Tuesday 7 December 2021

ముందస్తుగానే కండువలు మారుస్తున్నరు


రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీనే అని ప్రజలు భావిస్తున్నారా అంటే అవుననే అంటున్నారు. సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఇప్పటికీ 20 నుంచి 30 స్థానాల్లో బలంగా ఉన్నది. కానీ ఆ పార్టీలో ఉన్న గ్రూప్ రాజకీయాలే గుదిబండగా మారాయి. అందుకే ఉద్యమ కాలంలో కేసీఆర్ తో కలిసి సుదీర్ఘ కాలం పనిచేసిన వారు కూడా కాంగ్రెస్ ను కాదని కాషాయ కండువా కప్పుకుంటున్నారు. దీనికి కారణం లేకపోలేదు. దుబ్బాక, నాగార్జున సాగర్, జీహెచ్ఎంసీ మొదలు హుజురాబాద్ ఉప ఎన్నిక వరకు వచ్చే సరికి ఆ పార్టీ గ్రాఫ్ ఘోరంగా పడిపోయింది. హుజురాబాద్ లో అయితే మూడు వేల ఓట్లకే పరిమితం అయి అధికార పార్టీ ఓటమి భారం కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి చేరింది. 

త్వరలో వేములవాడ, మునుగోడు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావొచ్చు అని రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ దుబ్బాక లో స్వల్ప మెజారిటీ తో గట్టెక్కింది. నాగార్జున సాగర్ ఉప ఉన్నికల్లో ఉనికి కూడా చాటలేకపోయింది. కానీ హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గట్టి షాక్ ఇచ్చింది. ఆ ఫలిత ప్రభావాన్ని తగ్గించడానికి ముఖ్యమంత్రి రెండు మూడు ప్రెస్ మీట్లు పెట్టినా అధికార పార్టీలోని అసంతృప్త నేతలు, కొందరు ఉద్యమకారులు బీజేపీ లో చేరుతున్నారు. దుబ్బాక లో బాగానే ఓట్లు సంపాదించినా, నాగార్జున సాగర్ లో రెండో స్థానంలో నిలిచినా అధికార పార్టీకి ప్రత్యామ్నాయం మనమే అని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు వాళ్ళ కార్యకర్తలకు నమ్మకాన్ని కలిగించలేకపోతున్నారు. అందుకే కాంగ్రెస్ నేతలు టీఆర్ ఎస్ లో, టీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరుతున్నారు.

ధ్యానం కొనుగోలు అంశంపై టీఆర్ఎస్, బీజేపీ ల మధ్య మాటల యుద్ధం గ్రామ స్థాయిలో మొదలు పార్లమెంటు సమావేశాల్లోనూ నడుస్తున్నది. కానీ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికీ కలిసి పనిచేయడం లేదు. ఒక్క తాటి మీదికి రావడం లేదు. కానీ బీజేపీ మాత్రం రాజకీయంగా గుర్తింపు ఉన్న నేతలను, ఉద్యమం లో పనిచేసిన ఫెమిలియర్ వ్యక్తులను పార్టీలోకి తీసుకువచ్చే పని పెట్టుకున్నది. ఈ నెల 13వ తేదీ తో టీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చి మూడేండ్లు పూర్తి అవుతాయి. ఇగ పాలనను పరుగులు పెట్టిస్తామని ప్రకటించి నెలలు గడుస్తున్నా ఆచరణలో అది కనిపించడం లేదు. అనేక సమస్యలు, హామీలు అపరిష్కృతంగానే ఉన్నాయి. ఎన్నికల కు ఇంకా రెండేండ్ల సమయం మాత్రమే ఉన్నది. అందుకే రాజకీయ ఆశావహులు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు.  ఆ మధ్య కేసీఆర్ ముందస్తు ఎన్నికలు వెళ్ళము అన్నారు. కానీ మొదటిసారి ఆరు నెలల ముందుగానే ఎన్నికల కు పోయినట్టు వచ్చే ఏడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే కేసీఆర్ వెళ్లొచ్చు అనే అంచనాలు రాజకీయ వర్గాల్లో ఉన్నాయి. అందుకే రాష్ట్రంలో వివిధపార్టీల నేతల ముందస్తుగా కండువలు మార్చుతున్నారు.

Labels: , , ,

Friday 3 December 2021

ఆ ఆలోచనే అసంబద్ధం!


కాంగ్రెస్ పార్టీ లేకుండా బీజేపీని ఎదుర్కొని కేంద్రంలో అధికారంలోకి రావడం అంత ఈజీ కాదు. మమతాబెనర్జీ యూపీఏ అంటే ఏమిటి? యూపీఏ లాంటిదేమీ లేదు అని చేసిన వ్యాఖ్యలకు అంతేధీటుగా కాంగ్రెస్ స్పందించింది. అట్లనే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీని, రాహుల్‌గాంధీ నాయకత్వంపై చేసిన విమర్శలను కూడా కాంగ్రెస్ నేతలు కొట్టిపారేశారు. పశ్చిమబెంగాల్‌లో భారీ విజయం తర్వాత మమతా బెనర్జీ కేంద్రంలోని బీజేపీ నాయకత్వానికి తానే ప్రత్యామ్నాయం అని భావిస్తుండవచ్చు. ఇటీవల ఈశాన్య రాష్ర్టాల్లో తన పార్టీని విస్తరిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ లేకుండా ప్రాంతీయ పార్టీల కూటమితోనే కమలం పార్టీని ఢీ కొట్టవచ్చు అని అనుకుంటుండవచ్చు. మమతా వ్యాఖ్యలు, ప్రశాంత్ కిశోర్ ట్వీట్ల సారాంశం ఒక్కటిగానే కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ టార్గెట్‌గానే వారి ఇరువురి విమర్శలు సాగుతున్నాయి. అయితే ప్రాక్టికల్‌గా ఇది వర్కౌట్ అవుతుందని అనుకోలేము. ఎందుకంటే 42 స్థానాలున్న పశ్చిమబెంగాల్‌లో గత లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు 22 స్థానాలు వస్తే, బీజేపీ 18 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలు దక్కించుకున్నది. కాంగ్రెస్ వరెస్స్ బీజేపీ ఉన్న రాష్ర్టాల్లో కూడా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ స్వీప్ చేసింది. కానీ ఆ తర్వాత జరిగిన వివిధ రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా దెబ్బతిన్నది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాలను బీజేపీ కోల్పోయింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చీలిక తెచ్చి మధ్యప్రదేశ్‌లో తిరిగి కుర్చీలో కూర్చున్నది. అంతేకాదు గుజరాత్‌లో అయితే మొత్తం 26 స్థానాలు బీజేపీ గెలుచుకున్నది. కానీ ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారానికి అవసరమైన స్వల్ప మెజారిటీతోనే బైట పడిన విషయం విదితమే. మహారాష్ట్రలో శివసేన బీజేపీల సుదీర్ఘకాల భాగస్వామ్యానికి బీటలు పడ్డాయి. అనేక నాటకీయ పరిణామాల తర్వాత ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేనల కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కర్ణాటకలోనూ జనతాదళ్ (సెక్యూలర్), కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఆ  కూటమిలో చిచ్చుపెట్టి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రుల మార్పు అనేది కషాయ పార్టీలో అనేక సమస్యలు తెచ్చింది. యడ్యూరప్పను మార్చి బసవరాజ్ బొమ్మైని కూర్చొబెట్టింది. ఇప్పుడు ఆయనను మారుస్తారనే ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే బీజేపీ గుజరాత్‌లో సీఎంతో ఉత్తరాఖండ్‌లో ముగ్గురు ముగ్గురు సీఎంలను మార్చింది. ఇదంతా ఆయా రాష్ర్టాల్లో బీజేపీని తిరిగి అధికారంలోకి తేవడం, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆయా రాష్ర్టాల్లో మెజారిటీ స్థానాలు సాధించడమే లక్ష్యంగా బీజేపీ కేంద్ర నాయకత్వం ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టింది.


దీనికంటే ముందు వచ్చే ఏడాది జరుగనున్న ఐదు రాష్ర్టాల ఎన్నికలే బీజేపీ అధిష్టానానికి, కాంగ్రెస్ నాయత్వం ముందు సవాలు. ముఖ్యంగా బీజేపీ కేంద్రంలో సొంతంగా రెండుసార్లు సంపూర్ణ మెజారిటీ సాధించడానికి కారణమైన యూపీ ఎన్నికలపైనే అందరి దృష్టి ఉన్నది. అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో యోగీ ప్రభుత్వం తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటుందని ఎగ్జిట్‌పోల్స్ సర్వేలు వెల్లడిస్తున్నాయి. అయితే గణనీయంగా సీట్లను కోల్పోతుందని ఆ సర్వేల సారాంశం. కాబట్టి ఇప్పుడే అక్కడ ఏ పార్టీ కచ్చితంగా గెలుస్తుందో అని చెప్పలేసి పరిస్థితి. సమాజ్‌వాదీ పార్టీ ఓటు శాతం భారీ పెరుగుతుందని సర్వేలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు కూడా పెరుగుతుందని అంటున్నాయి. కాబట్టి ఈ త్రిముఖ పోరులో ఏ పార్టీ యూపీ పీఠంపై జెండా ఎగురవేస్తుందో అన్న సస్పెన్స్ ఇప్పట్లో తేలేలా లేదు. అలాగే పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ కెప్టెన్ అమరిందర్ సింగ్‌ను దించి చరణ్‌జిత్ సింగ్‌ను సీఎం సీటులో కూర్చోబెట్టింది. వచ్చే ఏడాది ఆ రాష్ట్రంలోనూ ఎన్నికలు జరుగనున్నాయి. అక్కడ ఆప్ ప్రభావం చాలా ఉంటుంది అంటున్నారు. అయితే అమరీందర్ పార్టీ వీడినా కాంగ్రెస్ పార్టీపై పెద్దగా ప్రభావం ఏమీ లేదు. గోవా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీతో పాటు ఆప్ అక్కడ గెలుపు ఓటములు నిర్ణయిస్తుంది అంటున్నారు. మణిపూర్‌లో కాంగ్రెస్ పార్టీలో తృణమూల్ కాంగ్రెస్ కల్లోలం సృష్టించింది. అక్కడ ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ వచ్చేలా లేదు. ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్, బీజేపీల మధ్య నువ్వా నేనా అన్నట్టే ఉన్నది. 


ఈ నేపథ్యంలో 20కి పైగా లోక్‌సభ స్థానాలు ఉన్న రాష్ర్టాలు దాదాపు ఎనిమిది ఉన్నాయి. యూపీ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, బీహార్, తమిళనాడులో కలిపి 249 స్థానాలున్నాయి. ఈ రాష్ర్టాల్లో ఒక్క యూపీ, పశ్చిమబెంగాల్ మినహా మిగిలిన రాష్ర్టాల్లో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు బాగానే ఉన్నట్టు గత లోక్‌సభ ఎన్నికల, ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూస్తే అర్థమౌతుంది. బెంగాల్ గెలువగానే బీజేపీకి ప్రత్యామ్నాయం తామే అని తృణమూల్ అధినేత భావిస్తూ కాంగ్రెస్ పార్టీ లేకుండానే కూటమిని ఏర్పాటు చేయవచ్చు అని ఎట్లా అనుకుంటున్నారు? ఎన్సీపీ అధినేత శరద్ పవార్ రాజకీయ అవకాశాల దృష్ట్యా ఆయన కూడా మమతా బెనర్జీ వలె ఆలోచిస్తుండవచ్చు. కానీ ఇప్పుడు దేశంలో 90వ దశకం నాటి పరిస్థితులు లేవు. చాలా రాష్ర్టాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. డీఎంకే, ఆర్జేడీ, ఎస్పీ, శివసేన, జేఎంఎం, లోక్‌జనశక్తి, బీజూ జనతాదళ్, జనతాదళ్ (సెక్యూలర్), వామపక్షాలు బీజేపీకి వ్యతిరేకంగానే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగానే ఉన్నాయి. అలాంటప్పుడు కాంగ్రెసేతర కూటమి ఎట్లా సాధ్యం అవుతుందో మమతా బెనర్జీ,  ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌లకే తెలియాలి. ఐదు రాష్ర్టాల ఎన్నికల ఫలితాల తర్వాతే హస్తిన రాజకీయాలపై ఒక క్లారిటీ వస్తుందనేది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో  వచ్చే సార్వత్రిక ఎన్నికల కూటమి గురించి చర్చలు చేయడంలో తప్పులేదు. కానీ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ లేకుండా కూటమి అనే ఆలోచనే అసంబద్ధంగా ఉన్నది.

Labels: , ,

Thursday 18 November 2021

కొనుగోలు డిమాండుతో కేంద్రంతో కొట్లాట


ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద చేపట్టిన మహాధర్నాలో పాల్గొన్న కేసీఆర్‌ మాట్లాడారు.


‘‘మా ప్రశ్న ఒక్కటే.. తెలంగాణ వడ్లు కొంటారా.. కొనరా?’’ అని సీఎం కేసీఆర్‌ కేంద్రాన్ని ప్రశ్నించారు. రైతులు కొత్త కోరికలు కోరడం లేదన్నారు. పండించిన పంట కొంటారా.. కొనరా? అనే అడుగుతున్నారన్నారు. కేంద్రం అడ్డగోలుగా మాట్లాడుతున్నదని అన్నారు రైతుల గోస తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా ఉందని ఆయన అన్నారు. 


ఇది ఆరంభం మాత్రమే అని అన్నారు. కేసీఆర్ చాలా కాలంగా కేంద్రం బీజేపీ, కాంగ్రెస్ ఏతర కూటమి ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ, యూపీఏ  కూటముల్లో దేనికీ స్పష్టమైన మెజారిటీ రాదనే అంచనాల్లో టీఆర్ ఎస్ అధినేత ఉన్నారు. కాబట్టి కేంద్రంలో ఎవరు అధికారంలోకి రావలన్నా ప్రాంతీయ పార్టీలే కీలకం అనేది కేసీఆర్ వాదన. బెంగాల్ గెలిచిన తర్వాత తృణమూల్ అధినేత కూడా ఇతర రాష్ట్రాల్లో తన ప్రాబల్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నది. ఆప్ కూడా అదే బాటలో ఉన్నది. పంజాబ్, గోవా లలో ఎవరు అధికారంలోకి రావాలన్నా ఆప్ మద్దతు అవసరం అన్నది ఇటీవల వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ద్వారా తెలుస్తున్నది.  శివసేన కూడా మొన్న లోక్ సభ ఉప ఎన్నికల్లో మహారాష్ట్ర అవతల దాద్రా నగర్ హవేలి లో జెండా ఎగురవేసింది. మొన్న జరిగిన వివిధ రాష్ట్రాల్లో జరిగిన 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగింది. అందుకే మహాధర్నా వేదిక ద్వారా వరి కొనుగోలు అంశంతో పాటు దేశం ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను కేసీఆర్ ప్రస్తావించారు.


