Tuesday, 16 September 2025

విమోచనం, విలీనం, విద్రోహం

 


తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వ హించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది. తాము అధికారంలోకి వస్తే విమోచన దినాన్ని అధికారికంగా జరుపు తామంటున్నది. సెప్టెంబర్ 17పై కమ్యూనిస్టులు, ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల వాదనలు వారివి. అయితే బీజేపీ వాదనలు విడ్డూరంగా ఉన్నాయి. ఎందుకంటే నాటి స్వాతంత్య్రోద్యమంలో, సాయుధ పోరా టంలో వాళ్ల పాత్ర ఏమిటి అన్న ప్రశ్న తలెత్తుతుంది. స్వాతంత్య్ర ఉద్యమంలో లేనివాళ్లు దేశభక్తి గురించి, సాయుధ పోరాటంలో పాల్గొనని వాళ్లు విమోచన దినం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉన్నది అనేది నాటి పోరాటంలో పాల్గొన్న వారి వాదన.

 దేని నుంచి విమోచనం? ఎవరి నుంచి తెలంగాణ విమోచనం? అన్నది ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ మాటల్లో చెప్పాలంటే.. 'నిజాం పాలన నుంచి విమోచనం అన్నాం. కరెక్టే. నిజాం పాలన విమోచనం కోసం ఆ ఉద్యమం నడిస్తే నిజాం పతనం తర్వాత పోరాటం ఆగిపోవాలి. నిజామును గద్దెదించడానికే పోరాటం జరిగితే స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అదే నిజాంను ఈ రాష్ట్రానికి రాజ్ ప్రముఖ్ గా, గవర్నర్ గా నియమించకూడదు. నిజాం నుంచి విమోచనం అనుకుంటే నిజాంను మళ్లీ ఎట్లా గద్దెనెక్కించారనే ప్రశ్న ముందుకు వస్తుంది. కేవలం నిజాం పాలన నుంచే విముక్తి కోసం కా దు, నిజాం పాలనలో వేళ్లూనుకున్నటువంటి, కరుడుగట్టిన ఫ్యూడల్ వ్యవస్థ, ఆ వ్యవస్థలో జరిగిన దోపిడీకి వ్యతిరేకంగా పోరాడి.. దోపిడీ నుంచి విముక్తి కోసం, ఫ్యూడల్ వ్యవస్థ నుంచి విముక్తి కోసం పోరాటం జరిగిందని చెప్పుకుంటాం. అలా చెప్పడానికి కారణం ఏమిటంటే ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం నిజాం పతనం తర్వాత కూడా మూడేండ్లు నడిచింది. 1948 సెప్టెంబర్ 17న నిజాం పదవీ భ్రష్టుడైన తర్వాత భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం 1951 అక్టోబర్ 19 వరకు నడిచింది. కనుక ఆనాటి పోరాటం కేవలం నిజాంకు వ్యతిరేకమే కాదు, నిజాం పాలనలో బాగా బల పడిపోయినటువంటి ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం నడిచింది. ఆ వ్యవస్థలో జరిగిన దోపిడీకి వ్యతిరేకంగా జరిగింది. కనుక అది ప్రధానంగా దోపిడీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటం'. 

బీజేపీ వాదన బైటికి ఎలా ఉన్నా అంతర్గతంగా మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం ఇది తప్ప మరొకటి కాదన్నది కమ్యూనిస్టుల వాదన .  సాయుధ పోరాటం నడిపింది కమ్యూనిస్టులు. త్యాగాలు చేసింది వాళ్లే. ప్రాణాలు కోల్పోయింది కమ్యూనిస్టు కార్యకర్తలే. హైదరాబాద్ సంస్థానంపై పోలీస్ చర్య తర్వాత 1948లో జరిగిన మారణకాండపై నాటి కేంద్ర ప్రభుత్వం సుందర్ లాల్ కమిటీ వేసింది. ఆ నివేదిక ఇప్పటికీ గోప్యంగానే ఉన్నది. వాస్తవాలు ఇలా ఉంటే బీజేపీ తెలంగాణ అనగానే ముఖ్యంగా నిజాం ప్రభుత్వంపై జరిగిన 'ఆపరేషన్ పోలో ' అన్నది హిందూ, ముస్లింల మధ్య పోరాటంగా చిత్రించి దాని ద్వారా నాలుగు ఓట్లు, సీట్లు దక్కించుకోవచ్చనేది ఆపార్టీ ఆలోచన. అందుకే ఇక్కడ ఎన్నికల ప్రచారంలో నిజాం పాలన అంటూ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. 

