Saturday 31 July 2021

మన సాంస్కృతిక ప్రతీక

 తెలంగాణ సంస్కృతి విశిష్టమైనది. ఇక్కడి పండుగలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉన్నది. ఈ ప్రాంతాన్ని పాలించిన శాతవాహనులు మొదలు కాకతీయులు,  కుతుబ్  షాహీలు, ఆసఫ్ జాహీ కాలంలో అనేక చారిత్రక నిర్మాణాలు జరిగాయి. వారంతా ప్రకృతి ప్రేమికులు. అందుకే వాళ్ళ నిర్మాణాలు అన్నీ సహజ వనరుల సంరక్షణతోనే ముడిపడి ఉన్నాయి. కాకతీయ పాలకుడు గణపతిదేవుడు బందీగా ఉన్నప్పుడు వారి సేనాని రేచెర్ల రుద్రుడు ఆ రాజ్యాన్ని కాపాడటమే కాదు, అద్భుతమైన నిర్మాణాలు చేపట్టారు. ఇవ్వాళ యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంలో  నాటి కాకతీయుల సాంస్కృతిక ప్రతీకలు ఆ దేవాలయాల నిర్మాణం లో మనకు కనిపిస్తాయి. ఈ దేవాలయ నిర్మాణాన్ని చూసిన అంతర్జాతీయ పురాతత్వ నిపుణులు కూడా అబ్బురపడే,ఆశ్చర్యపడే సాంకేతిక పరిజ్ఞానం రామప్ప దేవాలయం సొంతం. కాకతీయుల నాటి అద్భుత నాట్య కళ పేరణి నృత్య విశేషాలు రామప్ప దేవాలయ శిల్పాల్లో కనిపిస్తుంది. రుద్రుడు మనకే కాదు ప్రపంచానికి  గొప్ప వారసత్వ సంపదను అందించాడు.


Friday 30 July 2021

నమ్మి నానబోస్తే...


కృష్ణా, గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులను బోర్డుల పరిధిలో ఉంచడాన్ని తెలంగాణ మొద‌టి నుంచీ వ్యతిరేకిస్తున్న‌ది. ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులు లేకుండా బోర్డుల పరిధిని నిర్ణయించరాదని కోరింది. తెలంగాణ విజ్ఞ‌ప్తుల‌ను ఏవీ ప‌ట్టించుకోకుండా కేంద్రం ఏక‌ప‌క్షంగా వాటి పరిధిని నిర్ణయిస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ వెలువరించింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణ‌యం తెలంగాణ‌కు గొడ్డ‌లిపెట్టుగా మార‌నున్న‌ది. 

ఉద్య‌మ స‌మ‌యంలో తెలంగాణ నీటి గోస గురించి ఆచార్య కొత్త‌ప‌ల్లి జ‌య‌శంక‌ర్ అంద‌రికీ అల్క‌గా అర్థ‌మ‌య్యేలా వివ‌రించేవారు. ఉమ్మ‌డి పాల‌కులు తెలంగాణ ప్రాజెక్టులు అంటేనే అంత‌ర్రాష్ట్ర స‌మ‌స్య‌లు, అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌ స‌మ‌స్య‌ల్లోకి నెట్టేవారు. ప్రాజెక్టులు శిలాఫ‌ల‌కాల‌పై, కాగితాల‌పై నీళ్ల కేటాయింపులు ఉండేవి. ఫ‌లితంగా నీళ్ల, క‌రెంటు స‌మ‌స్య‌లు తెలంగాణ ప్రాంతానికే ప‌రిమితం చేసేవారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆవిర్భావం నాటికి తెలంగాణ‌లో చెరువుల కింద పార‌కం అయ్యే భూములే అధికంగా ఉండేవి. వ‌ల‌స పాల‌కుల విధానాల వ‌ల్ల చెరువుల‌న్నీ ధ్వంసం అయ్యాయి. వ‌ర్షాభావ ప‌రిస్థితులకు తోడు, ప్రాజెక్టులు పూర్తికాక‌పోవ‌డం వ‌ల్ల నీటి కొర‌త ఉండేది. క‌రెంటు స‌మ‌స్య‌ల గురించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. పెట్టిన పెట్టుబ‌డికి చేతికి రాక అప్పులు తీర్చ‌లేక రైతుల ఆత్మ‌హ‌త్య‌లు నిత్య‌కృత్యం. 