‘‘ఏడాదిగా దేశ వ్యాప్తంగా రైతులు నిరసన చేస్తున్నారు. సాగు చట్టాలు వద్దని డిమాండ్‌ చేస్తున్నారు. రైతులను బతకనిస్తారా? బతకనివ్వరా? నిజాలు చెప్పలేక కేంద్రం అడ్డగోలు వాదనలు చేస్తున్నది అన్నారు. దేశంలో 40 కోట్ల ఎకరాల భూములున్నాయి. అద్భుతమైన శాస్త్రవేత్తలు ఉన్నారు. బంగారం పండే భూములను నిర్లక్ష్యం చేస్తున్నారు. భారత్‌ ఆకలి రాజ్యమని హంగర్ ఇండెక్స్ లో వెల్లడైందని, ఆకలి సూచీలో పాకిస్థాన్‌ కంటే దిగువన భారత్‌ ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. ఉత్తర భారత రైతులు డిల్లీలో ఆందోళనలు చేస్తున్నారు. దేశాన్ని పాలించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. మేం తెచ్చిన సాగు విధానాలతో రైతులోకం ఓ దరికి వచ్చింది. దిక్కుమాలిన కేంద్రం బుర్రలు పని చేయడం లేదు. ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం చెప్పింది. కేంద్రం తీరుతోనే ఇష్టం లేకున్నా ధాన్యం సాగు వద్దని చెప్పాం. వరికి ప్రత్యామ్నాయ పంటలు వేయమని కోరాం.

ఈ వ్యాఖ్యల వెనుక రాజకీయ వ్యూహాలు ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్ యేతర పార్టీలతో కలసి కార్యాచరణ రూపొందించి పోరాడాలనే ఆలోచన ఉండి ఉండొచ్చు. అట్లనే ధాన్యం కొనుగోలు విషయం కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయాలు, రాష్ట్ర బీజేపీ నాయకత్వ రాజకీయ విధానాల్లో వ్యత్యాసం కనిపిస్తున్నది. ఇదే విషయాన్ని ప్రజల్లో చర్చకు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇటు కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నది. రానున్న శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశం చర్చకు వస్తే అసలు విషయం వెల్లడి అవుతుంది. అప్పుడుఎవరు ఏమిటి అన్నది ప్రజలకు బోధపడుతుంది. అప్పటిదాకా ఎవరి వాదనలు వారు వినిపిస్తూనే ఉంటారు.

Tuesday 16 November 2021

ఎమ్మెల్సీ అభ్యర్థుల కూర్పులో కేసీఆర్ మార్కు


ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను టీఆర్ ఎస్ అధినేత ఖరారు చేశారు. మండలి మాజీ ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, బండ ప్రకాశ్‌, కౌశిక్‌రెడ్డి, సిద్దిపేట మాజీ కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్‌రావులను అభ్యర్థులుగా ప్రకటించారు. ఈ ఆరుస్థానాల్లోనూ ఎన్నిక ఏకగ్రీవం కానున్నది.



అధికార పార్టీ కి ఉన్న సంఖ్యా బలానికి తోడు వారి మిత్రపక్షమైన ఎం ఐ ఎం సభ్యుల మద్దతుతో ఈజీగాఎమ్మెల్యే ల కోటాలో ఆరు స్థానాలు గెలిచే అవకాశం ఉన్నది. ఎమ్మెల్సీ పదవుల కోసం అధికార పార్టీలో ఆశావహుల జాబితా పెద్దగానే ఉన్నది.  సోమవారం పొద్దుగాల నుండే గుత్తా సుఖేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, కౌశిక్‌రెడ్డి, కోటిరెడ్డి, ఆకుల లలిత, ఎర్రోళ్ల శ్రీనివాస్‌, మధుసూదనాచారి, మరికొందరు ఆశావహుల పేర్లపై సీఎం కేసీఆర్‌ టీఆర్ఎస్ ముఖ్యనేతలతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. సిద్దిపేట మాజీ కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డికి గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలని భావించారు. కానీ చివరికి ఎమ్మెల్యే కోటా కిందే ఆయనను ఎంపిక చేశారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండ ప్రకాశ్‌ను అనూహ్యంగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఈటల రాజేందర్ పార్టీ నుంచి బైటికి పోవడం, బీజేపీ నుంచి తిరిగి ఎమ్మెల్యేగా గెలవడం జరిగిపోయాయి.  మొన్న ఉప ఎన్నికల్లో ముదిరాజ్ సామాజిక ఓట్లలో మెజారిటీ ఈటలకే పడ్డాయి. అందుకే భవిష్యత్తు ను దృష్టిలో పెట్టుకొని ఆ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో ఆయన్ను ఎంపిక చేసినట్లు తెలుస్తున్నది. అంతేకాదు కేబినెట్‌ విస్తరణలోనూ బండ ప్రకాశ్‌కు చోటు కల్పించే అవకాశం ఉన్నట్లు అధికారపార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. బండ ప్రకాశ్‌ స్థానంలో రాజ్యసభకు కల్వకుంట్ల కవితను పంపుతారు అంటున్నారు. 

ఇక గవర్నర్ కోటా లోఎమ్మెల్సీకి కౌశిక్‌ రెడ్డి పేరును ప్రతిపాదించారు. అది పెండింగ్ లో ఉండటంతోతాజాగా ఆయన్ను ఎమ్మెల్యే కోటాలో ఎంపిక చేశారు. దీంతో గవర్నర్‌ కోటాకు మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్, ఎర్రోళ్ల శ్రీనివాస్ ల పేర్లు ప్రచారం ఉన్నాయి. ఇంకా వీరితో పాటు చాలా మంది ఎమ్మెల్సీ సీటును ఆశిస్తున్నారు. కేసీఆర్ ఎవరి పేరు ఫైనల్ చేస్తారన్నది చూడాలి. తాజా ఎమ్మెల్సీ కూర్పులో కేసీఆర్ కంప్లీట్ మార్క్ కనిపిస్తున్నది.








   





Labels: , ,

Sunday 3 October 2021

దీదీ దృష్టి ఇక ఆ రాష్ట్రాలపై


పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  భవానీపుర్‌ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, భాజపా అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్‌పై  58,832 ఓట్ల భారీ మెజారిటీతో విజయకేతనం ఎగరవేశారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌లో ఓడిపోయిన మమతా బెనర్జీ.. ఈసారి భవానీపుర్‌ నుంచి బరిలో నిలిచారు. ఈ ఉప ఎన్నికపై అందరి దృష్టి పడింది. సీఎంగా కొనసాగాలంటే తప్పక గెలవాల్సిన ఈ ఎన్నికలో మమత భారీ విజయంతో సత్తా చాటారు. భవానీపూర్‌తో పాటు శంషేర్‌గంజ్‌, జాంగిపూర్‌లోనూ తృణమూల్‌ అభ్యర్థుల విజయం సాధించారు. 

ఆ రాష్ట్రాలపై తృణమూల్, ఆప్ ల దృష్టి

కాంగ్రెస్ పార్టీని బీజేపీ నిలువరిస్తుంటే ప్రాంతీయ పార్టీలు బీజేపీ విస్తరణకు అడ్డుకట్ట వేస్తున్నాయి. రానున్న పంజాబ్ ఎన్నికల్లో ఆప్ కు అవకాశాలు ఉంటాయి అని.ఇప్పటికే సర్వేలు వెల్లడించాయి. గోవా, గుజరాత్ లోనూ ఆప్ ప్రభావం బాగానే ఉంటుంది అని అంటున్నారు. 
బెంగాల్‌‌కు ఆనుకున్న అస్సాం, త్రిపుర రాష్ట్రాలతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో తృణమూల్ కాంగ్రెస్ విస్తరణ యత్నాలు మొదలు పెట్టింది.గోవా మాజీ సీఎం, ప్రస్తుత ఎమ్మెల్యే (కాంగ్రెస్) లూజినో ఫెలిరో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. టీఎంసీలో చేరారు. సిద్ధం చేసుకున్న ఫెలిరో.. బీజేపీని ఎదుర్కోవాలంటే కావాల్సింది మమత బెనర్జీలాంటి స్ట్రీట్ ఫైటర్సేనని వ్యాఖ్యానించారు. ఫెలిరో ద్వారా త్వరలో జరగబోయే గోవా ఎన్నికల్లో తృణమూల్ అడుగుపెడుతున్నది. 

ఈశాన్య రాష్ట్రాల్లో పూర్వ వైభవం కోరుకుంటున్న కాంగ్రెస్‌ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ త్రిపుర రాష్ట్ర అధ్యక్షుడు పీజూష్‌ విశ్వాస్‌ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. రాజకీయాల నుంచి కూడా వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అయితే, అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన పిజూష్‌ విశ్వాస్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అసోంకు చెందిన కాంగ్రెస్ నేత, పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు సుష్మితా దేవ్‌ తృణమూల్‌లో చేరారు. 2024 లోక్ సభ ఎన్నికలకు  మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతున్నారు.

Labels: ,

Thursday 30 September 2021

అధికార పార్టీ ఇచ్చిన అవకాశం


 కాంగ్రెస్ పార్టీని ఆ పార్టీ నేతల మధ్య ఉండే అంతర్గతంగా కలహాలే ఒడిస్తాయి అనేది నానుడి. ఇందులో కొంత నిజం ఉన్నది. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ అధ్యక్షుడి గా ఎంపిక చేసిన తర్వాత భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కానీ పార్టీ కార్యకర్తలో కదలిక ఆయన తెచ్చాడు అన్నది రాజకీయ వర్గాలలో జరుగుతున్న చర్చ. ఇది వాస్తవం కూడా. ఇంద్రవెల్లిలో దళిత దండోరా సభ మొదలు గజ్వేల్ , ఇప్పుడు భూపాలపల్లి బహిరంగ సభల సక్సెస్ కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నది.

అధికార టీఆర్ఎస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు దక్కాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించి టీఆర్ఎస్ లో చేరారు. ఇదే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలకు ఆయా పార్టీలకు అభ్యర్థులను అందిస్తున్నది. ఎన్నికలకు ఇంకో రెండేళ్ల సమయం ఉన్నది. ఇప్పటి నుంచే చాలా నియోజక వర్గాల్లో అధికార పార్టీ నుంచి టికెట్ కష్టం అనుకుంటున్న నేతలు బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం అయ్యాయి. పార్టీలకు ఉండే సహజమైన ఓటు బ్యాంకు కు తోడు ఆయా నియోజకవర్గాల్లో బలమైన నేతలను పార్టీలకు తీసుకుని వచ్చే కార్యాచరణను మొదలుపెట్టాయి. ఇందులో భాగంగా నే వివిధ నేతల చేరిక సందర్భంగా బహిరంగ సభల ద్వారా బలప్రదర్శన చేస్తున్నాయి. 

ఎన్నికల నాటికి ఇంకా చాలామంది ఆశావహులు, అధికారపార్టీలోని అసంతృప్త నేతలు పార్టీ మారే అవకాశం ఉన్నది. తమ రాజకీయ అవసరాల కోసం అధికార పార్టీ చాలా మంది నేతలను పార్టీలో చేర్చుకున్నది. కొందరికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చింది. ఇంకా కొంతమంది కి కార్పొరేషన్ పదవులు కట్టబెట్టింది. ఇంకా కొంతమందిని హామీలు ఇచ్చి తీసుకున్నది. ఈ ఏడేండ్ల కాలంలో అధికార పార్టీ నుంచి పదవులు ఆశించి వివిధ పార్టీల నుంచి వచ్చిన వారి సంఖ్య పెద్దదే. అయితే ప్రత్యామ్నాయం కనిపించనంత కాలం మౌనంగానే ఉన్నారు. ఇప్పుడు రెండు జాతీయ పార్టీలు రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలనే వ్యూహాలకు పదును పెట్టాయి. వీటి ఫలితమే అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలలోకి చేరికలు మొదలు అయ్యాయి. ఇది అధికార పార్టీ ప్రతిపక్షాలకు ఇచ్చిన అవకాశమే.


Labels: , , ,

Sunday 26 September 2021

పార్టీలో పూర్తి పట్టు ఇక ఆ ఇద్దరిదే!

జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు, సీపీఐ నేత కన్నయ్య కుమార్‌, గుజరాత్‌కు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేశ్‌ మేవానీ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. మహాత్మగాంధీ జయంతి రోజైన అక్టోబర్‌ 2న వారిద్దరూ కాంగ్రెస్‌లో చేరనున్నారని సమాచారం. వాస్తవానికి సెప్టెంబర్‌ 28నే వీరు పార్టీలో చేరుతారనే వార్తలు వినిపించాయి. అయితే ఆలస్యం అయినా ఈ ఇద్దరు యువనేతల చేరిక దాదాపు ఖరారైంది.

ఇటీవల రాహుల్‌ గాంధీతో  కన్నయ్య కుమార్‌ భేటీ అయ్యారు. అప్పుడే ఆయన కాంగ్రెస్‌లో చేరుతారన్న అంతా అనుకున్నారు. సీపీఐలో ఇమడలేకపోవడం ఆయన చేరికకు కారణమని అంటున్నారు. ఆయనను బీహార్‌ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిని చేసే యోచనలో కాంగ్రెస్‌ పార్టీ ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. గత ఎన్నికల్లో ఆర్జేడీ ప్రచార బాధ్యతలన్నీ తన భుజానికెత్తుకున్న తేజస్విని లాలు ఇప్పటికే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన సంగతి విదితమే. రామ్ విలాస్ పాశ్వాన్ చనిపోయిన  తర్వాత ఆయన కుమారుడు గత ఎన్నికల సమయంలో నితీశ్ కు వ్యతిరేకంగా, బీజేపీ కి అనుకూలంగా పనిచేశారు. అయినా ఆ పార్టీ ఘోరంగా విఫలమైంది. ఆ తర్వాత ఆ పార్టీలో చీలిక వచ్చింది. ఇప్పుడు చిరాగ్ను బీజేపీ దూరం పెట్టింది. పార్టీలో చీలిక తెచ్చిన తన బాబాయ్ పశుపతి పాశ్వాన్ కు కేంద్ర మంత్రి మండలి లో చోటు దక్కింది. కన్హయ్య కుమార్, తేజస్వి యాదవ్, చిరాగ్ లు కలిసి రానున్న రోజుల్లో బీజేపీ, నితీశ్ కు వ్యతిరేకంగా పనిచేయన్నారు. 

