Friday 13 January 2012

పోరాడరు కానీ పోట్లాడుతారు ...



పాలకుర్తి, ఆర్మూర్ సభలు తెలంగాణపై దండయాత్రలు గానే ఈ ప్రాంత ప్రజలు భావిస్తున్నారు. జగన్, చంద్రబాబు లు పోలీసు బందోబస్తులో దీక్షలు, యాత్రలు చేసి తమ సభలు విజయవంతమయ్యాయని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది. రైతు పేరు చెప్పుకొని  వేలాది మంది పోలీసు, ప్రైవేటు రక్షణలో వీరు యాత్రలు దీక్షలు చేశారు. అలాగే తెలంగాణ పై స్పష్టమైన విధానాన్ని చెప్పాలని డిమాండ్ చేస్తూ వారిని అడ్డుకోవాలని చూసిన ప్రతి తెలంగాణ బిడ్డను గొడ్డును బాదినట్టు  బాదారు. యిప్పుడు రాష్ట్రంలో ప్రజలు ఎదురుకొంటున్న సమస్యలను పరిష్కరించలేని కిరణ్ సర్కారు వీరి యాత్రలకు మాత్రం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడం విడ్డురంగా ఉంది. జగన్, చంద్రబాబు యాత్రల సందర్భంగా వారికి రక్షణ కోసం దాదాపు ఎనిమిది కోట్ల దాక ఖర్చయినట్టు సమాచారం. వేలాది మందిని అరెస్టు చేసి, నిర్బంధించి కిరణ్ సర్కార్ వారికి అండగా నిలబడింది. సర్కారు సహాయంతో తెలంగాణ ప్రాంతం లో చక్కర్లు కొట్టి, ప్రజలు తమను విశ్వసిస్తున్నారని చెప్పుకోవడం సిగ్గుచేటు. అయితే ఇక్కడ ఒక విషయం మరిచి పోతున్నారు. జగన్, చంద్రబాబులు తాము తెలంగాణ కు వ్యతిరేకం కాదని చెప్పిన వారికి నిరసనలు తప్పలేదంటే వారిపై తెలంగాణ ప్రజలు ఎంత విశ్వాసముందో అర్థం అవుతున్నది. ఎర్రబెల్లి, మోత్కుపల్లి, రేవంత్ రెడ్డిలు తెలంగాణ పై తమ అధ్యక్షుడు ఇప్పటికే తన అభిప్రాయాన్ని చెప్పాడు అంటున్నారు. అదే పార్టీకి చెందినా సీమాంద్ర నేత రాజేంద్ర ప్రసాద్ మాత్రం జగన్ ఆర్మూర్ యాత్ర పై స్పందించారు. పార్లమెంటులో సమైక్య ఫ్లకార్డు పట్టుకున్న అయన దానికే కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. ఇక వై ఎస్ ఆర్ కాంగ్రెస్ సీమాంద్ర  నేత మేకపాటి తెలంగాణ పై జగన్ ఇంత కంటే స్పష్టత ఇవ్వలేరు అంటున్నారు. ఈ రెండు పార్టీల తెలంగాణ నేతలు మాత్రం ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష కంటే తమ తమ అధినేతల అనుగ్రహనికే అధిక ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపిస్తున్నది. ఒకరు రెండుకళ్ళు అంటే మరొకరు ఇచ్చే శక్తి, తెచ్చే శక్తి లేదని వంచనకు పాల్పడుతున్నారు. ఈ ద్వంద్వ వైఖరిని నిరసించింది తెలంగాణ ప్రజానీకం. అందుకే వీరి పర్యటనలను ప్రతిఘటించింది. ప్రజల ఆగ్రహాన్ని అణిచివేయడానికి కిరణ్, జగన్, చంద్రబాబులు ఒక్కటయ్యారు ఈవేళ. దాని ప్రశ్నించాల్సిన ఈప్రాంత ప్రజాప్రతినిధులు టి ఆర్ ఎస్ జగన్ పర్యటనను ఎందుకు అడ్డుకోలేదు అనడం అవివేకం. చంద్ర బాబు, జగన్ పర్యటనల సందర్బంగా తెలంగాణవాదులను అరెస్టు చేసిన విషయం వీరికి కనిపించలేదా? అదే చంద్రదండు తెలంగాణ వాదులపై చేసిన దాడులు మరిచిపోయారా? మొన్నఆర్మూర్ సభలో  న్యూ డేమోక్రాసి సభ్యుల మెరుపు ముట్టడి... ఇవన్ని కావా నిరసనలు. మరి మీరు నిజంగా తెలంగాణ కు కట్టుబడి ఉన్నట్లయితే జగన్ పర్యటనను ఎందుకు అడ్డుకోలేదు? మీ అసమర్థతను కప్పి పుచ్చుకోవడానికి ఉద్యమ నేతలపై అవాకులు చెవాకులు ఎందుకు? అందుకే మిమ్మల్నీ మీ అధినేతను తెలంగాణ ప్రజలు నమ్మడం లేదు. నమ్మరు కూడా. ఇదీ కాంగ్రెస్, వై ఎస్ ఆర్ పార్టీ ల కే కాదు తెలంగాణ ను వ్యతిరేకించే అన్ని పార్టీలకు వర్తిస్తుంది.

Labels:

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home