అందుకే నీళ్లు, నిధులు, నియామ‌కాల ట్యాగ్‌లైన్ తో  ప్రారంభం అయిన తెలంగాణ ఉద్య‌మం రాష్ట్ర ఆవిర్భావం త‌ర్వాత ఉద్య‌మ‌నాయ‌కుడే మ‌ఖ్య‌మంత్రి కావ‌డంతో ద‌శాబ్దాల తండ్లాటలు ఒక్కొక్క‌టిగా తీరుతున్నాయి. తెలంగాణ ఏర్ప‌డితే చీక‌టే అవుతుంది అన్న‌చోట‌నే వెలుగులు నింపారు. ద‌శాబ్దాలుగా అన్నిర‌కాలుగా న‌ష్ట‌పోయిన ప్రాంతానికి న్యాయం చేయాల్సిన జాతీయ‌పార్టీలు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినా అనేక కొర్రీలు పెట్టి ఇచ్చింది. ఫ‌లితంగా పోల‌వ‌రం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వ‌డ‌మే కాకుండా రాష్ట్రంలోని ఖ‌మ్మం జిల్లాలోని ఏడు మండ‌లాల‌ను ఏపీకి క‌ట్ట‌బ‌ట్టింది బీజేపీనే. అలాగే అప్ప‌టికే విద్యుత్ కొర‌తతో స‌త‌మ‌త‌మ‌వుతున్న తెలంగాణ‌కు అక్క‌ర‌కు వ‌చ్చే సీలేరు విద్యుత్ ప్రాజెక్టును కూడా ఏపీకి క‌ట్ట‌బెట్టిన చ‌రిత్ర బీజేపీ. కాంగ్రెస్ విధానాల‌ను, ఆ త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చిన బీజేపీ తెలంగాణ వ్య‌తిరేక విధానాల‌పై ఒక్క ఉద్య‌మ‌పార్టీనే స్పందించింది. నిర‌సించింది. నిల‌దీసింది. పోరాడింది. మ‌రి జాతీయ‌పార్టీల నాయ‌కులుగా చెప్పుకుంటున్న‌వాళ్లు ఈ ఏడేండ్ల కాలంలో తెలంగాణ‌కు ఏం తెచ్చారో చెప్పండి అంటే స్ప‌ష్ట‌మైన స‌మాధానం చెప్ప‌కుండా మొత్తం కేంద్రం నిధుల‌తోనే రాష్ట్రం న‌డుస్తున్న‌ద‌న్న‌ట్టు అస‌త్య ప్ర‌చారాలు చేస్తున్నారు.