మరోవైపు గుజరాత్‌ వాద్గాం నియోజకవర్గానికి చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేశ్‌ మేవానీ కూడా చాలా రోజులుగా కాంగ్రెస్‌ పార్టీతో టచ్‌లో ఉన్నారు. పంజాబ్‌ ముఖ్యమంత్రిగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన చరణ్‌జిత్‌ సింగ్‌ను ఎంపిక చేయడాన్ని ఆయన స్వాగతించడం గమనార్హం. వచ్చే ఏడాది గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జిగ్నేశ్‌ చేరిక కాంగ్రెస్‌కు కొంతమేర కలిసొచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బీజేపీ ఇటీవలే గుజరాత్ ముఖ్యమంత్రిని మార్చింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అనైక్యత వల్లనే స్వల్ప మెజారిటీతో బీజేపీ గటెక్కింది. రాష్ట్ర కాంగ్రెస్ కూడా నాయకత్వ సమస్య ఎదురుకొంటున్నది. అందుకే జిగ్నేశ్‌ను పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌ను చేయాలని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తున్నది. హార్దిక్ పటేల్ ను కూడా కలుపుకుని గుజరాత్ లో బీజేపీ కి చెక్ పెట్టాలన్నది కాంగ్రెస్ అధిష్ఠానం ఆలోచనగా కనిపిస్తున్నది.అప్పట్లో కాంగ్రెస్ నాయకత్వ సమస్యపై సీనియర్లు సంధించిన లేఖాస్త్రాలపై సోనియా, రాహుల్ లు పెద్దగా స్పందించలేదు. అప్పుడప్పుడు నాయకత్వం పై సీనియర్లు విమర్శులు చేస్తున్నా మౌనమే సమాధానం అవుతున్నది.


కానీ  ఇటీవల యువ నాయకులకు పార్టీలో పెద్ద పీట వేసే నిర్ణయాలు తీసుకుంటున్నది. పార్టీలో ఇప్పటిదాకా  సోనియా గాంధీ నిర్ణయమే అందరికీ శిరోధార్యం. కానీ పంజాబ్ లో ముఖ్యమంత్రి మార్పు మొదలు కన్హయ్య కుమార్, జిగ్నేశ్‌ మేవాని వంటి నేతలను కాంగ్రెస్ లో తీసుకునివచ్చి రానున్న ఎన్నికల్లో బీజీపీని నిలువరించే వ్యూహాలకు రాహుల్, ప్రియాంక వాద్రాలు ఇప్పటి నుంచే అమలుచేస్తున్నారు. రానున్న రోజుల్లో రాహుల్, ప్రియాంకలే పార్టీపై పూర్తి పట్టు సాధించబోతున్నారు అనడానికి ఇవే సంకేతాలు.

Labels: , ,

Sunday 19 September 2021

అర్హత పరీక్ష నిర్వహణ లోనూ అలసత్వం


ప్రభుత్వ ఉద్యోగ నియామకాలపై ప్రభుత్వం నుంచి త్వరలో వంటి ప్రకటనలే తొమ్మిది నెలలుగా వినిపిస్తున్నాయి. నియామకాలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అర్థమౌతున్నది. కానీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను నాలుగేండ్లుగా నిర్వహించలేని స్థితిలో ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ చేపడుతున్నది. దీంతో ఇప్పటికే ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నారని, ఖాళీలు ఉండవని ప్రభుత్వం భావిస్తున్నది. అయితే సాంఘిక, గిరిజన, బీసీ సంక్షేమ గురుకులాలతో పాటు మోడల్ స్కూళ్లలో 6నుంచి 8వ తరగతి వరకు బోధించే ట్రైన్డ్ గ్రాడ్యూయేట్ టీచర్స్ (టీజీటీ) ఉద్యోగాలు భర్తీ చేయలన్నా టెట్ అర్హత తప్పనిసరి. 

ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారం ఏడాదికి ఒకసారి అయినా టెట్ నిర్వహించాలి. కానీ నాలుగేండ్లుగా టెట్ నిర్వహించకుండా కాలయాపన చేస్తున్నది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2016,2017లో పరీక్ష నిర్వహించారు.  2018లో మరోసారి పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించడానికి అప్పటి విద్యాశాఖా మంత్రి కడియం శ్రీహరి సమీక్ష జరిపారు. దీనికి నిబంధనలు సవరించాల్సిన అవసరం ఉన్నదని ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదన పంపింది. దానిపై ప్రభుత్వంపై నుంచి ఇప్పటికీ నిర్ణయం వెలువడలేదు. 2019 ఎన్‌సీటీఊ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ క్రమంలో బీఈడీ అభ్యర్థులు కూడా ఎస్‌జీటీ పోస్టులకు పోటీపడవచ్చు. టెట్‌లో పేపర్-1 రాసేలా నిబంధనలు మార్చాలని అధికారులు 2019 మార్చిలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దానిపై కూడా స్పందనలేదు. 

రాష్ట్రంలో ఇప్పటికే టెట్ అర్హత సాధించిన వారు 2.50 లక్షల మంది వరకు ఉంటారని అంచనా. ప్రభుత్వం ప్రకటిస్తున్నట్టు త్వరలో చేపట్టబోయే నియామకాల్లో వీరికి మాత్రమే అవకాశం కల్పిస్తామని అనుకుంటే న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి. టెట్ నిర్వహించకుండా టీచర్ల ఖాళీలపై నోటిఫికేషన్ ఇవ్వడం కుదరని విద్యాశాఖ వర్గాలే అంగీకరిస్తున్నాయి. అయితే ప్రభుత్వ ఉద్దేశం స్పష్టం. కొలువుల భర్తీపై త్వరలో ప్రకటనలే వెలువడుతున్నాయి. ఆ తర్వలో ఎప్పుడు అన్నదే ప్రశ్న. అప్పట్లో క్యాబినెట్ భేటీలో ఖాళీలు అస్పష్టంగా ఉన్నాయని పూర్తి సమాచారంతో రావాలని మంత్రివర్గం ఆదేశించింది. ఆ తర్వాత జరిగిన క్యాబినెట్ భేటీలోనూ ఖాళీలపై స్పష్టత ఉన్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఖాళీల భర్తీకి ప్రభుత్వానికి ఉన్న అడ్డంకులేమీ లేవు. కానీ నియామకాలు చేపట్టాలనే ఆలోచన లేనప్పుడు ప్రకటనలకే పరిమితం అవుతుంది. తొమ్మిది నెలలుగా నిరుద్యోగుల కండ్ల ముందు కనిపిస్తున్నది ఇదే.

Labels: ,

Saturday 18 September 2021

మార్పు పంజాబ్ లో మొదలై

మొన్నటిదాకా సీఎం లను మార్చుతూ బీజేపీ వార్తల్లో నిలిచింది. పంజాబ్ పరిణామాలతో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ జాబితాలో చేరింది. ఆ రాష్ట్రానికి కొత్త సీఎం రానున్నారు.

పంజాబ్‌లో రాజకీయాలు కొంత కాలంగా అనేక పరిణామాల అనంతరం ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ తన పదవికి రాజీనామా చేసేదాకా వచ్చింది. మెజార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని మార్చాలని కొన్ని రోజులుగా కాంగ్రెస్ అధిష్ఠానం పై ఒత్తిడి చేస్తున్నారు. అధిష్ఠానం రాజీనామా చేయాలని అమరీందర్‌కు సూచించినట్లు సమాచారం. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న  నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకున్నది.


రాష్ట్రంలో రాజకీయ పరిణామాలతో విసిగిపోయానని, కాబట్టి పదవిలో కొనసాగలేనని సోనియాగాంధీకి  కెప్టెన్ వివరించినట్టు వార్తలు వచ్చాయి. ఈ పరిణామాలు చోటుచేసుకున్న కొన్ని గంటల్లోనే రాజీనామా సమర్పించారు. అయితే రాజీనామా అనంతరం మీడియా మాట్లాడిన కెప్టెన్‌ అమరిందర్ సింగ్ దీన్ని అవమానంగా భావిస్తున్నానని అన్నారు. తన మద్దతుదారులతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటాను  అన్నారు. అయితే కొంతకాలంగా కెప్టెన్, సిద్ధూ ల మధ్య నెలకొన్న విభేదాలు తారా స్థాయికి చేరాయి. వచ్చే ఏడాది ఎన్నికలకు కాంగ్రెస్ అధిష్ఠానం కార్యాచరణ ఇప్పటికే మొదలు పెట్టింది. అందుకే కెప్టెన్ వ్యతిరేకించినప్పటికి సిద్దూని నియమించింది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సూచనలను కాంగ్రెస్ అధిష్ఠానం ఆచరణలో పెట్టినట్టు కనిపిస్తున్నది. కాంగ్రెస్ ఒంటరిగా పోటీచేసే రాష్ట్రాల్లో అధికారంలోకి రావడం, అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తిరిగి పవర్ ను నిలబెట్టుకోవడం, భాగస్వామ్య పక్షాలు బలంగా ఉన్నచోట ఆయాపార్టీలకు మద్దతు ఇచ్చి బీజేపీని నిలువరించడం వంటి ప్రణాళికలను వ్యూహాత్మక అమలుచేస్తున్నది. జార్ఖండ్ లో ఇదే చేసింది. మహారాష్ట్ర లో ఎన్నికల తర్వాత కొత్త కూటమిలో కాంగ్రెస్ పార్టీనే కీలకం. ఛత్తీస్ గఢ్ లో సీఎం మార్పు పై ఆ పార్టీలో నెలకొన్న విభేదాలకు కూడా త్వరలో ముగింపు ఉండొచ్చు. రాజస్తాన్ లో రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి. పంజాబ్


 లో ప్రస్తుత మార్పు అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2024 లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేసినట్టే భావించాలి.


Labels: , ,

Wednesday 15 September 2021

ప్రత్యామ్నాయం లేకుండా వరి వద్దంటే ఎట్లా?

వ్యవసాయం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. అయితే కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు సమాఖ్య ప్రభుత్వానికి విరుద్ధంగా ఉన్నాయి. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చెప్తున్నారు. కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలతో వ్యవసాయ రంగం కుప్పకూలిపోయే ప్రమాదం ఉన్నదని, దీనివల్ల ఆహార భద్రత కు ముప్పు వాటిల్లనున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు, రైతు సంఘాల నేతలు ఆందోళనలు చేస్తున్నారు. 

ఉప్పుడు బియ్యాన్ని కొనేది లేదని కేంద్రం చెప్పింది. ఈ నేపథ్యంలో వచ్చే యాసంగి నుంచి వరి పంట వేయడం అంటే రైతులు ఉరి వేసుకోవడమే! అన్న సీఎం కేసీఆర్ అభిప్రాయం పై వివాదం చెలరేగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై రైతులు, రైతు సంఘాలు, ప్రతిపక్షాలు తప్పు పడుతున్నాయి. ఎందుకంటే ప్రత్యామ్నాయ ప్రణాళికలు లేకుండా ఉన్నపళంగా రైతులను వరి వేయవద్దు అనడం సరికాదు. ఎందుకంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో వరి దిగుబడులు సాధించిన రాష్ట్రం తెలంగాణ అని, దీనికి కారణం తమ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం వల్లనే ఇది సాధ్యమైందని ఆ మధ్య కేసీఆర్ వ్యాఖ్యానించారు. అలాగే ఆఖరి గింజ వరకు ధాన్యం కొంటామని కూడా అన్నారు. ఇప్పుడు మాట మారుస్తున్నారు అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

రాష్ట్రంలో దాదాపు 90 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల వారు అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న ఇతర పంటలు వేయాలంటే ఆ భూములు వాటికి అనుకూలంగా ఉన్నాయో లేదో ఒక శాస్త్రీయ అధ్యయనం అంటూ ఏదీ లేదు. రెండు మూడు శాతం మంది ఆదర్శ రైతులు చేసే ప్రయోగాలను మిగిలిన రైతులంతా అనుసరించాలనడం అశాస్త్రీయం. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ప్రాజెక్టులు కట్టి, ఒక నిర్దిష్ట వ్యవసాయ విధానం లేకుండా ఇప్పడు వరి సాగు చేయవద్దు అనడం పాలకుల అవివేకానికి నిదర్శనం.ముఖ్యమంత్రి గతంలోనూ సన్న రకం వడ్లు సాగు చేయాలని చెప్పి విమర్శల పాలయ్యారు. మాట్లాడితే దేశానికి మన పథకాలు ఆదర్శం అనే టీఆర్ ఎస్ నేతలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కారణంగా చూపెట్టి  రాష్ట్ర రైతుల మెడ పై కత్తి పెట్టడం కరెక్టు కాదు. అంతేకాదు జిల్లాల్లో ఫుడ్ ప్రాసెస్ పరిశ్రమలు నెలకొల్పుతామని ప్రభుత్వం ఇప్పటికే అనేక సార్లు ప్రకటించింది. జిల్లాల వారీగా వీటిపై సమగ్ర అధ్యయనం చేసి ఆచరణలో పెట్టి అప్పుడు ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లిస్తే ఫలితం ఉంటుంది. ఇవేవీ లేకుండా రైతులు వరి కి బదులు ఇతర పంటలు సాగు చేస్తే లాభాలు వస్తాయి అనడం రాష్ట్ర ప్రభుత్వం సమస్య నుంచి తప్పుకోవడమే కానీ పరిష్కార మార్గాల కోసం ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు


చూపెట్టినట్టు కాదు.

Labels: ,

Tuesday 14 September 2021

సార్వత్రిక ఎన్నికల సన్నద్ధానికే


ముఖ్యమంత్రులను మార్చే సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో ఉండేది. ఇప్పుడు కమలనాథులు కూడా ఆ జాబితాలో చేరిపోయారు. గడిచిన ఆరు నెలల కాలంలో నలుగురు ముఖ్యమంత్రులను మార్చింది. పార్టీలో నెలకొన్న అన్నిరకాల సమస్యలను పరిష్కరించుకొని  వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి సన్నద్ధం కావాలన్నది మోదీ,షా ల వ్యూహంగా కనిపిస్తున్నది. అందుకే ఇటీవల చేపట్టిన కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులతో పాటు నలుగురు సీఎం మార్పుల ఇందులో భాగం అంటున్నారు. 


