Saturday, 2 May 2026

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై నమ్మకం ఉంచండి


  • కౌంటింగ్ సిబ్బంది నియామకంపై తృణమూల్ కాంగ్రెస్‌కు సుప్రీంకోర్టు హితవు

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను , పబ్లిక్ సెక్టార్ యూనిట్ (PSU) సిబ్బందిని కౌంటింగ్ సూపర్‌వైజర్లుగా, సహాయకులుగా నియమించడాన్ని సవాలు చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమకు వ్యతిరేకంగా పనిచేస్తారనే తృణమూల్ వాదనలో పసలేదని, ప్రభుత్వ ఉద్యోగుల పట్ల కొంత గౌరవం ,నమ్మకం ఉంచాలని ధర్మాసనం సూచించింది. ఎన్నికల నిర్వహణలో ఎవరిని నియమించాలనేది కేంద్ర ఎన్నికల సంఘం (EC)  ప్రత్యేక విచక్షణని, దీనిపై జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది.



తృణమూల్ కాంగ్రెస్ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను పక్కనపెట్టి కేవలం కేంద్ర సిబ్బందిని నియమించడం రాష్ట్ర గౌరవాన్ని ప్రశ్నించడమేనని పేర్కొన్నారు. అయితే, కౌంటింగ్ కేంద్రాల వద్ద మైక్రో అబ్జర్వర్లతో పాటు అభ్యర్థుల కౌంటింగ్ ఏజెంట్లు కూడా ఉంటారని, పారదర్శకతకు భంగం కలగదని జస్టిస్‌ జోయ్‌మల్యా బాగ్చీ నేతృత్వంలోని ధర్మాసనం బదులిచ్చింది. సిబ్బందిని ఏ పూల్ నుండి ఎంపిక చేసుకోవాలనేది ఎన్నికల సంఘం ఇష్టమని, నిబంధనల ప్రకారం ఇది చట్టవిరుద్ధం కాదని కోర్టు తేల్చి చెప్పింది.


కలకత్తా హైకోర్టు ఇప్పటికే ఈ నియామకాలను సమర్థించగా, సుప్రీంకోర్టు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. రిటర్నింగ్ అధికారి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి అని, ఆయనకు అన్ని విభాగాల సిబ్బందిని మోహరించే అధికారం ఉంటుందని ఎన్నికల సంఘం తరపున న్యాయవాది డి.ఎస్. నాయుడు కోర్టుకు వివరించారు. చివరకు, ఈ పిటిషన్‌పై తదుపరి చర్యలు అవసరం లేదని పేర్కొంటూ సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని ముగించింది. సోమవారం పశ్చిమ బెంగాల్ ఎన్నికల కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో ఈ తీర్పు ప్రాధాన్యం సంతరించుకుంది.

No comments:

Post a Comment

Featured post

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై నమ్మకం ఉంచండి

కౌంటింగ్ సిబ్బంది నియామకంపై తృణమూల్ కాంగ్రెస్‌కు సుప్రీంకోర్టు హితవు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వ ఉద్...