రాష్ట్రం ఏర్ప‌డిన మొద‌టి నుంచే ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంక్షోభంలో ఉన్న వ్య‌వ‌సాయ‌రంగ అభివృద్ధి కోసం బ‌డ్జెట్‌లో ఏటా సింహ‌భాగం నిధులు కేటాయిస్తూ ఖ‌ర్చులు చేస్తున్న‌ది. దాని ఫ‌లిత‌మే వ‌ట్టిపోయిన చెరువులు బాగుప‌డ్డాయి. వాటిలోకి నీళ్లు వ‌చ్చాయి. ఆ చెరువుల్లో చేప‌లు దుముకులాడుతున్నాయి. నీళ్ల వివాదాల విష‌యంలో ఇచ్చిపుచ్చుకునే ధోర‌ణ‌తో వ్య‌వ‌హ‌రిస్తూ అంత‌రాష్ట్ర వివాదాల సుడిగుండంలో ఉన్న‌ ప్రాజెక్టుల స‌మ‌స్య‌లు ప‌రిష్కారం చేసుకున్న ఘ‌న‌త తెలంగాణ ప్ర‌భుత్వానిది. మ‌హారాష్ట్ర‌తో స‌హృద్భావ సంబంధాల వ‌ల్ల చేసుకున్న నీటి ఒప్పందాల‌తో కాళేశ్వ‌రం లాంటి ప్రాజెక్టు నిర్మాణం దాదాపుగా పూర్తి అయ్యింది. ఈ విష‌యంలో కేంద్రం ప్ర‌భుత్వం చేసింది ఏమీ లేదు. తెలంగాణ తీసుకున్న విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాలు ఇవ్వాల చాలా రాష్ట్రాల‌కు అనుస‌ర‌ణీయం అవుతున్న‌ది. నీళ్ల విష‌యంలో క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర‌లతో లేని ఇబ్బందులు ఏపీతోనే ఎందుకు త‌లెత్తుతున్నాయో తెలుసుకోవాలి. మొద‌టి నుంచి ఇక్క‌డి చెరువులు బాగు చేయ‌లేదు. తెలంగాణ‌కు కేటాయించిన నీళ్లు విడుద‌ల చేయ‌లేదు. అందుకే ఇక్క‌డి నిధులు, నీళ్లు ఏపీకి త‌ర‌లించి అక్క‌డి ప్రాంతాల‌ను అభివృద్ధి చేసుకున్న చ‌రిత్ర వ‌ల‌స పాల‌కుల‌ది. అందుకే అప్పుడు, ఇప్పుడు ఎప్పుడూ ఏపీ పాల‌కుల ద్వంద్వ విధానాల‌తోనే జ‌ల జ‌గ‌డాలు. తాజాగా కేంద్రం కృష్ణా, గోదావ‌రి బోర్డుల‌ను పూర్తిగా త‌న అధీనంలోకి తీసుకోవడం కూడా ఏపీ వ్య‌వ‌హ‌రించిన తీరుతోనే. 

ఈ ఏడేండ్లే కాలంలో బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి చేసింది శూన్యం. విభ‌జ‌న చ‌ట్టం అక్ష‌రం అక్ష‌రం చ‌దివిన  త‌ర్వాత‌నే కృష్ణా, గోదావ‌రి బోర్డుల‌పై కేంద్రం గెజిట్ విడుద‌ల చేసింది అంటున్నారు. మ‌రి విభ‌జ‌న చ‌ట్టంలో అప‌రిష్కృతంగా ఉన్న ఇంకా అనేక స‌మ‌స్య‌లు ఇప్ప‌టికీ ఎందుకు పరిష్కారం కావడం లేదు?  రాష్ట్రానికి విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం రావాల్సిన ప్రాజెక్టులు ఎందుకు ఇవ్వ‌డం లేదు? తెలంగాణలోని ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాల‌ని ఎన్నిసార్లు విన్న‌వించినా ప‌ట్టించుకోలేదు. ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్ట‌రీ ఊసే లేదు. ఐటీఐఆర్‌ను ఏర్పాటు చేయాల‌ని కోరినా కేంద్రం స్పందించ‌డం లేదు. మిష‌న్ కాక‌తీయ‌, మిష‌న్ భ‌గీర‌థ ప్రాజెక్టులకు నీతి ఆయోగ్ ప్ర‌శ‌సంలే కాదు వీటికి త‌గిన నిధులు కేటాయించాలి చెప్పినా కేంద్రంలోని పెద్ద‌లు పెడ‌చెవిన పెట్టారు. అంతేకాదు బీజేపీ భాగ‌స్వామ్య ప‌క్షాలు కూడా బీజేపీ నేతృత్వంలోని కేంద్రం తీసుకున్న విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాల‌ను వ్య‌తిరేకించాయి. అయినా కేంద్రంతో ఘ‌ర్ష‌ణ ఎందుకు అని నోట్ల ర‌ద్దు, జీఎస్టీల‌తో పాటు వివిధ బిల్లుల‌కు మ‌ద్ద‌తు ఇచ్చింది. అయినా తెలంగాణ‌కు బ‌డ్జెట్ లోనూ, ప్రాజెక్టుల కేటాయింపుల్లోనూ రిక్త‌హ‌స్తాలే. 