ముఖ్యమంత్రులపై అసంతృప్తి వ్యక్తమైతే వెంటనే గుర్తించాలి. దాన్ని పరిష్కరించాలనే సూత్రాన్ని బీజేపీ అమలు చేస్తున్నది. బీజేపీ అధినాయకత్వం 2017 ఎన్నికలకు 16 నెలల ముందు అప్పటి సీఎం ఆనందీబెన్‌తో రాజీనామా చేయించి విజయ్ రూపాణీకి కుర్చీ కట్టబెట్టింది. ఎన్నికలు 15 నెలల్లో ఉన్నాయనగా రూపాణీని దించి పాటీదార్ వర్గానికి చెందిన భూపేంద్ర పటేల్‌ను తెరపైకి తెచ్చింది. నరేంద్రమోదీ గుజరాత్ సీఎంగా ఎన్నికైన నాటి నుంచి రెండున్నర దశాబ్దాలుగా అక్కడ బీజేపీ అధికారంలో కొనసాగుతున్నది. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి పోటీని ఎదుర్కొన్నప్పటికీ అధికారాన్ని నిలబెట్టుకోగలిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉన్నది. అలాగే కోవిడ్ కట్టడిలో రూపాణీ ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. దీంతోపాటు ప్రకృతి విపత్తుల సమయంలో సరిగ్గా పనిచేయకపోవడం, పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి అంశాల్లో ప్రభుత్వంపై అక్కడి ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొన్నది. ప్రభుత్వ వైఫల్యాలను ఆప్ తనకు అనుకూలంగా మలుచుకుంటున్నది.ఆమ్ ఆద్మీ పార్టీ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తన బలాన్ని పెంచుకుంటున్నది. అలాగే రాష్ట్రంలో నిర్ణాయత్మక శక్తిగా 12 శాతం ఉన్న పాటీదార్లు కొంతకాలంగా ముఖ్యమంత్రి పదవి తమ సామాజికవర్గానికి ఇవ్వాలంటూ డిమాండు చేస్తున్నారు. ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో జాతీయ, రాష్ట్ర స్థాయిలో సరైన నాయకత్వం లేని స్థితి వంటి అంశాలను తమకు లాభిస్తాయి అని, మళ్లీ గుజరాత్ కాషాయ జెండాను ఎగురవేయాలన్నది బీజేపీ అధినాయకత్వం ఆలోచన. అందుకే ఆర్‌ఎస్‌ఎస్‌తో దీర్ఘకాల అనుబంధం ఉన్న భూపేంద్ర పటేల్‌ను సీఎం సీటులో కూర్చొబెట్టింది. మృదు స్వభావి, గుజరాత్‌లో బూత్ మేనేజ్‌మెంట్ పితామహుడిగా పేరున్న భూపేంద్ర నేతృత్వంలో మళ్లీ గెలువవచ్చనే అభిప్రాయం ఆ పార్టీ అధినాయకత్వంలో ఉండి ఉంటుంది. అందుకే విజయ్ రూపాణీ రాజీనామా తర్వాత రకరకాల పేర్లు తెరమీదికి వచ్చాయి. కానీ ఊహాగానాల జాబితాలో కూడా లేని పేరు భూపేంద్ర పటేల్‌ను ఎంపిక చేశారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. 

ప్రస్తుతం బీజేపీ రూటు మార్చింది. కొత్తవారినే సీఎం కుర్చీలో కూర్చొబెడుతున్నది. తొలిసారి ఎమ్మెల్యే అయిన భూపేంద్ర పటేల్ ను గుజరాత్ లో,  ఉత్తరాఖండ్‌లో పుష్కర్‌సింగ్ ధామీని నియమించింది. ఆరు నెలల్లో మార్చిన నలుగురు సీఎంలు పార్టీని విజయపథంలో నడిపించలేరని బీజేపీ అంతర్గత సర్వేలో వెల్లడైనట్టు సమాచారం. ఉత్తరాఖండ్ త్రివేంద్ర సింగ్‌తో మొదలైన మార్పులో ఆయన స్థానంలో తీరథ్ సింగ్ రావత్‌ను నియమించినా నాలుగు నెలలు కూడా ఆయన కొనసాగలేదు. అలాగే కర్ణాటకలో యడ్యూరప్పపై పార్టీలో నెలకొన్న అసంతృప్తితో ఆయన సామాజికవర్గం పార్టీకి దూరం కాకుడదని ఆయన అనుచరుడైన బసవ బొమ్మైకి బాధ్యతలు అప్పగించారు. 


ముఖ్యమంత్రుల మార్పుపై బీజేపీలో అంతర్గత కలహాలే కారణమని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తున్నది. కానీ వారి పార్టీలో ఉన్న విభేదాలను పరిష్కరించుకోకుండా పక్కవారిపై విమర్శలు చేసినంత మాత్రానా ప్రజాదరణ ఉండదని ఆ పార్టీ నేతలు గుర్తించాలి. మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్, జ్యోతిరాదిత్య సింధియాల మధ్య తలెత్తిన విభేదాల ఫలితమే అక్కడ అధికారాన్ని కోల్పోయింది. రాజస్థాన్‌లోనూ అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్ మధ్య పోరు నడుస్తున్నది. ఛత్తీస్‌గఢ్‌లో   అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు పెరిగిపోతున్నాయి.  సీఎం భూపేశ్ బఘేల్, ఆరోగ్యమంత్రి టీఎస్​ సింగ్ దేవ్​ మధ్య నెలకొన్న విభేదాలు పరిష్కారం కాక అనిశ్చితి కొనసాగుతున్నది. వచ్చే ఏడాది ఎన్నికలు ఎదుర్కొబోతున్న పంజాబ్‌లోనూ సీఎం అమరిందర్, పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. పంజాబ్, గుజరాత్ రాష్ర్టాల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వాల వైఫల్యాల ఫలితంగా ఆప్ అక్కడ బలపడుతున్నది. ఢిల్లీలో అధికారంలో ఉన్నది. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతున్నదని ఇటీవల ఆ పార్టీ నాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాల బట్టి స్పష్టం అవుతున్నది.

Labels: , ,

Thursday 9 September 2021

వాస్తవాలను విస్మరిస్తే..

ఈ మధ్య ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆసక్తికరమైన అంశాన్ని లేవనెత్తారు. పద్నాలుగు ఏండ్లు ఉద్యమంలో అగ్రభాగం లో ఉన్న పార్టీ, ఏడేండ్లుగా అధికారంలో కొనసాగుతున్న పార్టీ ఎన్నికల్లో గెలవడానికి చాలా కష్టపడుతున్నది అన్నారు. నిజమే. ముఖ్యంగా రెండోసారి ప్రజలు భారీ మెజారిటీ కట్టబెట్టారు. అయినా వారు ఆశించిన స్థాయిలో పాలన లేదని భావించారో ఏమో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన ఆరు నెలలకే లోక్ సభ ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో అధికార పార్టీకి ఆశ్చర్యాన్ని, షాక్ కు గురిచేసే ఫలితాలు వచ్చాయి. నాలుగు స్థానాలు బీజేపీ, మూడు స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోకి పోయాయి. 

ఇక అప్పటి నుంచి జరిగిన వివిధ ఎన్నికల్లో ఫలితాలు అయితే హిట్ లేదా ఫట్ అన్నట్టే వచ్చాయి. దీనికి కారణం ఇప్పటికీ సంస్థాగతంగా అధికార పార్టీ బలంగా లేదు. అందుకే కొన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీకి చెందిన కీలక నేతలు వెళ్ళిపోతే అక్కడ పార్టీ నిర్మాణాన్ని మొదటి నుంచి చేపట్టాల్సి వస్తున్నది. అది కూడా ఇతర పార్టీల నుంచి అప్పటికప్పుడు కొంత జనాలకు తెలిసిన నేతలను పార్టీలోకి తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఫలితంగా ద్వితీయ శ్రేణి నేతలు కొత్తగా వచ్చిన వారితో కలిసి పార్టీ గెలుపు కోసం కృషి చేసినా కొన్నిసార్లు ఫాయిదా ఉండటం లేదు. దీనికి కారణం కొన్నివర్గాలు అధికార పార్టీకి అనుకూలంగా కొన్నివర్గాలు వ్యతిరేకంగా ఉన్నారు. ఈ లెక్కల అంచనాలు అప్పుడప్పుడు బెడిసి కొడుతున్నాయి. దీంతో ఎన్నికల ఫలితాలు ప్రతికూలంగా వస్తున్నాయి. 

మొదటిసారి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు, ప్రాజెక్టులు మంచి ఫలితాలను అందించాయి. వాటిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ని దృష్టిలో పెట్టుకొని కొత్త పథకాలు ప్రారంభించి ఉండి ఉంటే బాగుండేది. విధాన పరమైన నిర్ణయాలు ఆచరణలో కి వచ్చేసరికి సరిగ్గా అమలు కావడం లేదు. అలాగే చాలా ఏండ్లుగా అసంతృప్తితో ఉన్న నిరుద్యోగులను, ఇంకా ఇతర వర్గాల సమస్యలపై సరైన స్పందన లేదు. ఎన్నికల సమయంలో ఈ వర్గాలు ఎక్కడ తమకు వ్యతిరేకంగా ఓటు వేస్తారో అన్న అనుమానంతో అప్పటికప్పుడు వాళ్లను ప్రసన్నం చేసుకునే ప్రకటనలు ఇస్తున్నారు. అవి ఆయా ఎన్నికలు అయిపోగానే అటకెక్కుతున్నాయి. అందుకే ఓట్ల వేటలో వివిధ ఎన్నికల్లో ఆపసోపాలు పడుతున్నది. వాస్తవాలను విస్మరించి చేసే రాజకీయాలు ఎల్లకాలం నడువవు అన్న విషయాన్ని ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.


Labels: ,

Monday 6 September 2021

త్వరలో..త్వరలో.. త్వరలో

నియామకాలకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి మొదలు మంత్రుల దాకా తొమ్మిది నెలలుగా "త్వరలో" " అంటున్నారు. ఇది చిన్నప్పుడు గోడల మీద కనిపించిన "ఓ స్త్రీ రేపు రా" రాతలను గుర్తుచేస్తున్నాయి. రాష్ట్రంలో ఎన్నికల సమయంలో నియామకాల వార్త నిత్యం పత్రికల్లో కనిపిస్తుంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత నియామకాల మాట వినిపించదు. వార్త కనిపించదు. ఇది కొన్ని నెలలుగా చూస్తున్నదే అని నిరుద్యోగులు అంటున్నారు.

ప్రమోషన్ల తో ఖాళీ అయ్యేవి రెండో దఫా మొదటి దఫా లో యాభై వేల ఖాళీల భర్తీకి వెంటనే చర్యలు చేపట్టలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించినట్టు వెలువడిన ప్రకటన నెలలు గడిచాయి. కానీ ఖాళీల భర్తీ కోసం ఎలాంటి కార్యాచరణ ఇప్పటివరకు లేదని నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పోనీ ఇయర్ క్యాలెండర్ అయినా ప్రకటించి ఈ ఏడాది ఈ పోస్టులు భర్తీ చేస్తామన్న స్పష్టత కూడా ప్రభుత్వం నుంచి లేదు. 

కొన్నినెలలుగా చిత్తశుద్ధి లేని ప్రకటనలతో నిరుద్యోగులను అయోమయానికి గురిచేయడం మినహా చేసింది ఏమీ లేదు. ముందుగా ఒకేసారి యాభై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు అనేది ఆచరణలోకి రాలేదు. కానీ ఖాళీలకు సంబంధించిన అంకెల వార్తలు వారం వారం మారుతున్నాయి. అంతిమంగా నియామకాలపై ప్రభుత్వ అసలు ఉద్దేశం "త్వరలో" అంటే తొందరేమి లేదని అని అర్థం చేసుకోవాలి అన్నట్టు ఉన్నది.


Labels: , ,

Saturday 4 September 2021

ఎన్నిక వాయిదాతో ఫాయిదా ఎవరికి?

హుజురాబాద్ ఉప ఎన్నిక వాయిదా పడింది. పండుగల సీజన్ ముగిసిన తర్వాతే ఉప ఎన్నిక నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం కోరినట్టు ఈసీ వెల్లడించింది. దసరా తర్వాతే హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నిర్వహిస్తామని స్పష్టం చేసింది. అక్టోబర్‌ లేదా నవంబర్‌లో ఉప ఎన్నిక ఉండే అవకాశం  పేర్కొంది. ఈ నెల 1వ తేదీన 12 రాష్ట్రాల సీఎస్‌లతో సీఈసీ సమావేశమై ఎన్నికల నిర్వహణ పై కేంద్ర ఎన్నికల సంఘం ఆయా రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకున్నది.

హుజురాబాద్ ఉప ఎన్నికను టీఆర్ ఎస్, బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నేడో రేపో షెడ్యూల్ రావొచ్చని, అందుకే దళితబంధు పథకాన్ని హుజురాబాద్ లో కాకుండా వాసాలమర్రిలోనే ముఖ్యమంత్రి ప్రారంభించా రు వార్తలు కూడా వచ్చాయి. ఇంకా అధికార పార్టీ ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు ఆ నియోజకవర్గ నేతలకు కట్టబెట్టింది. నిధులు విడుదల చేసింది. వాగ్దానాలను చేసుకుంటూ పోతున్నది. ఎన్నిక ప్రచార హీట్ ను పెంచింది అధికార పార్టీనే. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం మేరకు ఈసీ ఉప ఎన్నిక ను వాయిదా వేసింది. దీంతో నిన్నటి దాకా ఉధృతంగా జరిగిన ఉప ఎన్నిక ప్రచార వాతావరణం చల్లబడనున్నది. 

అయితే ఈ ఉప ఎన్నిక వాయిదాతో ఫాయిదా ఎవరికి?ఎలాగైనా ఈ ఎన్నికలో గెలువాలనే పట్టుదలతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. అందుకే ఈ ఉప ఎన్నికల్లో లబ్ధి పొందడానికి అన్ని ప్రయత్నాలు చేసింది. అన్ని అధికార అస్త్రాలు వినియోగించుకున్నది. అయినా ఎన్నిక ఫలితం ఏకపక్షం కాదన్న విషయం అవగతం అయ్యిందని ఆ నియోజకవర్గ ప్రజలు చెప్తున్న మాట. ఈటల రాజేందర్ రాజీనామా నేపథ్యం అధికార పార్టీ ప్రచారంలో పెట్టినా అక్కడ అమలవుతున్న పథకాలు, పనులు మా నియోజకవర్గాల్లోనూ అమలు చేయాలనే డిమాండ్లు ప్రజలు , ప్రజాప్రతినిధుల నుంచి ఎక్కువగా వస్తున్నది. ఎన్నిక వాయిదా పడటం వల్ల ఈటల రాజేందర్ కు ప్రజల్లో ఉన్న సానుభూతి తగ్గుతుందా? అధికార పార్టీకి ఈ వాయిదాతో ఫాయిదా ఉంటుందా వేచిచూడాలి.


