Friday 9 September 2022

మునుగోడులో ముందంజ‌లో ఉన్న‌ది ఎవ‌రు?



రాజ‌గోపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, శాస‌న స‌భ్య‌త్వానికి రాజీనామా చేయ‌డంతో రాష్ట్ర రాజ‌కీయ మునుగోడు చుట్టే తిరుగుతున్నాయి. ఆయ‌న బీజేపీ తీర్థం పుచ్చుకోవ‌డంతో ఆ పార్టీ త‌ర‌ఫున ఆయ‌న ఇప్ప‌టికే ప్ర‌చారం మొద‌లుపెట్టారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ దివంగ‌త పాల్వాయి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి కూతురు స్ర‌వంతిని అభ్య‌ర్థిగా అధికారికంగా ప్ర‌క‌టించింది. అలాగే రాజ‌గోపాల్ రాజీనామా ఆమోదం పొందిన త‌ర్వాత టీఆర్ఎస్ పార్టీ ఆ స్థానంపై దృష్టి సారించింది. ప్ర‌జాదీవెన స‌భ పేరుతో ఇప్ప‌టికే ఆ పార్టీ అక్క‌డ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించింది. ఆ రోజే అభ్య‌ర్థిని ప్ర‌క‌టిస్తార‌ని అనుకున్నారు. కానీ కేసీఆర్ ఆ జోలికి పోలేదు. ఎందుకంటే ఆ సీటు ఆశిస్తున్న ఆశావ‌హుల జాబితా ఎక్కువ‌గా ఉండ‌టంతో ఆ స‌భ‌లో అభ్య‌ర్థి ప్ర‌క‌ట‌న జోలికి వెళ్ల‌లేదు. 


బీజేపీ, కాంగ్రెస్ పార్టీల  అభ్య‌ర్థులు ఖ‌రారు కావ‌డంతో ఇక టీఆర్ఎస్ ఈ రెండు మూడు రోజుల్లో అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌వ‌చ్చు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్‌రెడ్డి పేరునే దాదాపుగా ఖ‌రారు అయ్యింది అంటున్నారు.  ఇప్ప‌టికే సీపీఐ, సీపీఎం పార్టీల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టిన అధికార పార్టీ అభ్య‌ర్థి ప్ర‌క‌ట‌న త‌ర్వాత ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేయ‌నున్న‌ది. రాజగోపాల్‌రెడ్డి రాజీనామా అనంత‌రం ఆ నియోజ‌క‌వ‌ర్గంలో అధికార‌పార్టీకి కొంత అనుకూలంగా ఉన్న‌ద‌ని వివిధ స‌ర్వేలు వెల్ల‌డించాయి. అయితే మునుగోడులో స‌భ పెట్టి,  అమిత్ స‌మ‌క్షంలో చేరిన ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృతంగా ప‌ర్య‌టిస్తున్నారు. అలాగే ఆయ‌న సోద‌రుడు ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి కూడా రాజ‌గోపాల్‌కు ఓటు వేయాల‌ని కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌లకు, నేత‌ల‌కు ఫోన్ చేస్తున్నార‌ని ఇటీవ‌ల ఆ పార్టీ నేత‌లు ఆరోపించారు. ఆ వార్త‌లు పేప‌ర్ల‌లో వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో మునుగోడు ఉప ఎన్నిక‌ల రోజుకో మ‌లుపు తిరుగుతున్న‌ది. 


ప్ర‌స్తుతం అక్క‌డ‌ ఏ పార్టీకి అనుకూలంగా ఉన్న‌ద‌నేది స్ప‌ష్టంగా ఎవ‌రూ చెప్ప‌లేక‌పోతున్నారు. అయితే కొంత‌కాలంగా ప్ర‌చారం జ‌రుగుతున్న‌ట్టు అధికార‌పార్టీ ఇప్ప‌టికీ ముందంజ‌లో ఉన్న‌ద‌ని తెలుస్తోంది. రెండు మూడు స్థానాల్లో నిలిచేది ఎవ‌ర‌నేది మ‌రికొన్నిరోజుల్లో తేలుతుంది. రెండో స్థానంలో ఉండే పార్టీనే వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌తో పోటీ ప‌డుతుంద‌నే టాక్ కూడా ఉన్న‌ది. బీజేపీ నేత‌లు చెబుతున్న‌ట్టు హుజురాబాద్ ఫ‌లితం పునరావృతమ‌వుతుందా?  టీఆర్ఎస్ నేత‌లు వాద‌న ప్ర‌కారం నాగార్జున‌సాగ‌ర్ ఉప‌ ఫ‌లితం వ‌లె ఉంటుందా? అన్న‌ది చూడాలి. 

Labels: , , , , , , ,

ప్రాంతీయ పార్టీలు ఆ ప‌ని చేస్తాయా?

 


ఇప్పుడు అంద‌రి దృష్టి 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌పైనే ఉన్న‌ది. ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాదిన్న‌ర‌కు పైగా స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌ధాన పార్టీల‌న్నీ వ‌చ్చే ఎన్నిక‌ల కోసం కార్యాచ‌ర‌ణ రూపొందించుకుని ముందుకు క‌దులుతున్నాయి. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల అధినేత‌లు బీజేపీపై దూకుడు పెంచిన‌ట్టు క‌నిపిస్తున్న‌ది. 