కేంద్రం తాజాగా తెచ్చిన వ్య‌వ‌సాయ చ‌ట్టాలు, కొత్త విద్యుత్‌ చట్టం సవరణ బిల్లు రాష్ట్ర రైతాంగానికి అశ‌నిపాతం. అందుకే వాటిని పార్ల‌మెంటు వేదిక‌గా టీఆర్ఎస్ వ్య‌తిరేకించింది. వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల్సిందే అని దేశ‌వ్యాప్తంగా నిర‌స‌నలు ఇప్ప‌టికీ కొన‌సాగుతున్నాయి. అట్ల‌నే  కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే కొత్త విద్యుత్‌ చట్టం చాలా ప్రమాదకరం . ఆ చట్టం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. ఈ బిల్లును అనేక రాష్ర్టాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ చట్టంతో విద్యుత్‌పై రాష్ర్టాలకున్న అధికారం పోతుంది. ఈ బిల్లు అమ‌ల్లోకి వ‌స్తే విద్యుత్‌ సంస్థలను ప్రైవేటీకరించే ప్ర‌మాదం ఉన్న‌ది.  తాజా కేంద్రం కేంద్రం ప్రభుత్వం సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. దీనిపై కూడా ఆందోళ‌న వ్య‌క్తం అవుతున్న‌ది. దీనిపై దేశంలో సహకార వ్యవస్థ బలోపేతం కోసం కేంద్రం ఇటీవల సహకార మంత్రిత్వ శాఖను నెలకొల్పామ‌ని, దేశంలోని సహకార సంస్థలను పునరుద్ధరించడంతో సహా గ్రామీణ ప్రాంతాల్లో రైతులపై జరుగుతున్న దోపిడీని అరికట్టేందుకు ఈ శాఖ నెలకొల్పామని కేంద్రం సర్కారు స‌మ‌ర్థించుకుంటున్న‌ది.  అయితే సహకార వ్యవస్థకు సంబంధించిన చ‌ట్టాలు రాష్ట్రాల ప‌రిధిలో రూపుదిద్దుకుంటాయి. ఈ విషయంలో జోక్యం చేసుకునే హక్కు కేంద్రానికి లేద‌ని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. కొత్తగా సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడం ద్వారా కేంద్రం కొత్త‌ సమస్యలు సృష్టిస్తున్న‌ది. అయితే తాము అధికారంలోని లేని రాష్ట్రాల్లో అస్థిర‌త్వాన్ని సృష్టించ‌డానికి అనేక కుట్ర‌ల‌కు పాల్ప‌డుతున్న‌ది. త‌మ నిర్ణ‌యాల‌ను వ్య‌తిరేకించే రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌ను ఇబ్బందుల‌కు గురిచేయ‌డం ఏడేండ్లుగా చేస్తున్న‌ది.  బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యున‌ల్ తీర్పు ప్ర‌కారం ఉమ్మ‌డి రాష్ట్రానికి కృష్ణా జ‌లాల్లో తెలంగాణ వాటా తేల్చాల‌ని తెలంగాణ కోరుతున్న‌ది. ఈ స‌మ‌స్య ప‌రిష్కారం కోసం ప్ర‌య‌త్నిస్తామ‌ని చెప్పిన కేంద్రం ఇప్ప‌టికీ దీనిపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు. ఏండ్ల త‌ర‌బ‌డి ఈ అంశాన్నిప‌ట్టించుకోక‌పోగా న‌మ్మి నాన‌బోస్తే అన్న‌ట్టు న‌లుగురు ఎంపీల‌ను గెలిపించినందుకు బీజేపీ ప్ర‌భుత్వం రాష్ట్రానికి ఉన్న హ‌క్కుల‌ను హ‌రించేలా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ది. నీటి పంప‌కాల పూర్తి చేయ‌కుండా గెజిట్ పేరుతో తెలంగాణ నీటి హ‌క్కుల‌పై పెత్త‌నం చేయాల‌ని చూస్తే ప్ర‌జ‌ల నుంచి ప్ర‌తిఘ‌ట‌న త‌ప్ప‌దు. పోరాటాలు తెలంగాణ‌కు కొత్త కాదు. అందుకే రాష్ట్రాల మ‌ధ్య ఉన్న స‌మ‌స్య‌ల‌ను  ప‌రిష్కారం చేయాలి. అప్ప‌టివ‌ర‌కు కేంద్రం తెచ్చిన గెజిట్‌ను ఉప‌సంహ‌రించుకోవాలి. 