Labels: ,

Thursday 2 September 2021

సమయం కాదు, సందర్భం కాదు


రెండు దశాబ్దాలకు పైగా సంకీర్ణ ప్రభుత్వాలకు కాలం చెల్లి కమలనాథులకు ప్రజలు పట్టంగట్టారు. ఈ ఏడేండ్ల కాలంలో మోదీ, షాలు కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ర్టాల్లో పాగా వేయడానికి ప్రయత్నం చేసి మొదటి ఐదేండ్లు విజయం సాధించారు. అందుకే కాంగ్రెస్ పార్టీ చాలా రాష్ర్టాల్లో అధికారాన్ని కోల్పోవడమే కాకుండా కకావికలం అయ్యింది. అయితే 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బొటాబొటి మెజారిటీలో బీజేపీ అధికారం దక్కించుకున్నది. ఆ ఎన్నికల సమయంలో ఒక సందర్భంలో బీజేపీ ఓడిపోతుందనే సంకేతాలు కూడా వచ్చాయి. మోదీ సొంతరాష్ట్రం కావడం వల్ల ఆ రాష్ట్ర ఎన్నికల ఫలితాల గురించి అంత ఆసక్తి నెలకొన్నది. అయితే చివరికి సాధారణ మెజారిటీ కంటే కొన్ని సీట్లను దక్కించుకుని తిరిగి అధికారాన్ని నిలబెట్టుకున్నది. ఆ క్రమంలోనే బీహార్‌లో జరిగిన ఎన్నికల్లో ఆర్జేడీ, జేడీయూ కూటమి బీజేపీని మట్టికరిపించాయి. అ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు తిరిగి జేడీయూ, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా చేశాయి. ఒడిషాలోనూ పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ 2019 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి నవీన్ పట్నాయక్ క్లీన్ ఇమేజ్, రాజకీయ అనుభవం ముందు చతికిలపడింది. ఆ తర్వాత మహారాష్ట్రలో దశాబ్దాల బీజేపీ-శివసేన కూటమి బద్దలు అయ్యింది. పంజాబ్‌లో అకాలీదళ్-బీజేపీ కూటమి చెదిరిపోయింది. ఫలితంగా బీజేపీ పాలిత, భాగస్వామ్య పార్టీల చేతిలో ఉన్న మహారాష్ట్ర, పంజాబ్ పోయాయి. 2019లో జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జేజేపీ పార్టీ సహకారంతో మనోహర్ లాల్ ఖట్టర్ తన ఖుర్చీని పదిలం చేసుకున్నాడు. 2018లో జరిగిన ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో బీజేపీ పాలిత రాష్ర్టాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నది. మొన్న బెంగాల్ ఎన్నికల్లో ఏం జరిగిందో విదితమే. తమిళనాడులో డీఎంకే గెలువడంతో బీజేపీ పాలిత, భాగస్వామ్య పార్టీల పాలిత జాబితా నుంచి చాలా రాష్ర్టాలు పోయాయి. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలగొట్టి గద్దెనెక్కినా యడ్యూరప్ప స్థానంలో బసవరాజు బొమ్మై సీఎం అయ్యారు. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ బీజేపీ పరిస్థితి ఏమిటి అన్నది ఇప్పుడే చెప్పలేం. మధ్యప్రదేశ్‌లోనూ జ్యోతిరాధిత్య సింధియా తిరుగుబాటు ఫలితంగా మధ్యప్రదేశ్‌లో బీజేపీ తిరిగి అధికారాన్ని కైవసం చేసుకున్నది.  


కేంద్రంలో అధికారాన్ని నిర్ణయించే కీలక రాష్ర్టాలన్నింటిలో బీజేపీ ఐదేండ్ల కిందటి కంటే చాలా బలహీనపడింది. ఒక్క యూపీలోనే బలంగా ఉన్నది. అయితే ప్రస్తుత బలమే తిరిగి బీజేపీని వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలో నిలబెట్టలేవు. అట్లా అని కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారా? అంటే అదీ లేదు. ఆ పార్టీలో నెలకొన్న అంతర్గత సమస్యలే ఆ పార్టీని నిండా ముంచుతున్నాయి. కలిసి పోరాడాల్సిన సమయంలోనే గ్రూపులుగా విడిపోయి అధికారానికి దూరమౌతున్న సందర్భాలు ఈ ఏడేండ్ల కాలంలో అనేక రాష్ర్టాల్లో చూశాం. ఇప్పటికీ ఆ పరిస్థితి మారలేదు. ఈ సమయంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి ప్రాంతీయ పార్టీలు కీలకం కానున్నాయా? అంటే అవుననే అంటున్నారు. ముఖ్యంగా యూపీ, బెంగాల్, మహారాష్ట్ర, బీహార్, తమిళనాడు, ఒడిషా, ఏపీ, తెలంగాణ, కేరళ రాష్ర్టాల్లో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ ఏకపక్షంగా సీట్లు గెలుచుకునే పరిస్థితి లేదు. మిగతా రాష్ర్టాల సంగతి ఎలా ఉన్నా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే మెరుగైన స్థానాలనే దక్కించుకునే అవకాశం ఉన్నది. అలాగే కమలనాథులు కూడా తమ పట్టును నిలుపుకుని లోక్‌సభ ఎన్నికల్లో గతంలో కంటే మెరుగైన స్థానాలు దక్కించుకునే వ్యూహ రచన ఇప్పటి నుంచే చేస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత ఆశిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ ఇప్పుడు సాధ్యమయ్యేలా లేదు. ఎందుకంటే ఉన్న ప్రాంతీయ పార్టీల అధినేతలు ఇప్పుడు కేసీఆర్ ఫ్రంట్‌తో జతకట్టే అవకాశాలు అంతగా లేవు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమస్యలతో సతమతమౌతున్నప్పటికీ 19 ప్రతిపక్ష పార్టీలతో సంప్రదింపులు చేస్తున్నది. ఇటీవల ఆన్‌లైన్ ద్వారా సమావేశం నిర్వహించింది. బీజేపీ వ్యతిరేక కూటమిని కూడగట్టే ప్రయత్నం చేస్తున్నది. ఈ సమయంలో ఇటు బీజేపీతో గాని, అటు కాంగ్రెస్‌తో గాని సమాన దూరం పాటిస్తున్నవి ఏపీ, తెలంగాణలోని అధికార పార్టీలు. కాంగ్రెస్ మద్దతు లేకుండా కేంద్రంలో అధికారం అంత ఈజీ కాదన్నది అందరూ అంగీకరిస్తున్నదే. అందుకే రేపటి సార్వత్రిక ఎన్నికల నాటికి రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధికారం దక్కించుకోవడం సంగతి ఏమో గాని గతంలో కంటే ఎక్కువగానే లోక్‌సభ సీట్లను కోల్పోయే ప్రమాదం పొంచి ఉన్నది. అధికార పార్టీపై అన్నివర్గాల్లో నెలకొన్న అసంతృప్తి దీనికి కారణం. అలాగే వచ్చే సార్వత్రిక ఎన్నికలు బీజేపీ అనుకూల, వ్యతిరేక కూటముల మధ్యనే జరుగుతాయి. తెలంగాణ కంటే పెద్ద రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులు కూడా తమ రాష్ట్రాలను వదిలి హస్తిన రాజకీయాలవైపు చూసే అవకాశం లేదని స్పష్టం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం ఆశిస్తున్న హస్తిన రాజకీీీయ కూటమికి స్థానం లేదు. ఇది సమయం కాదు, సందర్భం కాదు.

Labels: , ,

గ్యాస్ సిలిండర్ ధర మళ్లా మండింది


పదిహేను రోజుల వ్యవధిలోనే గ్యాస్ ధర మళ్లా మండింది. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు అన్నట్టు దేశ జీడీపీ పెరగడం లేదు. కానీ గ్యాస్, డీజీల్, పెట్రోల్ (జీడీపీ) ధరలు మాత్రం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. తాజా పెరిగిన గ్యాస్ ధరలతో సంవత్సర కాలంలో ప్రజలపై అధికభారం పడనున్నది. గ్యాస్ ధర ఎంత పెరిగినా కేంద్రం ఇచ్చే సబ్సిడీ పెరగడం లేదు. గడిచిన ఏడాది కాలంలో ఒక్కో సిలిండర్‌పై 287 రూపాయలు పెరిగింది. కానీ కేంద్రం ఇచ్చే సబ్సిడీ రూ. 40.71 మించింది లేదు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత సబ్సీడీపై కోత విధిస్తూ వచ్చింది. 


సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అని అధికారంలోకి వచ్చిన తర్వాత కమలనాథులు ఇస్తున్న నినాదాలు నీటిమాటలే అవుతున్నాయి. ప్రజలపై పన్నుల భారాన్ని వేస్తూ దేశ సంపదను అంతా కొంతమంది చేతుల్లోనే పెట్టే విధాన నిర్ణయాలు తీసుకుంటున్నది. ప్రభుత్వ ఆస్తులన్నీ ప్రైవేట్‌పరం చేస్తున్నది. కరోనా కారణంగా రాష్ర్టాల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. లాక్‌డౌన్ వల్ల కొన్ని నెలల పాటు వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయాయి. అట్లనే అసంఘటిత రంగంలో పనిచేస్తున్న లక్షలాదిమంది ఉపాధి అవకాశాలు పోయాయి. ఉపాధి కోసం పట్టణాలకు వలస వెళ్లిన కూలీలు పల్లెల బాట పట్టారు. కోవిడ్ సమయంలో బతికుంటే బలిసాకు తిని అయినా బతుకవచ్చు అని సొంత ఊళ్లకు వచ్చిన వారికి ఇక్కడ ఉపాధి అవకాశాలు కరువయ్యాయి. గడిచిన నాలుగు దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేనంత దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన కేంద్రంలోని పెద్దలు ప్రజల నిత్యావసర వస్తువుల ధరలతోపాటు గ్యాస్, డీజీల్, పెట్రోల్ ధరలు నెల నెలా పెంచుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజలపై భారం పడకుండా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో పేద, మధ్యతరగతి ప్రజల బతుకులు కొనబోతే కొరివి, అమ్మబోతే అడివి లెక్క తయారయ్యాయి. ఉల్లిగడ్డల ధరల పెరుగుదలపై జరిగిన నిరసనలతో రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి కోల్పోయిన ఉదంతాలు ఉన్నాయి.  మోదీ అధికారంలోకి రాకముందు పెట్రోల్, డీజీల్ ధరల పెరుగుదలపై అప్పటి కేంద్ర ప్రభుత్వంపై ఒంటికాలిపై లేచారు. ఇప్పుడేమో ధరల పెరుగుదలపై మౌనంగా ఉన్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన ఈ సమయంలో ధరల పెంపుతో వారిపై భారాన్ని వేస్తున్నారు. ఉల్లి ధరల పెరుగుదలపై జరిగిన నిరసనలతో రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి కోల్పోయిన ఉదంతాలు ఉన్నాయి. ఈ ఏడేండ్ల కాలంలో దేశ ప్రజలపై పన్నుల భారాన్ని మోపుతున్న కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు తగిన సమయంలో తగిన విధంగా సమాధానం ఇస్తారు. 


Labels:

Tuesday 31 August 2021

కష్టకాలంలో కాంగ్రెస్


వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని గద్దెదింపడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ పావులు కదుపుతున్నది. ఇందుకోసం ఇటీవల 19 పార్టీలతో వర్చువల్‌ సమావేశం కూడా నిర్వహించింది. దేశ క్షేమం కోసం మనమంతా కలిసి పనిచేయడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని సోనియాగాంధీ ఆ సమావేశంలో స్పష్టం చేశారు. అలాగే ప్రజాసమస్యలపై ఐక్యపోరాటం చేయాలని నిర్ణయించారు. ఇంతవరకు బాగానే ఉన్నది. కాంగ్రెస్‌ పార్టీ వివక్ష పార్టీలను ఏకం చేసే పనిపెట్టుకున్నది. కానీ ఆ పార్టీలో నెలకొన్న అంతర్గత సమస్యలను పరిష్కరించకుండా విపక్ష పార్టీలకు సారథ్యం ఎలా వహిస్తుంది? జాతీయస్థాయిలో కాంగ్రెస్‌ పార్టీకి పటిష్ట నాయకత్వం లేదు. దీనికితోడు ఎన్నికల్లో వరుస ఓటములతో క్యాడర్‌లో నైరాశ్యం నెలకొన్నది. పార్టీలో అంతర్గతంగా అసమ్మతి రాగం కొంతకాలంగా కొనసాగుతున్నది. ఫలితంగా మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోయింది. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ర్టాలలో సీఎం కుర్చీ కోసం కొట్లాట నడుస్తున్నది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరిగే ఏడు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని ఎలా సమాయత్తం చేస్తుంది. ఈ ఎన్నికల ఫలితాలే 2024 పార్లమెంటు ఎన్నికలను ప్రభావితం చేస్తాయి.


2022లో జరిగే ఏడు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ  పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, మణిపూర్‌, గోవాలో నేరుగా ఎదురుకోనున్నది. ఇందులో గోవాలో గోవా ఫార్వార్డ్‌ పార్టీ (జీఎస్‌పీ) 2022 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసే ప్రయత్నాలు చేస్తున్నది. ఇక పంజాబ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీలో సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌, కొత్తగా ఎన్నికైన పీసీపీ అధ్యక్షుడు సిద్దూ వర్గాల మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తున్నది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న పరిస్థితుల్లో ఇరువురు నాయకుల మధ్య నెలకొన్న ఆధిపత్యపోరు పంజాబ్‌లో పరిస్థితులు ప్రతికూలంగా మారే అవకాశం ఉన్నది. కేంద్రంలో అధికారాన్ని అందించే అతిపెద్ద రాష్ట్రం యూపీ. అక్కడ కాంగ్రెస్‌ పార్టీ మూడుదశాబ్దాలుగా మనుడగ పోరాటం చేస్తున్నది. యూపీ సీఎం ఆదిత్యనాథ్‌, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ ఇప్పటికే ఎన్నికల వ్యూహరచన చేస్తున్నారు. ఈ సమయంలో కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేసి, ఎన్నికలకు సిద్ధం చేయాల్సిన బాధ్యత ప్రియాంక వాగ్రాపై పడింది. ఉత్తరాఖండ్‌లోనూ మాజీ సీఎం హరీశ్‌సింగ్‌ రావత్‌, ఆ రాష్ట్ర మాజీ పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ ప్రీతమ్‌ సింగ్‌ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఒకే సంవత్సరంలో ఇద్దరు ముఖ్యమంత్రులను మార్చి రాజకీయంగా ఇబ్బందులు కొనితెచ్చుకున్న కమలం పార్టీని ఎదుర్కొని కాంగ్రెస్‌ పార్టీ అధికారాన్ని దక్కించుకునే అవకాశాలను అంతర్గత కుమ్ములాటలతో చేజార్చుకుంటున్నది. అలాగే కీలక రాష్ట్రం గుజరాత్‌లో కాంగ్రెస్‌ పార్టీ చేతులు ఎత్తేసింది. ఆ రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. దీనికి బాధ్యత వహిస్తూ రాష్ట్రస్థాయి కీలక నేతలైన పీసీసీ అధ్యక్షుడు అమిత్‌ చావ్లా, ప్రతిపక్ష నేత పరేశ్‌ ధనాని రాజీనామా చేశారు. రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి రాజీవ్‌ సతావ్‌ చనిపోయి నాలుగు నెలలు దాటింది. దీంతో కీలకమైన మూడు పదవులకు పూర్తి స్థాయి నియామకాలు జరగలేదు. దీంతో నాయకులు లేని కాంగ్రెస్‌ క్యాడర్‌లో అయోమనం నెలకొన్నది. హిమాచల్‌ ప్రదేశ్‌లోనూ అంతే. ఆ రాష్ట్ర మాజీ సీఎం వీరభద్రసింగ్‌ మరణం కాంగ్రెస్‌ పార్టీకి పెద్దలోటే అంటున్నారు. అక్కడ బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నది. ఈ అవకాశాన్ని కాంగ్రెస్‌ పార్టీ అందిపుచ్చుని అధికారాన్ని కైవసం చేసుకునే ప్రయత్నాలు ఏవీ మొదలుపెట్టలేదు. ఇట్లా కాంగ్రెస్‌ పార్టీ ఒంటరిగా పోటీచేసే రాష్ర్టాల్లో అంతర్గత కలహాలు, భాగస్వామ్య పార్టీలతో కలిసి పోటీచేసే చోట విభేదాలు పరిష్కరించుకోనంత కాలం కాంగ్రెస్‌ పార్టీకి కష్టకాలమే.

