- రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్పై పంజాబ్ పోలీసుల పంజా
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీ (BJP) లో చేరిన రాజ్యసభ సభ్యుడు సందీప్ పాఠక్కు భారీ షాక్ తగిలింది. పార్టీ మారిన కొద్దిరోజులకే ఆయనపై పంజాబ్ పోలీసులు రెండు వేర్వేరు జిల్లాల్లో నాన్-బెయిలబుల్ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ (FIR)లు నమోదు చేశారు. అవినీతి , మహిళల పట్ల వేధింపులకు సంబంధించిన ఆరోపణలతో ఈ కేసులు నమోదైనట్లు అధికారికవర్గాల సమాచారం. ఈ పరిణామంతో ఆయన అరెస్టుకు రంగం సిద్ధం కావడంతో, ఢిల్లీలోని తన నివాసానికి పంజాబ్ పోలీసు బృందం చేరుకోకముందే ఆయన అక్కడి నుండి కారులో బయటకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కీలక వ్యూహకర్తగా ఉన్న సందీప్ పాఠక్, ఇటీవల రాఘవ్ చద్దా వంటి ఇతర ఎంపీలతో కలిసి బీజేపీలో చేరడం పంజాబ్ రాజకీయాల్లో పెద్ద దుమారం రేపింది. అయితే, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ప్రభుత్వం తనపై ఇలాంటి అక్రమ కేసులు పెట్టిస్తోందని బీజేపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. పంజాబ్ అసెంబ్లీలో శుక్రవారం ఆప్ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. ప్రస్తుతం సందీప్ పాఠక్ నివాసం వద్ద భద్రతను పెంచిన పోలీసులు, ఆయన ఆచూకీ కోసం గాలిస్తున్నారు. తనపై నమోదైన కేసుల గురించి తనకు సమాచారం లేదని పాఠక్ పేర్కొన్నప్పటికీ, ఎప్పుడైనా ఆయన అరెస్టు జరిగే అవకాశం ఉందని పోలీసు వర్గాలు సూచిస్తున్నాయి.
No comments:
Post a Comment