ప్రకారం తెలంగాణ అసెంబ్లీ స్థానాలను 119 నుంచి 153కు, ఏపీ 175 నుంచి 225కు పెంచాలని విభజన చట్టంలోని సెక్షన్ 26 (1) స్పష్టం చేస్తున్నది.  కానీ రాజ్యాగంలోని ఆర్టికల్ 179 (3) అనుసరించి 2026 తర్వాత ప్రచురించే జనాభా లెక్కల అనంతరమే రెండు రాష్ర్టాల్లో అసెంబ్లీ సీట్ల సర్దుబాటు జరుగుతుందని కేంద్ర మంత్రి తెలిపారు. అయితే దీనిపై కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నేత వినోద్‌లు స్పందించారు. జమ్మూ-కశ్మీర్‌కు ఒక న్యాయం, తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు ఒక న్యాయం అన్నట్టు కేంద్రం వ్యవహరిస్తున్నదని విమర్శించారు. రాజ్యాంగమే ప్రామాణికం, జమ్మూ-కశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన చేస్తే ఇక్కడ కూడా చేయాలని డిమాండు చేశారు.  ప్రతి పదేండ్లకు ఒకసారి జనాభాల లెక్కల సేకరణ జరుగుతుంది. 2021 తర్వాత మళ్లా 2031లోనే జనగణన జరుగుతుంది. కేంద్రం చెప్పినట్టు 2026 తర్వాత అంటే 2031లో చేపట్టే జనగణన వివరాలు ప్రచురించిన తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టనున్నట్టు స్పష్టమౌతున్నది. గత అనుభవాల దృష్ట్యా 2039 ఎన్నికల నాటికి మాత్రమే కొత్త నియోజకవర్గాలు అందుబాటులోకి రావచ్చని రాజకీయవర్గాల అంచనా.

 అయితే కేంద్రం ప్రకటించిన తాజా నిర్ణయం రాజకీయ ఆశావహులకు అశనిపాతమే. ముఖ్యంగా తెలంగాణలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అధికార టీఆర్‌ఎస్‌కు ఈ నిర్ణయంతో ఇబ్బందే. ఎందుకంటే ఉద్యమపార్టీగా పేరొందిన టీఆర్‌ఎస్‌ను ప్రజలు రెండుసార్లు ఆదరించారు. పధ్నాలుగేండ్ల సుదీర్ఘ కాల పోరాటంలో ఆ పార్టీలో పనిచేస్తున్న వారి జాబితా పెద్దదే. అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి కొంతమందికి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఇట్లా  అవకాశం ఇచ్చుకుంటూ వస్తున్నారు. చట్టసభల్లో పోటీచేసే అవకాశం లేనివారికి కార్పొరేషన్ పదవులు లేదా ఇతర పదవులు కట్టబెట్టారు. దీనికితోడు రాజకీయ పునరేకీకరణలో భాగంగా ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన వారి సంఖ్య కూడా గణనీయంగానే ఉన్నది. ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరు కొన్నినియోజకవర్గాల్లో అయితే ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు. నియోవజర్గాల పునర్విభజన జరిగితే వీళ్లను సర్దుబాటు చేయవచ్చు అని ఇంతకాలం భావిస్తూ వస్తున్నారు. కానీ తాజాగా కేంద్ర హోం శాఖ ఇచ్చిన సమాధానం అధికారపార్టీకి మింగుడు పడని అంశమే. విభజన చట్టంలో ఇచ్చిన హామీని అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నా వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి అది అమల్లోకి వచ్చేది. కానీ ఇప్పట్లో లేదు కేంద్రం స్పష్టతను ఇచ్చింది. అలాగే రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు రోజురోజుకూ మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు రాష్ట్రంలో పాగా వేయడానికి ప్రణాళికలు వేసుకుంటూ  ముందుకు పోతున్నాయి. వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా ప్రతిపక్ష పార్టీలు కార్యాచరణతో ముందుకుపోతున్నాయి. 