Labels:

ప్రత్యక్ష తరగతులు-ప్రమాద హెచ్చరికలు

 


సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి బడులు తెరువాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దాదాపు ఏడాదిన్నర కాలం తర్వాత స్కూళ్లు ప్రారంభం కావడం సంతోషమే. కానీ కరోనా థర్డ్‌వేవ్‌ ప్రమాదం పొంచి ఉన్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరిస్తూనే ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉన్నదని చెప్తున్నది. ఈ విషయాల సంగతి ఎలా ఉన్నా పిల్లల ప్రాణాలతో చెలాగాటం వద్దు అన్నది మెజారిటీ ప్రజల నుంచి వస్తున్న డిమాండు. సుదీర్ఘకాలం ప్రత్యక్ష తరగతులకు దూరంగా ఆన్‌లైన్‌ క్లాస్‌లతో పాఠాలు వింటున్న పిల్లల మానసికస్థితి దెబ్బతింటుందన్న వైద్య నిపుణుల మాటలు నిజమే. కానీ ఏడాదిన్నర కాలంగా బడులు బంద్‌. పారిశుద్ధ్యం అనేది లేకపోవడంతో చాలా స్కూళ్లు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ముఖ్యంగా ప్రభుత్వ బడులలో ఈ సమస్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక, పట్టణ సంస్థలు స్కూళ్ల పారిశుద్ధ్య పనులు చూసుకుంటాయని చెప్పింది. కానీ ఆ ఆదేశాలు అక్కడక్కడా అమలవుతున్నా క్షేత్రస్థాయిలో సరైన స్పందన లేదన్నది ప్రధాన పత్రికల్లో వస్తున్న కథనాలలో కనిపిస్తున్నది. 


మరోవైపు ప్రైవేటు స్కూళ్లల్లోనూ ఆన్‌లైన్‌ క్లాసులు ఉండవని ప్రభుత్వం అంతర్గతంగా నిర్ణయించింది. ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన జీవోలో, పాఠశాల విద్యాశాఖ ఇచ్చిన మార్గదర్శకాల్లోనూ ఆన్‌లైన్‌ క్లాస్లులు ఉండబు అన్న విషయాన్ని స్పష్టం చేయలేదు. దీనిపై అధికారులను వివరణ అడిగితే ప్రత్యక్ష బోధన ప్రారంభమంటే ఆన్‌లైన్‌ క్లాసులు ఉండవనే అర్థం అని చెప్తున్నారు. దేశంలో కొన్నిరోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. అక్టోబర్‌లో థర్డ్‌ వేవ్‌ పొంచి ఉన్నదన్న హెచ్చరికల నేపథ్యంలో రాష్ర్టాలను కేంద్రం అప్రమత్తం చేసింది. రానున్న రెండు నెలలు పండుగల సీజన్లు. వీటిని దృష్టిలో పెట్టుకుని సెప్టెంబర్‌ 30 వరకు కోవిడ్‌ ఆంక్షలను పొడిగించింది. ఈ నేపథ్యంలో కోవిడ్‌ నిబంధనలను అనుసరించి క్లాసుకు ఎంతమంది ఉండాలన్న గైడ్‌లైన్స్‌ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు రాలేదు అన్నది ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాల వాదన. పిల్లల తల్లిదండ్రులలో 30 శాతం మంది ప్రత్యక్ష తరగతుల వైపు, 40 శాతం మంది ఆన్‌లైన్‌ క్లాసులే కావాలని, ఇంకా కొంతశాతం మంది పరిస్థితులను బట్టి తమ పిల్లలను బడులకు పంపాలా వద్దా అన్నది నిర్ణయం తీసుకుంటామని అంటున్నారు. ఇదిలా ఉండగా మీ పిల్లల బాధ్యత మీదే, మీకు ఇష్టమైతేనే బడికి పంపండి అని ప్రైవేటు స్కూళ్ల వాళ్లు సర్క్యులర్లు జారీచేస్తున్న విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం భయం వద్దు నిశ్చింతగా పిల్లలను బడికి పంపండి అని ప్రకటనలు చేస్తున్నది. అయితే పర్యవేక్షణ లేకుండా, పారిశుద్ధ్య పనులు పూర్తికాకుండా స్కూళ్లకు పిల్లలను పంపడానికి ఏ తల్లిదండ్రులు సాహసం చేయరు.

 ప్రత్యక్ష తరగతులు, ప్రమాద హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిల్‌ దాఖలు అయ్యింది.  తెలంగాణ విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనపై రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యక్ష బోధనకు కచ్చితంగా  విద్యార్థులను బలవంతం చేయొద్దని ఆదేశించింది. తరగతులకు హాజరుకాని విద్యార్థులపై చర్యలు తీసుకోవద్దని.. ప్రత్యక్ష తరగతులు నిర్వహించని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. మరోవైపు గురుకులాలు, హాస్టళ్లలో ప్రత్యక్ష బోధన ప్రారంభించవద్దని హైకోర్టు ఆదేశించింది. గురుకులాలు, హాస్టళ్లను ఇప్పుడే తెరవద్దని స్పష్టం చేసింది. కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. అప్పుడే తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపుతారు.

Labels: , ,

Friday 27 August 2021

పార్టీలు కాదు వ్యక్తులే ప్రధానమట

 హుజురాబాద్ లో ఉప ఎన్నికల్లో పార్టీలతో పనిలేదు. వ్యక్తులే ప్రధానం అంటున్నారు అంట ఆ నియోజకవర్గంలో ని ప్రజలు. ప్రచారంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు మీరేం చేశారు అంటే మీరేం చేశారు అని విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. అయితే అక్కడి ప్రజల మనోగతం భిన్నంగా ఉన్నదని సమాచారం.

రాష్ట్ర ప్రభుత్వం హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలని సర్వశక్తులు ఒడ్డుతున్నది. ఎన్నిచేసినా ఆ నియోజకవర్గంలోని ప్రజలతో ఈటల రాజేందర్ కు ఉన్న వ్యక్తిగత అనుబంధం ఫలితంగా ప్రభుత్వం ప్రయోగిస్తున్న పథకాలు ఏవీ పనిచేసేలా లేవు అంటున్నారు. ఈ ఉప ఎన్నిక వరకు అక్కడ పార్టీలతో సంబంధం లేకుండా ఈటల రాజేందర్ వైపే ఉన్నారట. పార్టీ లతో సంబంధం లేకుండా అన్ని పార్టీల నేతలు, కార్యకర్తల సమస్యలు పరిష్కారం చేయడం, పక్షపాతం చూపకపోవడం, ప్రజలకు అందుబాటులో ఉండటం వంటివి ఈటల రాజేందర్ కు కలిసి వచ్చే అంశాలని ప్రజల అభిప్రాయం. అలాగే కోవిడ్ సమయంలో ఆరోగ్య శాఖ మంత్రిగా తాను అందించిన సేవలను అక్కడి ప్రజలు మననం చేసుకుంటున్నారు.


 ఈ నియోజకవర్గంలో పరిస్థితుల గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిఘా విభాగాల ద్వారా సమాచారం తెప్పించుకుంటున్నది. బహుశా అందుకే మొన్న కేటీఆర్ హుజురాబాద్ ఉప ఎన్నిక మా ప్రభుత్వం కూలిపోదు అనే మాటలు మాట్లాడి ఉంటారు. 

ప్రస్తుతం హుజురాబాద్ లో నెలకొన్న పరిస్థితులు ఇవి. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించి, ప్రచారం మొదలు పెడితే పరిణామాలు ఎలా ఉంటాయి అన్నది నోటిఫికేషన్ వచ్చేవరకు తెలుస్తుంది. 

Labels: ,

Wednesday 25 August 2021

నేతలు.. దూషణలు


రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు దూషణలకు కేంద్ర బిందువు అయ్యాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య వ్యక్తిగత దూషణల కాలం నడుస్తున్నది. ఇవి సామాజిక మాధ్యమాల్లో కూడా అనుకూల, ప్రతికూల వాదనలకు వేదిక అవ్వడమే ఇప్పటి విషాదం. ప్రజా సమస్యల పేరుతో జరుగుతున్న ఈ వాదోపవాదాలు చివరికి అసలు అంశాలను పక్కదోవ పట్టిస్తున్నాయి. ఇందులో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అంటే తమను ఎన్నుకున్న ప్రజలదే అసలు తప్పు అనేలా ఉన్నారు.

నాయకులు సహనం  కోల్పోతున్నారు అంటేనే వాళ్ళకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్స సందర్భంలోనే అసహనానికి గురవుతుంటారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్, బీజేపీ నేతల నుంచి రాజకీయ విమర్శలతో పాటు ప్రతిఘటనలు ఎదురవుతున్నాయి. దీనికి ప్రతిగా ఏడేండ్ల బీజేపీ పాలనపై, అంతకుముందు పదేండ్ల కాంగ్రెస్ పాలనపై అధికార పార్టీ నుంచి విమర్శలు వస్తున్నాయి. కేంద్రంలో, రాష్ట్రంలో వివిధ అంశాలపై ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాలపై జరుగుతున్న రాజకీయ చర్చలు అదుపుతప్పి బూతుల దాకా వెళ్తున్నాయి. అవి సామాజిక మాధ్యమాల్లో కి వచ్చే సరికి మరింత శృతి మించుతున్నాయి. 

చర్యకు ప్రతిచర్య అన్నట్టు కొంతమంది నేతల వ్యవహార శైలి పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేసే దాకా వచ్చింది. కాబట్టి నాయకులు వ్యక్తిగత దూషణలు మాని, ప్రజా సమస్యలపై నిర్మాణాత్మక. చర్చలు చేస్తేనే ప్రజల్లో విశ్వసనీయత పెరుగుతుంది.. చాలా సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయి.

Labels: ,

ఆ మాటల ఆంతర్యం!


హుజురాబాద్ ఉప ఎన్నిక తమకు చిన్న విషయం అంటున్న అధికార పార్టీ అగ్ర నాయకుల మాటల ఆంతర్యం ఏమిటి అన్నది వాళ్ళ క్యాడర్ కే అర్థం కావడం లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ పాలనా విధానాల పై, కొంతమంది అధికారుల పై జరుగుతున్న వివక్షను ఈటల రాజేందర్ తన ప్రచారంలో ఎండగడుతున్నాడు. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలను రాజకీయ విశ్లేషకులు దిద్దుబాటు చర్యలు గానే భావిస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికతో ప్రభుత్వం కూలిపోదు. కేంద్రంలో అధికారంలోకి వచ్చేది లేదు అని కేటీఆర్ వ్యాఖ్యలు, కేసీఆర్ హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలని ఆ నియోజకవర్గంలో కురిపిస్తున్న నిధుల, పదవుల వరాలతోఈటల నైతిక విజయం సాధించారు అంటున్నారు. 

ఈటల రాజీనామా ఫలితంగా దళితబంధు పథకం అమలు కోసం హుజురాబాద్ కు 2000 కోట్ల కేటాయింపు జరిగింది. ఇందులో 1200 కోట్ల నిధులు విడుదల అయ్యాయి. ఎస్ సీ, బీసీ కార్పొరేషన్ ల చైర్మన్ ల పదవులు హుజురాబాద్ కే దక్కాయి. దళిత బంధు మాక్కూడా కావాలనే డిమాండు మేరకు టైమొస్తే బీసీ బంధు, మైనారిటీ, ఇతర బంధులు కూడా పెడుతామని కేసీఆర్ ప్రకటించారు. హుజురాబాద్ చిన్న ఉప ఎన్నిక అంటూనే.. అక్కడ ఇన్ని చేస్తున్నా.... ఏదో తేడా కొడుతున్నదనే అభిప్రాయం అధికార పార్టీ నేతల మాటలతోనే అర్థం అవుతోంది.

2014 తర్వాత రాష్ట్రంలో అనేక ఉప ఎన్నికలు జరిగాయి. ఏ ఎన్నిక అయినా అలవోకగా గెలిచే అధికార పార్టీ దుబ్బాక ఫలితం తర్వాత జరిగిన అన్నీ ఎన్నికల్లో చమటోడుస్తున్నది. ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నిక అయితే కేసీఆర్ తో సహా అందరినీ కలవరపాటుకు గురిచేస్తోంది. నోటిఫికేషన్ రాక ముందే ప్రభుత్వం, పార్టీలో అనేక పరిణామాలు జరుగుతున్నాయి. ఇక నోటిఫికేషన్ వచ్చాక ఇంకా ఎలా ఉంటుందో అని అంతా అనుకుంటున్నారు.

Labels: ,

Saturday 14 August 2021

పార్టీల బీసీ బాట

 హుజురాబాద్ ఉప ఎన్నికల్లో దళితబంధు పథకం ప్రభావం ఉంటుంది అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఆ జనరల్ స్థానంలో ఇప్పుడు అన్ని పార్టీలు బీసీ పాట పాడుతుండటం గమనార్హం. రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా ఈటల రాజేందర్ ది బీసీ సామాజిక వర్గమే. టీ ఆర్ ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ బీసీనే. ఇంకా అక్కడ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించలేదు. కానీ వాళ్ళు కూడా బీసీ అభ్యర్థి వైపే మొగ్గుచూపుతారని అంచనా. ముఖ్యంగా కొండా సురేఖ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. బహుజనవాదం వినిపిస్తున్న  బీఎస్పీ కూడా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో  తమ అభ్యర్థిని నిలబెట్టే అవకాశం ఉన్నది. ఆ పార్టీ కూడా ఆ నియోజకవర్గంలో 50 శాతానికి పైగా ఉన్న బీసీల కే సీటు కేటాయించవచ్చు.  ఇలా ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నిక దాదాపు అన్ని పార్టీలును బీసీల వైపు మళ్లించింది. 