-ఎ. రాజు

Labels: , , ,

Thursday 29 July 2021

కార్యాచరణ కావాలె


 కోవిడ్ కారణంగా ప్రపంచం కుదేలైపోయింది. ఉపాధి కోసం పట్నం వెళ్లినవాళ్లు తిరిగి పల్లెల బాట పడుతున్నారు. ఏడాదిన్నరకాలంగా కూలీ చేసుకునేవాళ్ల, ప్రైవేట్ టీచర్లుగా పనిచేస్తున్న వాళ్ల, చిన్న చిన్న పరిశ్రమల్లో పనిచేస్తున్న వాళ్ల జీవితాలు అస్తవ్యస్తమయ్యాయి. ఉన్నత చదువులు చదివి ఉపాధి కోల్పోయి కూలీలుగా మారుతున్న వారి గురించి జీవనగాథలు నిత్యం వార్తల్లో చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు టీచర్లకు ప్రకటించిన 25 కిలోల బియ్యం, రెండు వేల రూపాయల నగదు కొంత ఉపశమనం కలిగించినా ఇది తాత్కాలికమే తప్ప శాశ్వత పరిష్కారం కాదు. అట్లనే కేంద్రం ప్రభుత్వం అయితే ఈ ఏడేండ్ల కాలంలో ఉపాధి కల్పన అన్నది మరిచిపోయింది. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేస్తూ చేతులు దులుపుకుంటున్నది. నిరుద్యోగ రేటు గణనీయంగా పెరిగిపోయింది అని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. 


నీళ్లు, నిధులు,నియామకాలు అన్నది ఉద్యమ ట్యాగ్‌లైన్. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఆరున్నరేండ్ల కాలంలో నియామకాలపైనే నిత్యం చర్చ జరుగుతున్నది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నియామకాల కోసం నినదించాల్సి రావడం దురదృష్టం. రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఖాళీల భర్తీ చేపట్టి నిర్ణీత కాలంలో నియామకాలు పూర్తి చేసి ఉన్నైట్లెతే చాలా కుటుంబాలకు భరోసా దొరికేది. నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న వారు నిరాశనిస్పృహలకు లోనై ఆత్మహత్యల లాంటి అగయిత్యాలకు పాల్పడే పరిస్థితి ఉండేది కాదు. నియామకాలపై ప్రతిపక్షాలు, ఉద్యమంలో కీలకంగా పనిచేసిన పౌరసంఘాలు ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు ప్రశ్నించినా ఎదురుదాడే తప్ప ఫలితం లేదు. నోటిఫికేషన్లు రాక, ఉన్న ఉపాధి పోయి వ్యవసాయ కూలీలుగా, ఉపాధి కూలీలుగా నిరుద్యోగులు మారుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు యాభై వేల ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్లు అని ప్రచారం చేశారు. అది ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఖాళీల భర్తీ ఉన్న అడ్డంకులు ఏమిటి అన్నది స్పష్టంగా చెప్పడం లేదు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నోటిఫికేషన్లు వెలువరించడానికి ఆటంకంగా ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించవచ్చు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవచ్చు. కానీ నియామకాలపై ప్రభుత్వం చెప్పేవి అన్నీ ఆపదమొక్కుల లెక్కనే ఉన్నవి. ఎన్నికల సమయంలో ప్రభుత్వ వ్యతిరేకత కనబడకుండా త్వరలో నోటిఫికేషన్లు అంటూ నిరుద్యోగులను మభ్యపెట్టే ప్రకటనలకే పరిమితం అవుతున్నారు. 