నియోజకవర్గాల పునర్విభజన లేదు అని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో అధికారపార్టీ నుంచి ఇతర పార్టీలకు వలసలు పెరిగే అవకాశం ఉన్నది. హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారనున్నాయి. అట్లనే ఏపీలో కూడా ఏ ఎన్నిక జరిగినా వైసీపీ, టీడీపీ మధ్యనే ఉన్నది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షపార్టీలను ఐక్యం చేసే పనిలో ఉన్నది. బీజేపీ కూడా దక్షిణాది రాష్ర్టాల్లో తమ బలం పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నది. ఏపీ, తెలంగాణ రాష్ర్టాల్లోనూ కొన్ని ఎంపీ సీట్లు గెలుచుకునేందుకు ఇప్పటి నుంచే పథకాలు రూపొందించుకుంటున్నాయి. కాబట్టి నియోజకవర్గాల పునర్విభజన అంశం ప్రతిపక్ష పార్టీల్లో చేరికలకు ద్వారాలు తెరిచిందనేది రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

-రాజు

Labels: , ,

హాకీ ఆటగాళ్ళూ హాట్సాప్

ఒలింపిక్స్ జరుగుతున్న ప్రతీసారి పతకాల పట్టికలో భారత్ స్థానం సంపాదించేవరకు ఉత్కంఠే. మన అథెట్లు కొన్ని పతకాలు సాధించి దేశం పేరు నిలబెట్టగానే ఊపిరి పీల్చుకున్న సందర్భాలు అనేకం. కానీ ఈసారి ఆ టెన్షన్ లేదు. 

మీరాబాయి సాయికోమ్ చాను క్రీడలు ప్రారంభమైన రెండో రోజే వెండి పతకాన్ని సాధించింది. వెయిట్ లిఫ్టర్‌గా 2016 ఒలింపిక్స్‌లో ఎదుర్కొన్న పరాభవం నుంచే మీరాబాయి చాను పాఠాలు నేర్చుకున్నది. ఫీనిక్ష్ పక్షి వలె పునరుజ్జీవం పొంది టోక్యోలో మెరిసింది. కట్టెల మోతతో మొదలైన ఆమె విజయ ప్రస్థానం వెనుక ఎన్నో ఉత్థానపతనాలున్నాయి. అస్సాంకు చెందిన బాక్సర్ లవ్లీనా కాంస్య పతకాన్ని సాధించింది. అయితే తన తొలి ఒలింపిక్స్‌లోనే పతకంతో తన పవర్‌ను ప్రపంచానికి చాటింది. భారత షట్లర్ పి.వి. సింధు రియోలో రజతం, టోక్యో కాంస్యం ఒలింపిక్స్‌లలో పతకాలు సాధించింది.  వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది. 


2011 ఏప్రిల్ 2న వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కెప్టెన్ ధోనీ సిక్సర్ కొట్టినప్పుడు 120 కోట్ల భారతీయులు భావోద్వేగానికి లోనయ్యారు. 1983 తర్వాత భారత క్రికెట్ జట్టు ప్రపంచకప్‌ను ముద్దాడింది. ధోనీసేన విశ్వవిజేతగా నిలిచింది. ఆ భావోద్వేగమే 41 ఏండ్ల తర్వాత ఒలింపిక్స్‌లో జర్మనీపై గెలిచి భారత్ కాంస్య పతకాన్ని సాధించినప్పుడు కలిగింది. మన దేశ జాతీయ క్రీడ హాకీ. కానీ క్రికెట్ మానియాలో చాలా క్రీడలు ఒలింపిక్స్, ఆసియా క్రీడల వంటి సమయాల్లోనే పతాక శీర్షికల్లో కనిపిస్తాయి. అందుకే జర్మనీతో గెలిచిన తర్వాత  భారత్‌లో ప్రజలు హాకీని మర్చిపోయారు. నిజానికి వారు హాకీని ప్రేమిస్తారు. కానీ మేము గెలుస్తామని నమ్మడం మానేశారు. కానీ మేము ఈరోజు గెలిచాం. భవిష్యత్తులో వారు మా నుంచి మరింత ఆశిస్తారు, మమ్మల్ని నమ్ముతారు డ్రాగ్ ఫ్లికర్ రూపిందర్ పాల్ అన్న మాటలు అక్షరాల నిజం.


