- షిప్పింగ్ కంపెనీలకు అమెరికా తీవ్ర హెచ్చరిక
వ్యూహాత్మకమైన హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించేందుకు ఇరాన్కు ఎలాంటి రుసుము లేదా 'టోల్' చెల్లించినా కఠినమైన ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా ట్రెజరీ శాఖ షిప్పింగ్ కంపెనీలను హెచ్చరించింది. సురక్షిత ప్రయాణం కోసం ఇరాన్ ప్రభుత్వం లేదా ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) విదేశీ నౌకల నుండి భారీగా డబ్బు వసూలు చేస్తోందన్న నివేదికల నేపథ్యంలో ఈ హెచ్చరిక జారీ అయింది. నగదు రూపంలోనే కాకుండా డిజిటల్ అసెట్స్, ఇన్ఫార్మల్ స్వాప్లు లేదా ఇరానియన్ రెడ్ క్రెసెంట్ వంటి సంస్థలకు విరాళాల రూపంలో చెల్లించినా వాటిని ఆంక్షల ఉల్లంఘనగానే పరిగణిస్తామని అమెరికా స్పష్టం చేసింది. ప్రస్తుతం హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే ఒక్కో నౌక నుంచి ఇరాన్ సుమారు 10 నుండి 20 లక్షల డాలర్ల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇలాంటి చెల్లింపులు చేసే అమెరికా , అమెరికాయేతర సంస్థలు కూడా అమెరికా ఆర్థికవ్యవస్థకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్ (OFAC) హెచ్చరించింది. ప్రపంచ ముడిచమురు రవాణాలో 20 శాతం వాటా కలిగిన ఈ జలసంధిపై పట్టు కోసం ఇరాన్ ప్రయత్నిస్తుండగా, దాన్ని అడ్డుకునేందుకు అమెరికా ఈ తాజా ఆర్థిక ఆంక్షల అస్త్రాన్ని ప్రయోగించింది.
No comments:
Post a Comment