అట్లనే వయోపరిమితి దాటిపోవడం వల్ల వచ్చిన ఒకటి రెండు నోటిఫికేషన్లకు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. వయోపరిమితి సడలింపునకు సంబంధించిన జీవో కూడా 2019 జూలైలోనే ముగిసిపోయింది. ఆ జీవో పొడిగించలేదు. దీంతో వచ్చిన అరకొర అవకాశాలూ పోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 61 సంవత్సరాలకు పెంచింది. అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ, కార్పొరేషన్లను దీన్ని అమలు చేస్తున్నారు. మరి నియామకాల వయోపరిమితి విషయంలో అన్నింటిలో ఒకే విధానం లేదు. అందుకే అన్నీ అర్హతలు ఉన్నా వయోపరిమితి సడలింపు లేకపోవడం వల్ల నిరుద్యోగులు నష్టపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా నిరుద్యోగ సమస్యపై నిర్లక్ష్యాన్ని వీడాలి. నియామకాలపై నిర్దిష్ట కార్యాచరణ ప్రకటించాలి. వయోపరిమితి సడలింపు జీవోను పొడిగించి అన్ని ప్రభుత్వ, కార్పొరేషన్ల ఖాళీల భర్తీలో అమలయ్యేలా చూడాలని నిరుద్యోగులు కోరుతున్నారు. కొత్త జోనల్ వ్యవస్థ అమలుకు ఉన్న ఆటంకాలు కూడా తొలిగిపోయాయి. కేంద్ర హోం శాఖ కొత్త జోన్లకు ఆమోదం తెలుపుతూ గెజిట్ విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు దక్కేలా తెచ్చిన కొత్త జోనల్ ప్రకారమే నియమకాలు జరుగుతాయని ప్రకటిస్తున్నది. యాభై వేల కొలువులకు సంబంధించి ప్రభుత్వం నుంచి వస్తున్న ప్రకటనలు ఇప్పటికీ ఆచరణలోకి రాలేదు. రెండురోజుల క్యాబినెట్‌లోనూ కొలువుల అంశం కొలిక్కి రాలేదు. మరో ఐదు రోజుల తర్వాత మరోసారి క్యాబినెట్ భేటీ ఉంటుందని, కొలువుల భర్తీకి ఆమోదం తెలుపుతుందని వార్తలు వచ్చాయి. ఇది జరిగి పదిహేను రోజులు అవుతున్నది. ఇప్పుడు కొలువుల అంశంపై కార్యాచరణ లేదు.  హుజూరాబాద్ ఉప ఎన్నిక హడావుడిలో అనేక అంశాలు అప్రదానం అయ్యాయి. కొలువుల కోసం ప్రతిపక్షాలు చేస్తున్న నిరసనలపై పట్టింపులు లేదు. . ఏటా ఇయర్ క్యాలెండర్ ప్రకారం నియామకాలు చేపడుతామన్న ప్రభుత్వ ప్రకటన ఆహ్వానించదగినదే. కానీ అది ఆచరణలో అమలైనప్పుడే దానికి విలువ ఉంటుంది.  నిరుద్యోగులు ఎదురుచూస్తున్న నోటిఫికేషన్లపై ప్రభుత్వం ఇప్పటికీ కొలువుల భర్తీపై కారణాలు చెప్పకుండా కార్యాచరణ కావాలె అని నిరుద్యోగులు కోరుకుంటున్నారు.

-ఎ. రాజు

Labels: ,

ఏడేండ్ల విధాన ఫలితాలు

 ఏడేండ్ల విధానాల ఫలితాలు


నీళ్లు, నిధులు అన్నవి తెలంగాణలో ఉద్యమంలో నినాదంగానే కాదు, కీలకాంశాలుగా మారాయి. అందుకే రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రెండు సార్లు లక్ష వరకు రైతు రుణమాఫి చేపట్టింది. ప్రాజెక్టుల నిర్మాణం, చెరువుల పునరుద్ధరణ, చెక్‌డ్యాంల నిర్మాణం, ఎరువుల పంపిణీ, రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ వంటి వ్యవసాయ అనుకూల విధానాలను చేపట్టింది. ఫలితంగా ఈ ఏడేండ్ల కాలంలో రాష్ట్రంలో రైతుల కుటుంబాలకు భరోసా దొరికింది.  దేశంలోనే రైతు ఆత్మహత్యలు అతి తక్కువగా నమోదైన రాష్ట్రం తెలంగాణ అని తాజాగా పార్లమెంటులో కేంద్రం ప్రకటించింది. 