బెల్జియంతో పోరు అన్నప్పుడే మన హాకీ ఆటగాళ్లు ఏదో ఒక పతకాన్ని పట్టుకొస్తారనే నమ్మకం కలిగింది. బెల్జియంపై ఓడిపోయినా మనోైస్థెర్యం కోల్పోలేదు. రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతాక విజేత. 1980 తర్వాత భారత్ ఒలింపిక్స్‌లో పతక పోరులో తలపడిన సందర్భం లేదు. కానీ కోట్లాది మంది భారతీయుల కల నెరవేర్చాలనే తపన, కసి ఉన్నాయి. ఉత్కంఠను అధిగమించింది. హాకీకి పునర్ వైభవమే లక్ష్యంగా ఆటగాళ్లు పోరాడారు. ఇదే 41 ఏండ్ల తర్వాత భారత్‌కు పతకాన్ని అందించింది. అందుకే పసిడి పతకాన్ని తలదన్నేలా ఈ పోరు జరిగిందని క్రీడా విశ్లేషకులు వ్యాఖ్యానించారు. 


అలాగే టోక్యో ఒలింపిక్స్‌లో ఈసారి మన ఆటగాళ్ల ప్రదర్శన గతంలో కంటే మెరుగ్గా ఉన్నది. రైతు బిడ్డ రవి కుమార్ దహియా అద్భుత పోరాటంతో రెజ్లింగ్ 57 కిలోల విభాగంలో రజతం సాధించాడు. హరియాణలోని సోనెపత్‌కు సమీపంలోని నాహ్రి రవి కుమార్ దహియా స్వగ్రామం. ఏ మాత్రం వసతులు లేని కుగ్రామం నుంచి వచ్చిన ఈ మల్ల యోధుడు పసిడి పతకమే లక్ష్యంగా పోరాడి రజతంతో మెరవడం విశేషం. 


ప్రపంచంలో మన కంటే చిన్నదేశాలు ఒలింపిక్స్‌లో అద్భుతమైన ప్రదర్శనను చూపెడుతున్నాయి. మనం కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఆటగాళ్లను తీర్చిదిద్దాలి. ఈసారి పతకాలు సాధించిన వారి నేపథ్యం చూస్తే దేశంలోని మారుమూల కుగ్రామాల నుంచి ఎన్నో కష్టాల కడలిని దాటి ఇక్కడిదాకా వచ్చారు. దేశ ప్రతిష్ఠను నిలబెట్టారు. గ్రామీణ ప్రాంతాలలో ఇలాంటి మట్టిమాణిక్యాలు ఇంకా ఎందరో ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టిగా కృషి చేసి అలాంటి వారిని గుర్తించాలి. వారికి అన్నిరకాల మౌలిక సదుపాయాలు కల్పించాలి. సరైన శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దితే  రానున్నరోజుల్లో మన దేశం నుంచి మరింత మంచి అత్యుత్తమ ఆటగాళ్లు తయారవుతారు. 