కేంద్రంలో ఇటీవల మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ జరిగింది. అందులో ఎక్కువ శాతం ఓబీసీ లకే బెర్తులు దక్కాయి. యూపీలో గత ఎన్నికల్లో బీజేపీ ఈ ఓబీసీ ప్రయోగం తోనే మంచి ఫలితాలు సాధించిన విషయం విదితమే. అందుకే ఇప్పుడు రాజకీయ పార్టీలు జనరల్ స్థానాల్లో బీసీ ప్రయోగాలు చేస్తున్నాయి. రాష్ట్రంలో హుజురాబాద్ ఇప్పుడు ఆ ప్రయోగానికి వేదిక అయ్యింది. పార్టీల రాజకీయ అవకాశవాదం ఎలా ఉన్నా బీసీలకు జనరల్ స్థానంలో ప్రాతినిధ్యం లభిస్తున్నది. 


మార్పు ఎక్కడో ఒక దగ్గర మొదలు కావాలె. అది రాష్ట్రంలో హుజురాబాద్ నుంచి ప్రారంభం కావడం మంచి పరిణామం అని బీసీ నాయకులు భావిస్తున్నారు. పార్టీలన్నీ దాదాపు అగ్ర కులాల నాయకత్వంలోనే నడుస్తున్నది వాస్తవమని వారి వాదన. ఒక బలమైన పార్టీ అభ్యర్థి బీసీ కావడంతో మిగిలిన పార్టీలు కూడా బీసీ అభ్యర్థుల వైపే చూసే అనివార్యత ఇప్పుడు హుజురాబాద్ లో ఏర్పడింది. అందుకే అక్కడ అన్ని పార్టీలు బీసీ వాదాన్ని జపిస్తున్నాయి. 


Labels: ,

Friday 13 August 2021

రాష్ట్ర కాంగ్రెస్ దయనీయ స్థితి

వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే అంటున్న కాంగ్రెస్ నేతల మాటలు ఆశ్చర్యంగా, హాస్యాస్పదంగా ఉన్నాయి. రాష్ట్రంలో దుబ్బాక, నాగార్జున సాగర్, జీ హెచ్ ఎం సీ, ఇటీవల జరిగిన రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. రాష్ట్రంలో ఆ పార్టీ నాయకత్వ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కొంత ఉత్సాహం కనిపించిన మాట వాస్తవం. ఇటీవల ఇంద్రవెల్లి సభ కూడా సక్సెస్ అయ్యింది. అయినా ప్రజలు ఆ పార్టీని అధికార పార్టీకి ప్రత్యామ్నాయం అనుకోవడం లేదు. ఎందుకంటే ఎన్నికలను సీరియస్ గా తీసుకోకపోవడం, పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక (సీనియర్లు నిలబడే స్థానాల్లో తప్ప) త్వరగా తేలకపోవడం వంటివి ఆ పార్టీని పట్టి పీడిస్తున్న సమస్యలు.

అంతేకాదు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ దళిత సాధికారికత కోసం తెచ్చిన పథకం దళిత బంధుపై విమర్శలు చేస్తున్నది. వాళ్ళ హయాంలో తెచ్చిన సబ్ ప్లాన్ అమలుపై అధికార పార్టీని నిలదీస్తున్నది. కానీ సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్రమంత్రి  సర్వే సత్యనారాయణ పార్టీ విధానానికి వ్యతిరేకంగా అధికార పార్టీకి అనుకూలంగా ప్రకటనలు చేశారు. ఇది ఒక్క సర్వే తోనే మొదలు కాలేదు. గతంలో జానారెడ్డి లాంటి వాళ్ళు కూడా పార్టీకి ఇబ్బందులు తెచ్చే ప్రకటనలు చేశారు. అలాగే రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడుగా ఎన్నిక కాకముందు ఆయనకు వ్యతిరేకంగా అనేకమంది సీనియర్ నేతలు బహిరంగ విమర్శలు చేశారు. కానీ అధిష్ఠానం ఆయనను ఎంపిక చేసిన తర్వాత కొంత సద్దుమణిగినట్టు అనిపించినా ఇప్పుడు అంతర్గత కలహాలు మళ్లీ కనిపిస్తున్నాయి. కోమటిరెడ్డి వెంకట రెడ్డి వంటి నేతల వ్యవహారశైలినే దీనికి నిదర్శనం. 

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకో రెండున్నర ఏండ్ల సమయమే ఉన్నది. ఇప్పటికి చాలా నియోజకవర్గాల్లో నేతలు ఉన్నా వాళ్ళు ఎప్పుడు ఏ పార్టీలోకి జంప్ అవుతారో తెలియని పరిస్థితి. హుజురాబాద్ ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి అందుకు అద్దం పడుతున్నది. గతంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కౌశిక్ రెడ్డి "కారు" ఎక్కారు. అక్కడ ఉప ఎన్నికల్లో పోటీ చేసే టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ప్రచారంలో ఉన్నారు. కానీ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో ఇప్పటికీ ఖరారు కాలేదు. ప్రచారం మొదలుపెట్టలేదు. వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే అనే పార్టీ ఉప ఎన్నికల్లో పోటీ విషయాన్ని సీరియస్ గా పట్టించుకోవడం లేదని అక్కడి నియోజకవర్గ ప్రజల అభిప్రాయం. ఇలా అయితే పార్టీ నిలబడేది ఎట్లా, అధికారంలోకి వచ్చేది ఎట్లా అని ఆ పార్టీ కార్యకర్తలే అనుకునే స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది.



Labels: ,

Thursday 12 August 2021

అభ్యర్థులు ఖరారు, ఎన్నిక ఎప్పుడు?

 టీఆర్ఎస్ పార్టీకి మొదటి నుంచి ఒక అడ్వాన్టేజ్ ఉన్నది. ఉద్యమం, ఉద్యమకారుల అంశాన్ని ప్రతిపక్షాలు తెరమీదికి తెస్తే ఆ పార్టీకే మేలు చేసినవాళ్ళు అవుతున్నారు. ఎందుకంటే కే సీఆర్ మాది ఫక్తు రాజకీయ పార్టీ అన్నా, సన్నాసుల మఠం కాదు అన్నా అవకాశం వచ్చిన ప్రతీసారి ఉద్యమకారులకు పెద్దపీట వేస్తున్నారు. చట్ట సభల్లో వారిని నిలబెడుతున్నారు. ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నికల్లో విద్యార్థి నాయకుడు, ఉద్యమకారుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు టికెట్ ఇచ్చి ప్రత్యర్థులపై పైచేయి సాధించాడు. 


ఈటల రాజీనామా ఎపీసోడ్, కౌశిక్ రెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ వంటి పరిణామాల తర్వాత ఉద్యమకారులు, ఉద్యమ కారులపై రాళ్లు వేసిన వారికి పదవులు అన్న చర్చ గెల్లు శ్రీనివాస్ ను ఎంపిక చేసి వాటికి ఫుల్ స్టాప్ పెట్టాడు. మంత్రి హరీశ్ రావు కూడా ఇంతకాలం ఉప ఎన్నిక వ్యూహాలను అమలు చేస్తూనే ఉన్నా నియోజకవర్గానికి రాలేదు. ఈటల దమ్ముంటే కేసీఆర్, హరీశ్ లు నాపై పోటీ చేయాలని సవాల్ విసిరిన 24 గంటల్లోనే హుజురాబాద్ లో పార్టీ అభ్యర్థి తో కలిసి ప్రచారం మొదలుపెట్టాడు. పోటీ టీఆర్ ఎస్, బీజేపీ ల మధ్యే అని తేల్చాడు. ప్రధాన పార్టీల  అభ్యర్థులు ఖరారు కావడంతో ఉప పోరు ప్రచారం ఉధృతం కానున్నది. సంక్షేమ పథకాలు, ఉద్యమకారుడు పోటీలో ఉండటం, ఈటల ప్రచారంలో పెట్టిన బీసీ వాదానికి బీసీనే రంగంలోకి దింపడం వంటివి అధికారపార్టీకి కలిసి వచ్చే అంశాలు. 


కాంగ్రెస్ కూడా హుజురాబాద్ నుంచే మార్పు అంటున్నది. ఆ పార్టీ అభ్యర్థి ఎవరూ అన్నది వారం రోజుల్లో తేలుతుంది. ఇప్పటి వరకు అయితే హుజురాబాద్ ఉప ఎన్నిక లో ద్విముఖ పోరే కనిపిస్తున్నది. కేసీఆర్ ఈ ఎన్నిక గురించి పలు సందర్భాల్లో తేలికగా తీసుకున్నట్టు, ఈటల పెద్దోడేమీ కాదన్నట్టు పత్రికలలో వార్తలు వచ్చాయి. అయితే ఈ ఎన్నిక


ను సీరియస్ గానే తీసుకుంటున్నారు. దాని ఫలితమే వివిధ పథకాల ప్రకటన అనే ఆరోపణల్లోనూ వాస్తవాలు ఉన్నాయి. కేసీఆర్ కూడా పథకాలను విమర్శించే వాళ్ళు ఓట్లు అడుగవచ్చు, పథకాలు పెట్టే మేము అడుగవద్దా అని కుండబద్దలు కొట్టారు. సంక్షేమ పథకాలతో కేసీఆర్ ఓట్ల రాజకీయాలు చేస్తున్నారు అని విపక్ష నేతల విమర్శలను పట్టించుకోకుండా తాను అనుకుంటున్న పనులు చేసుకుంటూ పోతున్నారు. 


హుజురాబాద్ ఉపఎన్నికల నోటిఫికేషన్ రాకముందే రాష్ట్ర రాజకీయాలు హీటెక్కాయి. ఈటల రాజేందర్ గెలిస్తే జరిగే రాజకీయ పరిణామాల ఎలా ఉంటాయో కేసీఆర్ గ్రహించారు. అందుకే అలర్ట్ అయ్యారు. పరిస్థితులు ఎలా ఉన్నా ప్రత్యర్థి పార్టీలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నారు. అందుకే అన్నీ అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఎంపిక ఇందులో భాగమే.

కొసమెరుపు: రాష్ట్ర శాసనమండలిలో ఏర్పడిన ఆరు స్థానాలకు జరగాల్సిన ఎన్నికలను కరోనా ఉధృతి కారణంగా వాయిదా వేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జరగాల్సిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో ఏర్పడిన దాదాపు 35 స్థానాలతో పాటు హుజురాబాద్ ఉప ఎన్నిక నిర్వహణపై పార్టీల అభిప్రాయం ఈ నెల 30 లోగా చెప్పాలని అన్ని పార్టీలకు కేంద్రం ఎన్నికల సంఘం లేఖ రాసింది. హుజురాబాద్ లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు అయ్యారు. ఈ నెల 30 వరకు ఈ ఎన్నిక నిర్వాహన పై పార్టీల అభిప్రాయం తర్వాత ఎన్నికల సంఘం నిర్ణయం వెలువడనున్నది. ఆ తర్వాతే ఎన్నిక ఎప్పుడు అనే షెడ్యూల్ విడుదల అవుతుంది. అప్పటి వరకు పార్టీల ఆరోపణలు, ప్రత్యారోపణలతో ప్రచారం కొన..సాగుతూ ఉంటుంది. 

Labels: , , , ,

Tuesday 10 August 2021

మరుగునపడుతున్న ప్రజా సమస్యలు


 రాజకీయాల్లో విమర్శలకు ప్రతి విమర్శలు సహజమే. కానీ రాష్ట్రంలో హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో టీఆర్ఎస్, బీజేపీల నాయకుల మధ్య, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ చేరిక సందర్భంగా జరిగిన సభలో వారి ప్రసంగం, ఇంద్రవెల్లి లో కాంగ్రెస్ సభలో రేవంత్ రెడ్డి అధికార పార్టీ అధినేత పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదం అయి మీడియాలో చర్చనీయాంశాలు అయ్యాయి.

ఎన్నికలకు ఇంకో రెండేండ్ల సమయం ఉన్నది. అప్పుడే పార్టీలు వ్యూహాలు, ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు హుజురాబాద్ ఉప ఎన్నికనే వేదిక అవుతున్నది. అందుకే ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఫల్యాలను ఏకరువు పెడుతున్నాయి. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్నాయి. అధికారపార్టీ నేతలు మీ హయాంలో ఏం చేసారో చెప్పాలని అడుగుతున్నారు. టీవీ చర్చల్లో ఈ అంశాలపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటలతో అసలు విషయాలు పక్కకుపోతున్నాయి. రానున్న రోజుల్లో రాష్ట్రంలో పాదయాత్రలు కూడా మొదలు కానున్నాయి. ఈలోగా హుజురాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ రావొచ్చు. అందుకే 16న హుజురాబాద్ లో ప్రారంభం కావాల్సిన దళిత బంధు పథకం వాసాలమర్రిలోనే ముఖ్యమంత్రి ప్రకటించారు. అందుకు సంబంధించిన నిధులు కూడా విడుదల అయ్యాయి. ముఖ్యమంత్రి హుజురాబాద్ పర్యటనకు ముందే దళిత బంధు పథకం అమలు కోసం కావలసిన నిధులు మంజూరు చేసింది. ఎన్నిక షెడ్యూల్ వస్తే పథకం అమలుకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల చర్యలు చేపట్టింది. 

వచ్చే ఎన్నికల నాటికి ఓటు బ్యాంకు పదిల పరుచుకోవడానికి సంక్షేమ పథకాలతో అధికార పార్టీ రెండు అడుగులు ముందే ఉన్నది. ఈ పథకాలు ఏడేండ్లుగా అమలు చేయలేదని, ఎన్నికల కోసమే మొదలుపెడుతున్నారు అని ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివిధ వర్గాల్లో ఉన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఈ క్రమంలో నాయకులు మధ్య జరుగుతున్న చర్చలు దూషణలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో అదుపు తప్పుతున్నాయి. ప్రజా సమస్యలు మరుగున పడుతున్నాయి.




Labels: ,

Monday 9 August 2021

పథకాలు సరే, కొలువుల సంగతి?

దళిత సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన దళిత బంధు పథకంపై ప్రశంసలు, విమర్శలు వస్తున్నా ముఖ్యమంత్రి అడుగులు ముందుకే వేస్తున్నారు. ముదావహం. సమాజంలోని అన్నివర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా కేసీఆర్ ఆయా పథకాల లక్ష్యం, వీటి ద్వారా వారికి జరిగే రాజకీయ ప్రయోజనాల గురించి ఇప్పటికే కుండబద్దలు కొట్టారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించే కొన్ని విధాన నిర్ణయాల అమలులో ఉన్న వేగం కొలువుల భర్తీ విషయంలో కనిపించడం లేదన్నది నిరుద్యోగుల నుంచి వస్తున్న ప్రశ్న. 