సంస్థానాల విలీనంలో నాటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ఆ బాధ్యతను నాటి హోం మంత్రి సర్దార్ వల్లబ్ బాయ్ పటేల్ తీసుకున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు. ఆయనకు బీజేపీకి ఏ సంబంధం లేదు. కానీ ఆయనను తమ రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటారు. బీజేపీ చేసింది చెప్పుకోలేక ఇలా సున్నితమైన అంశాలను తెరమీదికి తెచ్చి గంగా జెమునా తెహజీబ్‌ లాంటి హైదరాబాద్‌లో ప్రజల మధ్య ఉన్న సహృద్భావ వాతావరణాన్ని చెడగొట్టవద్దన్నది ప్రజాస్వామికవాదుల అభిప్రాయం. కాబట్టి సెప్టెంబర్‌ 17 విలీనమా? విమోచనమా? విద్రోహమా? అన్నది నాటి పోరాటంలో పాల్గొన్నవాళ్లు, బాధితులు తేల్చుకుంటారు.

Monday, 15 September 2025

స్వాతంత్య్రం తర్వాత జరిగిన నిరసనలపై అధ్యయనం

భారతదేశంలో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరిగిన అన్ని నిరసనలపై, ముఖ్యంగా 1974 తర్వాత జరిగిన వాటిపై అధ్యయనం చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ (BPR&D)ను కోరినట్లు 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' పత్రిక వెల్లడించింది. భవిష్యత్తులో "కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం జరిగే పెద్ద ఎత్తున ఆందోళనలను" నివారించేందుకు ఒక ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని(standard operating procedure - SOP)  రూపొందించే దిశగా, ఆ నిరసనల "ఆర్థిక కోణాలు", వాటి తుది ఫలితాలు  " తెర వెనుక ఉన్న వ్యక్తులను" పరిశీలించాలని ఆయన బ్యూరోను కోరారు. ఆ పత్రిక కథనం ప్రకారం, జులైలో ఇంటెలిజెన్స్ బ్యూరో నిర్వహించిన రెండు రోజుల 'జాతీయ భద్రతా వ్యూహాల సదస్సు-2025'లో షా మాట్లాడినప్పుడు ఈ ఆదేశాలు జారీ చేయబడ్డాయి.



"తెర వెనుక ఉన్న వ్యక్తులతో సహా ఆ నిరసనల కారణాలు, విధానాలు ఫలితాలను విశ్లేషించాలని BPR&Dని ప్రత్యేకంగా కోరారు" అని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారిని ఉటంకిస్తూ 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' రాసింది. "ఈ అధ్యయనం ఆధారంగా భవిష్యత్తులో స్వార్థ ప్రయోజనాల కోసం పెద్ద ఎత్తున జరిగే ఆందోళనలను నివారించడానికి ఒక SOPని రూపొందించాలని ఆదేశించబడింది" అని ఆ పత్రిక పేర్కొన్నది.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే BPR&D, ఈ విషయంపై పరిశోధన చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉన్నట్లు సమాచారం. ఈ బృందం "పాత కేసు ఫైళ్ళ కోసం రాష్ట్ర పోలీసు విభాగాలతో, వాటి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్‌ల నివేదికలతో సహా సమన్వయం చేసుకుంటుంది".

కేంద్ర ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ సాగించదు

 "ఢిల్లీలోని మైనారిటీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ సాగించదు" అని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్  అన్నారు.ఆదివారం నాడు తమిళనాడులోని క్రిష్ణగిరిలో మాట్లాడుతూ...కేంద్ర ప్రభుత్వంతో పలుమార్లు విభేదాలు రావడాన్ని విమర్శిస్తూ.. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టాలు వాటిల్లాయి.  "ఒకరోజు, తమిళనాడుకు మద్దతు ఇచ్చే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తుంది" అని కూడా స్టాలిన్ అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించడంలో విఫలమైనప్పటికీ, 543 మంది సభ్యులు ఉన్న లోక్‌సభలో 240 సీట్లు సాధించి ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. తెలుగు దేశం, జనతా దళ్ (యునైటెడ్) వంటి మిత్ర పక్షాల సహాయంతో బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తోంది.




స్టాలిన్ తన అధికార పర్యటనలో లబ్ధిదారులకు సంక్షేమ సహాయాన్ని పంపిణీ చేసి, చెన్నైలోని తన ప్రభుత్వ పనితీరు గురించి మాట్లాడారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు.

"మా మంత్రులు తంగం తెన్నరసు, గోవి. చెళియన్, ఎస్.ఎస్. శివశంకర్ చెన్నైలో ఒక విలేకరుల సమావేశంలో స్పష్టంగా చెప్పారు, డీఎంకే ఇచ్చిన 505 ఎన్నికల హామీలలో 364 నెరవేర్చబడ్డాయి. మరో 40 హామీలు రాష్ట్ర ప్రభుత్వం పరిశీలనలో ఉన్నాయి. ఇవి కాకుండా, 37 పథకాలు కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఉన్నాయి. 64 పథకాలు ఆర్థిక పరిమితుల కారణంగా అమలు చేయబడలేదు" అని ఆయన అన్నారు.

Featured post

అస్సాం అసెంబ్లీ పోరు: కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష

ప్రియాంక గాంధీ ముందున్న సవాళ్లు ఇవే డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కిం...