-రాజు


Monday 2 August 2021

ఉప ఎన్నిక, ఉద్యమకారులు


హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి ఎవరూ అన్నది వారం, పది రోజుల్లోగా అధికారికంగా వెల్లడి కానున్నది. ఈటల రాజేందర్ రాజీనామా తర్వాత హుజురాబాద్ లో రాజకీయ వాతావరణం హీటెక్కింది. ఈటల బీజేపీ లో చేరిన తర్వాత ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం మండలాల వారీగా ఇంచార్జి లను ప్రకటించి ప్రచారం మొదలుపెట్టింది. కాంగ్రెస్ నుంచి కౌశిక్ రెడ్డి పోటీ చేస్తారు అని అందరూ అనుకుంటుండగానే ఈ నెల రోజుల్లో అనేక రాజకీయ పరిణామాలు జరిగాయి.
చివరికి కౌశిక్ టీ ఆర్ ఎస్ కండువా కప్పుకోవడం, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ గా రాష్ట్ర క్యాబినెట్ ఆయనను నామినేట్ చేయడం వంటి నిర్ణయాలు చక చకా జరిగిపోయాయి. అలాగే అధికార పార్టీ ఆహ్వానం మేరకు తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ, ఈటల చేరిక తర్వాత బీజేపీలో అంతర్గతంగా జరిగిన పరిణామాలతో మాజీమంత్రి పెద్దిరెడ్డి ఇంకా కొంతమంది ఆ పార్టీని వీడి టీఆర్ఎస్ చేరారు.

దళిత బంధు పథకం, హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యం ప్రతిపక్ష పార్టీలలో భిన్నస్వరాలకు వేదిక అయ్యాయి. కొన్నిరోజులుగా చర్చలో ఉన్న ఉప ఎన్నికల్లో అధికార పార్టీ ఎవరన్నది కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తున్నది. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఎన్నికల సందర్భంలో ఉద్యమం, ఉద్యమకారులు అనే ప్రశ్నలు పౌర సమాజం నుంచి వస్తున్నాయి. ఎందుకంటే టీఆర్ఎస్ మాత్రమే చాలామంది ఉద్యమకారులను గుర్తించింది. వారి సేవలు రాష్ట్ర పునర్ నిర్మాణంలో వినియోగించుకుంటున్నది.

ఉద్యమ సమయంలో ఉద్యమానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్ర బిందువుగా నిలిచింది. అందుకే దుబ్బాక, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల సమయంలో పెద్దగా ప్రధాన అంశం కాలేదు. కాని హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఉద్యమకారుల విషయం ఇప్పుడు ప్రధానం అయ్యింది. బీసీ సామాజిక సమీకరణలు వంటివే కాకుండా ఈటల రాజేందర్ కు ఉద్యమ నేపథ్యం ఉండటంతో అధికార పార్టీ కూడా అలాంటి అభ్యర్థి వైపే చూసేలా చేసింది. ఈ కోణంలోనే ఉద్యమకారుడు, బీసీ అయిన టీఆర్ ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ అభ్యర్థి అయితేనే గెలుపు అవకాశాలు ఉంటాయి అనే అభిప్రాయం అధికార పార్టీలో ఉన్నది. సంక్షేమ పథకాలకు తోడు ఉద్యమకారుడు వర్సెస్ ఉద్యమకారుడు అనేవి తమకు లాభిస్తాయి అనే ఆలోచనలో టీఆర్ ఎస్ అధినాయకత్వం ఉన్నదని అర్థం అవుతున్నది. గెల్లు అభ్యర్థిత్వం అధికారికంగా ప్రకటించడమే మిగిలింది ఇక. ఆ తర్వాత హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకోనున్నది.