ఈ ఏడేండ్ల కాలంలో రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గుతూ వస్తున్నాయి. రైతుల ఆత్మహత్యలకు పంట నష్టం, గిట్టుబాటు ధరలు, అప్పుల వంటివే కాదు ఇతరత్రా సమస్యలు కూడా కారణం. రాష్ట్రంలో దాదాపు 90 శాతం చిన్న, సన్నకారు రైతులే. ఉన్న భూమి మీదనే కుటుంబం మొత్తం ఆధారపడి జీవించాల్సిన పరిస్థితి. పిల్లల చదువులు, ఇండ్లు కట్టుకోవడం, పెండ్లిళ్లు వంటివి చిన్న, సన్నకారు రైతుల కుటుంబాలకు భారమయ్యేవి. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన గురుకుల పాఠశాలలు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నాయి. ప్రైవేటు పాఠశాలల వలె ఇంగ్లీషు మీడియం చదువులు, నాణ్యతతో కూడిన విద్య, అన్నిసౌకర్యాలతో కూడిన హాస్టల్ వసతులు గురకుల పాఠశాలలు అందిస్తున్నాయి. అందుకే ఇప్పుడు పేద, మధ్య తరగతి ప్రజానీకం తమ పిల్లలను గురుకుల పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. 


పేద, మధ్య తరగతి కుటుంబాలకు పెండ్లిళ్లు ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అందుకే ఆయా కుటుంబాలకు కొంత ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశంతో కళ్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్లకు లక్ష వరకు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా అందిస్తున్నది. పేదవర్గాల వారికి భారంగా ఉన్న విద్య, పెండ్లిళ్లు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాలతో పెద్ద భారం తగ్గింది. అట్లనే ప్రైవేటు దవాఖానల్లో ప్రసవాలు అంటేనే వేలు, లక్షల్లో బిల్లులు చెల్లించలేని దుస్థితి ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం మానవీయంగా ఆలోచించి సర్కారు దవాఖానల్లో ప్రసవాలు చేయించుకుంటే కేసీఆర్ కిట్ అందిస్తున్నది. బాబు పుడితే పన్నెండు వేలు, పాప పుడితే 13 వేలు అందిస్తున్నది. ఈ పథకం చాలా కుటుంబాలకు మేలు చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్‌రూంల నిర్మాణం పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తున్నది. ఈ పథకంపై ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసం విమర్శలు చేస్తున్నా వేలాదిమంది పేదలు తమ సొంతింటి కలను నిజం చేసుకుంటున్నారు. 


ఈ ఏడేండ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. ఒకవైపు భారీ ప్రాజెక్టుల నిర్మాణాలు చేపడుతూ.. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నా సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటుంది. వ్యవసాయరంగానికి పెద్ద పీట వేసింది. వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి తగిన ప్రోత్సాహం అందిస్తున్నది. రైతులకు ఒకప్పుడు భారంగా ఉన్న అనేకం ప్రభుత్వ ఆసరాతో అనేక ఇబ్బందులు తొలిగిపోయాయి. వ్యవసాయరంగానికి అన్నిరకాలుగా అందిస్తున్న సాయానికి తోడు వ్యవసాయరంగ అనుబంధ వృత్తుల ద్వారా రైతుల ఆదాయాలు మెరుగయ్యాయి. వాళ్ల అక్కరలు తీరుతున్నాయి. అప్పుడు చేయాల్సిన అవసరం కొంత తీరింది. రైతుల ఆత్మహత్యలు తగ్గడానికి ఈ ఏడేండ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న, తీసుకుంటున్న విధాన నిర్ణయాలే కారణం. అందుకే రాష్ట్ర ప్రభుత్వంపై ఎన్ని విమర్శలు వచ్చినా కీలక సమయంలో గ్రామీణ ప్రజలు ప్రభుత్వానికి అండగా నిలుస్తూ వస్తున్నారు. వారికి మద్దతు తెలియజేస్తున్నారు.  


-ఎ. రాజు

Labels: , , ,