బీహార్‌లో జేడీయూ అధినేత బీజేపీతో తెగ‌తెంపులు చేసుకున్న త‌ర్వాత ప్ర‌ధాని ప‌ద‌విపై ఆశ లేదంటూనే హ‌స్తిన‌వైపు చూస్తున్నారు. 40 లోక్‌స‌భ‌ స్థానాలున్న ఆ రాష్ట్రంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో మెజారిటీ స్థానాలు ద‌క్కించుకోవాలనుకుంటున్నారు. ఇప్ప‌టికే కేజ్రీవాల్‌, అఖిలేశ్‌, శ‌ర‌ద్ ప‌వార్, వామ‌ప‌క్ష నేత‌ల‌ను క‌లిసిన ఆయ‌న కూట‌మికి ఎవ‌రు నాయ‌క‌త్వం వ‌హిస్తార‌నేది స‌మ‌స్య కాద‌ని, బీజేపీని క‌ట్ట‌డి చేయ‌డ‌మే త‌క్ష‌ణ క‌ర్త‌వ్య‌మ‌ని అంటున్నారు. 


ఇక కేసీఆర్ చాలా కాలం నుంచి క‌మ‌లం పార్టీ ని టార్గెట్ చేశారు. దేశ రాజ‌కీయాల్లో గుణాత్మ‌క మార్పు రావాల‌ని కోరుతున్నారు. ఆయ‌న కూడా ప‌లు ప్రాంతీయ పార్టీల అధినేత‌ల‌తో ఇప్ప‌టికే అనేక‌సార్లు స‌మావేశ‌మై జాతీయ రాజ‌కీయాల గురించి చ‌ర్చ‌లు జ‌రిపారు. బీజేపీ యేత‌ర‌, కాంగ్రెసేత‌ర కూట‌మి కోసం ఆయ‌న ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. 


కేజ్రీవాల్ టార్గెట్ హ‌స్తినే. అందుకే ఆయ‌న ముందుగా గుజ‌రాత్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో స‌త్తా చాటాల‌ని భావిస్తున్నారు. ఇప్ప‌టికే ఆప్ ఢిల్లీ, పంజాబ్‌లో అధికారంలో ఉన్న‌ది. ఈ రెండు రాష్ట్రాల్లో అధికారం ద‌క్కించుకుంటే పార్టీకి జాతీయ హోదా వ‌స్తుంద‌ని అప్పుడు దేశ‌మంతా పార్టీని సులువుగా విస్త‌రించ‌వ‌చ్చ‌ని అనుకుంటున్నారు. 


కాంగ్రెస్ పార్టీని కోలుకోల‌ని విధంగా దెబ్బ‌తీసిన బీజేపీ ప్ర‌స్తుతం ప్రాంతీయ పార్టీల నుంచి గ‌ట్టి పోటీ ఎదుర్కొంటున్న‌ది. త‌మిళ‌నాడులో డీఎంకే, మ‌హారాష్ట్ర‌లో శివ‌సేన‌, ఎన్సీపీ, తెలంగాణ‌లో టీఆర్ఎస్‌, బీహార్‌లో జేడీయూ, ఆర్జేడీ, యూపీలో ఎస్పీ, బీఎస్పీ, ఢిల్లీ, పంజాబ్‌లో ఆప్‌, ఒడిషాలో బీజూ జ‌న‌తాద‌ళ్, క‌ర్ణాట‌క‌లో జేడీఎస్ ల రూపంలో బీజేపీకి వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో గ‌ట్టి పోటీ త‌ప్ప‌దు.


వ‌రుస వైఫ‌ల్యాల‌తో, నేతల నిష్క్ర‌మ‌ణ‌ల‌తో బ‌ల‌హీన‌ప‌డిన కాంగ్రెస్ పార్టీ భార‌త్ జోడో యాత్ర పేరుతో చేప‌డుతున్న కార్య‌క్ర‌మంతో మ‌ళ్లీ పార్టీకి పూర్వ‌వైభ‌వం వ‌స్తుంద‌ని అనుకుంటున్న‌ది. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, రాజ‌స్థాన్లో త‌ప్పా ఎక్క‌డా కూడా కాంగ్రెస్ పార్టీ సొంతంగా అధికారంలో లేదు. ఈ ఏడాదిలో జ‌ర‌గ‌నున్న గుజ‌రాత్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో గెలిచి సార్వ‌త్రిక ఎన్నిక‌ల నాటికి  కార్య‌క‌ర్త‌ల‌ను స‌మాయ‌త్తం చేయాల‌ని అనుకుంటున్న‌ది. 

ప్రాంతీయ పార్టీలు మాత్రం ప్ర‌స్తుతం దేశ రాజ‌కీయాల్లో ఉన్న రాజ‌కీయ శూన్య‌త‌ను సొమ్ము చేసుకోవాల‌నుకుంటున్నాయి. అందుకే ఆయా పార్టీల అధినేత‌లు ఇప్ప‌టికే ఎవ‌రి ప్ర‌య‌త్నాలు వారు చేస్తున్నారు. ఒక‌వేళ వాళ్లంతా ఏక‌తాటిపైకి వ‌చ్చి బీజేపీని క‌ట్ట‌డి చేయ‌గ‌లిగితే కేంద్రంలో మ‌ళ్లీ సంకీర్ణ ప్ర‌భుత్వం త‌ప్ప‌ద‌ని రాజ‌కీయ విశ్లేషకులు అంచ‌నా వేస్తున్నారు. ప్రాంతీయ పార్టీల‌కు ఆ బ‌లం ఉన్న‌దా? అవి ఆ ప‌ని చేయ‌గ‌లుగుతాయా? అనే రాజ‌కీయ‌ చ‌ర్చ కొంత‌కాలంగా జ‌రుగుతున్న‌ది. 

Labels: , , , , , , , , , , , , , , ,