- ఆసరి రాజు

Labels: , , , ,

ప్రకటనలకే పరిమితం

 కొన్ని నెలలుగా కొలువుల ముచ్చట ప్రకటనలకే పరిమితం అయ్యింది. జూలై 13, 14 తేదీల్లో జరిగిన క్యాబినెట్ భేటీల్లో 50 వేల కొలువుల భర్తీ కి ఆమోదముద్ర పడుతుంది అని నిరుద్యోగులు ఆశించారు. కానీ వారి ఆశలు అడియశలే అయ్యాయి. అధికారులు అందించిన ఖాళీల వివరాలు అసంపూర్తిగా ఉన్నాయి అని పూర్తి వివరాలతో రావాలని క్యాబినెట్ ఆదేశించింది. ఆ తర్వాత మరో ఐదు రోజులకు క్యాబినెట్ మీట్ ఉంటుంది అని వార్తలు వచ్చాయి. తిరిగి 17 రోజుల తర్వాత ఆగస్టు 1న క్యాబినెట్ భేటీ జరిగింది. నిన్న కూడా కొత్త నియామకాలకు గ్రీన్ సిగ్నల్ వస్తుంది అనుకున్నారు.  కానీ నిన్న కూడా నిరుద్యోగులకు నిరాశే ఎదురైంది. జూలై 9న 50 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన కూడా వెలువడింది. జూలై నెలలో దాదాపు కొలువుల ముచ్చటే నడిచింది. ఖాళీల వివరాలు అసమగ్రం, వాటిపై అధ్యయనం అనేవి ఉత్త ముచ్చట్లే.ఎందుకంటే ఒక్కరోజులో సమగ్ర కుటుంబ సర్వే చేసి రికార్డు సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వివరాలు లేవంటే నమ్మశక్యంగా లేదు. దాదాపు ఏడు నెలలుగా నియామకాల అంశంపై ప్రభుత్వం అనేక ప్రకటనలు చేసింది. కాబట్టి ఖాళీల సమగ్ర వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. కానీ వాటిని భర్తీ చేయాలనే సంకల్పమే లేదు.


Labels: ,

సంక్షేమం- సంక్షోభం


 ప్రజా సంక్షేమం కోసం తెచ్చిన పథకాలు ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ సంక్షోభానికి తెర తీశాయి. హుజురాబాద్ ఉప ఎన్నిక అనివార్యం అయిన నేపథ్యంలో అధికార పార్టీ అక్కడ ఎలాగైనా తన పట్టును నిలుపుకోడానికి ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగానే అక్కడ దళిత బంధు, రెండో విడత గొర్రెల పంపిణి, నామినేటెడ్ పదవులు చేపట్టింది. దళిత బంధు కొత్తగా ఎన్నికల కోసం తెచ్చింది కాదు అని, రాజకీయ కోణం లేదు అని సీఎంతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు చెప్తున్నారు. కానీ ఈటల రాజీనామా వ్యవహారం కొందరికి రాజకీయంగా లబ్ధి చేకూరింది. ఏండ్ల తరబడి పార్టీనే నమ్ముకుని పనిచేస్తున్న వారిని ఇప్పటికైనా పడవులు దక్కాయని అంటున్నారు. నిజమే. ఉప ఎన్నిక వస్తే నిధులు, పదవులు వస్తాయి అని అంటున్న వారి వాదనలో వాస్తవం ఉన్నది. మొన్న నాగార్జున సాగర్, ఇప్పుడు హుజురాబాద్ నియోజకవర్గానికి పథకాలు, నిధుల వరాలు సీఎం ప్రకటించడమే వారి వాదనలకు బలం చేకూరుస్తున్నాయి. అందుకే ఎమ్మెల్యే గారు రాజీనామా చేయండి అని ప్రజల నించి ప్రజాప్రతినిధులకు వారి వారి నియోజకవర్గాల్లో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. సంక్షేమ పథకాలు రాష్ట్ర వ్యాప్తంగా అమలు కావాలని, అర్హులైన వారందరికీ ఆ ఫలాలు దక్కాలని ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆశించడం అత్యాశ కూడా కాదు. అందుకే సంక్షేమం కోసం తెచ్చిన కొన్ని పథకాలు అధికార పార్టీకి రాజకీయ లబ్ధి నే కాదు రాజకీయ సంక్షోభాలకు కారణం అవుతున్నాయి. దీనికి తాజా ఉదాహరణనే 'రాజీనామా' డిమాండ్లు తెరపైకి రావడం.

Labels:

Sunday 1 August 2021

ఆ ప్రయత్నాలు ఫలిస్తే...

 

సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండున్నరేండ్ల సమయం ఉన్నది. అయితే అప్పుడే కొత్త కూటములు, బీజేపీ యేతర పార్టీల సమావేశాల వంటివి జరుగుతున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ ఇప్పటికే వివిధ ప్రాంతీయపార్టీలతో భేటీ అయి చర్చలు జరిపారు. తాజాగా పంజాబ్‌లో అధికార కాంగ్రెస్‌ పార్టీలో నెలకొన్న సంక్షోభానికి ఆయన ఇచ్చిన సలహాతోనే కాంగ్రెస్‌ పార్టీ సిద్ధూను ప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎంపిక జరిగింది అంటున్నారు. అంతేకాదు ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరుతారనే వార్తలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ప్రశాంత్‌ కిషోర్‌ రాబోయే కాలంలో పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలకు సంబంధించిన రూట్‌ మ్యాప్‌పై కాంగ్రెస్‌ పెద్దలతో చర్చించారని, వాటికి వారు ఆమోదం తెలిపారు అన్నది వారంరోజులుగా వార్తల్లో కనిపిస్తున్న ప్రధాన వార్తలు.


కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం గత కొంతకాలంగా గతానికి భిన్నంగా నిర్ణయాలు తీసుకుంటున్నది. ఇందుకు ఉదాహరణ తెలంగాణలో ఆ పార్టీ అధ్యక్షుడి ఎంపిక. అట్లనే పంజాబ్‌లోనూ ముఖ్యమంత్రి అమరిందర్‌ సింగ్‌ వర్గం వ్యతిరేకించినా సిద్ధూకే పార్టీ రాష్ట్ర బాధ్యతలు కట్టబెట్టింది. వచ్చే ఏడాది జరుగనున్న ఆరు రాష్ర్టాల ఎన్నికలు, తెలంగాణలోనూ పార్టీ పటిష్ఠత, రాష్ట్రంలో అధికారంలోకి రావడం, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఈ రాష్ట్రం నుంచి గణనీయంగా ఎంపీ స్థానాలు దక్కించునే వ్యూహంలోనే భాగంగా రేవంత్‌రెడ్డి ఎంపిక జరిగింది అంటున్నారు. పార్టీలో ప్రక్షాళన చర్యలు ప్రారంభించడమే కాకుండా మొన్న బెంగాల్‌లో బీజేపీని మట్టికరిపించిన మమతా బెనర్జీతో సోనియా, రాహుల్‌లు చర్చలు జరిపారు. ఆ సందర్భంలోనే బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటయ్యే కూటమికి సారథి ఎవరైనా సై అనే సంకేతాలు ఇచ్చారు. ఆ కూటమిలో సాధారణ కార్యకర్తలా పనిచేసేందుకు సిద్ధమని ప్రకటించారు.


వరుసగా రెండుసార్లు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు భారీ మెజారిటీ కట్టబెట్టారు. ప్రజల ఆకాంక్షలు ఈ ఏడేండ్ల కాలంలో కేంద్రం నెరవేర్చిందనే చర్చ ఇప్పుడు జాతీయస్థాయిలో నడుస్తున్నది. మోదీకి ప్రత్యామ్నాయంగా బలమైన నేత ప్రతిపక్షాల నుంచి కనిపించకపోవడం కూడా బీజేపీకి కలిసి వచ్చింది. అయితే ఈ ఏడాదిన్నర కాలంలో కరోనా కట్టడి విషయంలోనూ, పెట్రోల్‌, డిజిల్‌, గ్యాస్‌ ధరలు విపరీతంగా పెరిగిపోవడం, నిరుద్యోగ రేటు నలభై ఏండ్ల గరిష్ఠ స్థాయికి చేరడం వంటివి మోదీ ప్రభుత్వానికి ప్రతికూలంగా మారాయి. ఇటీవల జరిగిన మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ కూడా వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే జరిగింది. కొంతకాలంగా ప్రధాని మోదీ గ్రాఫ్‌ పడిపోతున్నది. దీనికి తోడు బెంగాల్‌లో ఎలాగైనా అధికారంలోకి రావాలని ఆ పార్టీలోని పెద్దలంతా ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు మమత వైపే నిలిచారు. ఇప్పుడు బీజేపీ మిత్రపక్షాలతో కాకుండా సొంతంగా అధికారంలో ఉన్న యూపీ, కర్ణాటక, గుజరాత్‌, మధప్రదేశ్‌ వంటి రాష్ర్టాల్లో కూడా వచ్చే ఎన్నికల నాటికి తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా యూపీలో వచ్చే ఏడాది అక్కడ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో  పట్టణ ప్రాంతంలోఆ పార్టీ మంచి మెజారిటీనే సాధించింది. అయితే గ్రామీణ ప్రాంతంలో సమాజ్‌వాదీ పార్టీ తన పట్టును నిలుపుకున్నది. కాబట్టి అక్కడ ఎలా ఉండబోతున్నది ఇప్పుడే చెప్పలేము. కర్ణాటకలో యడ్యూరప్ప వైదొలిగారు. బసవరాజు బొమ్మై కొలువుదీరారు. అయితే అక్కడ కాంగ్రెస్‌, జేడీయూల సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇందులో యడ్యూరప్ప కీలకంగా వ్యహరించారు. ఇప్పుడు ఆ పార్టీలో నెలకొన్న అంతర్గత సంక్షోభం రానున్నరోజులు ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి. మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సహకారంతో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చి అధికారంలోకి వచ్చారు. తాజా మంత్రివర్గంలో ఆయనకు మంత్రిగా అవకాశం కల్పించారు. రాష్ర్టాల్లో అధికారంలోకి రావడానికి బీజేపీ తన సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చి గతంలో కాంగ్రెస్‌ పార్టీ విధానాలనే అనుసరిస్తున్నది అనడానికి కర్ణాటక, మధ్యప్రదేశ్‌, బీహార్‌ రాష్ర్టాల్లో జరిగిన పరిణామాలే ఉదాహరణ. రాం విలాస్‌ పాశ్వాన్‌ మరణం తర్వాత ఆ పార్టీ రెండుగా చీలిపోయింది. నితీశ్‌ కుమార్‌ ఎన్నికల సమయానికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఆయన ఎన్డీఏలో ఎంత కాలం కొనసాగుతారు అన్నది వచ్చే ఏడాది జరిగే ఆరు రాష్ర్టాల ఎన్నికల తర్వాత తేలుతుంది. ఇట్లా కేంద్రంలో అధికారం రావడానికి కావాల్సిన మెజారిటీ స్థానాలు ఉండే యూపీ, మధ్యప్రదేశ్‌, బీహార్‌, రాజస్థాన్‌, పంజాబ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ర్టాల్లో బీజేపీకి అనుకూలతల కంటే ప్రతికూలతలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.  బహుశా ఈ మారిణ పరిస్థితుల నేపథ్యంలోనే కాంగ్రెస్‌ పార్టీ ప్రశాంత్‌ కిషోర్‌తో కలిసి వ్యూహరచన చేస్తూ కొత్త కూటముల ఏర్పాటు దిశగా వెళ్తున్నది.


ఇప్పటికీ మోదీకి ప్రత్యామ్నాయంగా విపక్ష కూటమిలో ముందే కూటమి ప్రధాని అభ్యర్థిని ప్రకటించకూడదనుకుంటున్నారు. దీనివల్ల జరిగే లాభం కంటే నష్టమే ఎక్కువనే అభిప్రాయం వివక్ష నేతల్లో ఉన్నది. అందుకే  అధికారానికి కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ సీట్ల గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఆయా రాష్ర్టాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలతో కలిసి నడువాలని కాంగ్రెస్‌ పెద్దలు భావిస్తుండవచ్చు. ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న రాష్ర్టాల్లో మాత్రం రాష్ర్టాల్లో అధికారాన్ని దక్కించుకోవడంతో పాటు ఎక్కువ ఎంపీ స్థానాలు గెలుచుకోవడంపైనే ఫోకస్‌ పెట్టారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా విపక్ష నేతలు చేస్తున్న కూటమి ప్రయత్నాలు ఫలిస్తే మూడోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న కమలనాథులకు చెక్‌ పడటం ఖాయం అంటున్నారు.

- రాజు

Labels: , ,