ఒకేసారి పెద్ద మొత్తంలో కొలువుల భర్తీకి నోటిఫికేషన్లు త్వరలో వెలువడనున్నాయి అనే ప్రకటనలు ప్రాధాన్యం కోల్పోయాయి. కారణం దీనికి సంబంధించిన కార్యాచరణ ఏదీ లేదు. అందుకే నోటిఫికేషన్లపై నిరుద్యోగుల్లో అయోమయం నెలకొన్నది. ప్రకటనలతోనే కాలం వెళ్లదీస్తున్న తీరును ప్రతిపక్షాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి దీనిపై సరైన సమాధానం రావడం లేదు. నియామకాలపై ముఖ్యమంత్రి అదేశాలు అమల్లోకి రావడం లేదు. దీనికి బాధ్యత ఎవరిది అని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. 

ప్రభుత్వం వివిధ పథకాల అమలులో చూపిస్తున్న శ్రద్ధ కొలువుల భర్తీలోనూ చూపెట్టాలి అని నిరుద్యోగులు కోరుతున్నారు. నియామకాల విషయంలో ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. ఇచ్చిన మాటను పదే పదే విస్మరిస్తే ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోతుంది. 


ఆ పార్టీలకు ఇక్కడ ఆదరణ ఉంటుందా?

 


ఒక రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం ప‌నిచేసే ప్రాంతీయ పార్టీ మ‌రో రాష్ట్రంలో మ‌నుగ‌డ సాగించ‌లేదు. తెలుగువారి ఆత్మ‌గౌర‌వం పేరు మీద టీడీపీ ఆవిర్భావించింది. ఉమ్మ‌డి రాష్ట్రాన్ని దాదాపు రెండు ద‌శాబ్దాలు పాలించింది. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత మెల్ల‌మెల్ల‌గా ఆ పార్టీ ప్ర‌భావం త‌గ్గిపోయింది. 2014, 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కొన్ని సీట్లు గెలుచుకున్న‌ది. అయితే ఆ పార్టీ మూలాలు ఆంధ్ర‌లో ఉన్నాయి. అందుకే  2014 నుంచి 2019 వ‌ర‌కు ఏపీలో టీడీపీ అధికారంలోకి ఉండ‌టం, చంద్ర‌బాబు తెలంగాణ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు వ్య‌తిరేకంగా ప‌నిచేయ‌డంతో పార్టీ ఇక్క‌డ ఉన్నా ప్ర‌భావాన్నికోల్పోయింది. దాదాపు సీనియ‌ర్ నేత‌లంతా టీఆర్ఎస్‌, కాంగ్రెస్, బీజేపీల‌లో చేరిపోయారు. 


ఇప్పుడు ఆ పార్టీలో కొన‌సాగుతున్ననేత‌లు కొంత‌మంది మాత్ర‌మే. రానున్న రోజుల్లో తెలంగాణ‌లో టీడీపీ త‌న అస్తిత్వాన్ని పూర్తిగా కోల్పోనున్న‌ది.  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారంలో ఉండి, అక్క‌డి ప్ర‌యోజ‌న‌ల కోసం ప‌నిచేస్తూ తెలంగాణ‌లో రాజ‌కీయం చేసినా ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌నే వాస్త‌వాన్ని బ‌హుశా జ‌గ‌న్ పార్టీ గ్ర‌హించి ఉంటుంది. అందుకే  ఒక్క తెలంగాణ‌లోనే కాదు ప‌క్క‌రాష్ట్రాల రాజ‌కీయాల‌లో వేలు పెట్ట‌మ‌ని క‌రాఖండిగా చెప్పారు. వైఎస్ ఆర్ తెలంగాణ‌కు కూడా ఇదే సూత్రం వ‌ర్తిస్తుంది. ఆ పార్టీ అధినేత్రి ష‌ర్మిల కొన్నిరోజులుగా చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు చూస్తే వారి ఆశ‌లు వ‌మ్ము అవుతాయే త‌ప్పా అధికారంలోకి రావ‌డం అన్న‌ది జ‌ర‌గ‌ని ప‌ని. ఎందుకంటే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మ‌ధ్య అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయి. వీటి విష‌యంలో వారు తెలంగాణ వైపే నిల‌బ‌డ‌తామ‌ని స్ప‌ష్టంగా చెప్ప‌డం లేదు. రొటీన్ కామెంట్ల లెక్క రెండు రాష్ట్రాల‌కు అన్యాయం జ‌రుగ‌వ‌ద్ద‌నేదే మా పార్టీ విధానం అని స‌మ‌స్య‌ల‌ను దాట‌వేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇది గ‌తంలో చంద్ర‌బాబు చెప్పిన రెండు కండ్ల సిద్ధాంతం వంటిదే.  ఉమ్మ‌డి పాల‌కుల విధాన నిర్ణ‌యాల వ‌ల్ల‌నే తెలంగాణ ప్రాంతం అన్నిరంగాల్లో అన్యాయానికి, అణిచివేత‌కు గురైంది. అందుకే వారి పాల‌న‌కు వ్య‌తిరేకంగా తెలంగాణ ప్ర‌జ‌లు పోరాడారు. ఉమ్మ‌డి రాష్ట్ర పాల‌కులు అంటే వారి తండ్రి దివంగ‌త వైఎస్ పాల‌న‌ను కూడా తెలంగాణ వ్య‌తిరేకించారు. వారి తండ్రి అధికారంలో ఉన్న‌స‌మ‌యంలోనే ఉద్య‌మాన్ని అణిచివేసే, ఉద్య‌మ‌పార్టీలో చీలిక‌లు తెచ్చే అనేక కుట్ర‌లు చేశారు. ఇదంతా తెలంగాణ ప్ర‌జ‌ల అనుభ‌వంలో ఉన్న‌దే. ఇప్పుడు వైఎస్ కూతురు ష‌ర్మిల రాజ‌న్న రాజ్యం తెస్తామ‌న్న నినాదం తెలంగాణ‌లో ఫ‌లించ‌దు. 


తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం త‌ర్వాత ఉద్య‌మ‌పార్టీనే అధికారంలోకి వ‌చ్చింది. ఉద్య‌మ స‌మ‌యంలో నినాదాల‌ను ఇక్క‌డి పాల‌నా విధానాల్లో చూపెట్ట‌లేదు.  ఇక్క‌డ ఉన్న అన్నిప్రాంతాల ప్ర‌జ‌లు మావాళ్లే అని ప్ర‌క‌టించ‌డ‌మే కాదు భ‌ధ్ర‌త‌, భ‌రోసా క‌లిగించింది. కొంద‌రు ప‌నిగ‌ట్టుకొని ప్ర‌చారం చేసిన భ‌యాందోళ‌న‌ల‌ను తొలిగించింది. అందుకే ఈ ఏడేండ్ల కాలంలో రాష్ట్రంలో అన్నిప్రాంతాల ప్ర‌జ‌ల మ‌ధ్య స‌హృద్భావ వాతావ‌ర‌ణ‌మే ఉన్న‌ది. బాబు హ‌యాంలో సెక్ష‌న్ 8 పేరుతో రెండు రాష్ట్రాల‌ ప్ర‌జ‌ల మ‌ధ్య అపోహ‌లు సృష్టించి, రాజ‌కీల ల‌బ్ధి పొందాల‌నే కుట్ర‌ల‌ను కూడా తెలంగాణ ప్ర‌భుత్వం చేధించింది. 


అయితే తెలంగాణ‌లో ఎవ‌రైనా పార్టీ పెట్ట‌వ‌చ్చు. విస్త‌ర‌ణ కోసం ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు. త‌మ‌కు అవ‌కాశం ఇవ్వ‌మ‌ని ప్ర‌జ‌లను కోర‌వ‌చ్చు. అయితే ఇక్క‌డ ఏ పార్టీ మ‌న‌గ‌డ సాగించాలంటే తెలంగాణ సోయితోనే ప‌నిచేయాలి. తెలంగాణ అభివృద్ధిని ఆకాంక్షించాలి. ద్వంద్వ విధానాలు విడనాడాలి. అప్పుడే తెలంగాణ ప్ర‌జ‌ల విశ్వాసాన్ని పొంద‌గ‌లుగుతారు. ఇవేవీ లేకుండా రాజ‌కీయాలు చేస్తామ‌ని అనుకుంటే వారి ఆశ‌లు అడియాశ‌లే అవుతాయ న్నది చరిత్ర చెప్తున్న సత్యం.

 

Labels: , , , ,

Saturday 7 August 2021

ప్రశంసలను స్వాగతించాలె. విమర్శలను స్వీకరించాలె.

టీఆర్ఎస్ ఉద్యమ నేపథ్యం నుంచి పుట్టి రాజకీయపార్టీగా రూపాంతరం చెందింది. అందుకే ఉద్యమం, ఉద్యమ కారులు, ఉద్యమ ఆకాంక్షలు అన్నవి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిత్యం చర్చలలో ఉంటున్నాయి. అదే కాంగ్రెస్ లేదా బీజేపీ అధికారంలో ఉండి ఉంటే పైన చెప్పిన అంశాలకు ప్రాధాన్యం ఉండేదో లేదో కచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే అవి రెండు జాతీయ పార్టీలు. రాష్ట్ర నాయకత్వానికి ఆయా పార్టీలు ఎంత స్వేచ్ఛను ఇచ్చినా అంతిమ నిర్ణయం మాత్రం ఆ పార్టీల హస్తిన పెద్దలదే అన్నది వాస్తవం. జాతీయ పార్టీల అధినాయకత్వాల మద్దతు లేకుంటే అధికార ఖుర్చీ లో కూర్చొవడం కష్టం అన్నది ఇటీవల వివిధ రాష్ట్రాల్లో జరిగిన నాయకత్వ మార్పులే అందుకు ఉదాహరణ.


ఇదంతా ఎందుకు చర్చించాల్సి వస్తున్నది అంటే ప్రాంతీయ పార్టీలకు స్థానిక సమస్యలే ప్రాధాన్య అంశాలు. కానీ జాతీయపార్టీలకు వీటితో పాటు అనేకం ఉంటాయి. అందుకే ప్రాంతీయ సమస్యలపై వాటి వైఖరి రాజకీయ అవసరాలను బట్టి మారుతుంటాయి. అందుకే బీజేపీ కాంగ్రెస్ ముఖ్త్ భారత్ అన్న నినాదం ఆచరణలో విఫలమైంది. ప్రాంతీయపార్టీలతో బీజేపీ నేరుగా పోటీ పడిన చోట బీహార్, ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ ఒడిశా, కేరళ, తమిళనాడు, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో ప్రాంతీయపార్టీలు బీజేపీకి చెక్ పెట్టాయి. 


ఇక రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం మేమే అని కాంగ్రెస్, బీజేపీలు చెప్పుకుంటున్నాయి. కానీ టీ ఆర్ఎస్ అధినేత వివిధ ఎన్నికల సందర్భంగా అనుసరిస్తున్న వ్యూహాలతోనే వాటి స్థానాలు మారుతున్నాయి. వారి వ్యవహార శైలి నచ్చక పార్టీ వీడుతున్నవారికి రాజకీయ ఆశ్రయాలుగా  మారుతున్నాయి. ఇంకా కొన్ని కొత్త పార్టీలు పురుడుపోసుకోవడానికి కారణం అవుతున్నాయి. రాజకీయ పునరేకీకరణలో భాగంగా టీఆర్ఎస్ అధినేత తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. ఇవి ఒక్క టీఆర్ఎస్ ను మాత్రమే ఎందుకు చుట్టుముడుతున్నాయి? ఉద్యమకాలంలో కలిసి పనిచేసిన వారికి పార్టీలో మొదటి నుంచి ఉన్నవారి కంటే ముందే పదవులు దక్కాయి. కానీ రాజకీయ నేపథ్యం ఉన్నవారు పదవులు ఉన్నంత వరకే మౌనంగా ఉంటున్నారు. పార్టీలో కొనసాగుతున్నారు. పదవీకాలం పూర్తి అయ్యాక ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. సిద్ధాంత వైరుధ్యాలు ఉన్నా విపక్ష పార్టీలలోకి వెళ్ళి పోతున్నారు. ఇదంతా టీఆర్ ఎస్ అధినాయకత్వం వైఫల్యమే. కొందరి అసంతృప్తి అందరి అసంతృప్తి కాకపోవచ్చు. కానీ సుదీర్ఘ కాలం కలిసి నడిచిన వారిని కాదని రాజకీయ అవసరాల కోసం తెచ్చుకున్న వారితో వీసమెత్తు పార్టీకి ప్రయోజనం కలుగకపోగా కొన్ని నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. విపక్ష పార్టీలకు అవే ఆయుధాలు అవుతున్నాయి. పార్టీని నమ్ముకుని, పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేస్తున్న వారిని పట్టించుకోకుండా ఎన్ని పథకాలు తెచ్చినా కొన్నిసార్లు ప్రతికూల ఫలితాలే వస్తాయి. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాలని కోరుకునే వారు కూడా ప్రభుత్వాన్ని  ప్రశ్నించడానికి కారణం కొన్ని నిర్ణయాలే. 


ప్రశంసలను స్వాగతించాలె. విమర్శలను స్వీకరించాలె.తెలంగాణ ఉద్యమం నేర్పిన పాఠాలు ఇవే.

Labels: , , , , ,

Thursday 5 August 2021

జోహార్ జయశంకర్ సార్

జీవితమంతా ఉద్యమమే ఊపిరిగా బతికారు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్. నాటి ఫజల్ అలీ కమిషన్ మొదలు మొన్నటి శ్రీకృష్ణ కమిటీ వరకు తెలంగాణ పై వేసిన అన్నీ కమిటీల ముందు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను శాస్త్రీయంగా వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అన్నది సార్ కల. ఆ కల సాకారం కోసం తన జీవితకామంతా కృషి చేశారు. 

ఉమ్మడి రాష్ట్రంలో ఆయా ప్రభుత్వాలు రాష్ట్రంలో వివిధ రంగాల్లో సాధించిన అభివృద్ధి పై అధికారిక నివేదికలు విడుదల చేసేవారు. అందులో పేర్కొన్న లెక్కల ఆధారంగా నే తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని, ఈ ప్రాంతం పై వారు చూపిన వివక్షను ఏకరువు పెట్టేవారు. అందుకే సార్ అంటే అందరికీ అభిమానం. 

రాష్ట్ర సాధన అంశాన్ని ఎవరు ఎత్తుకున్నా సార్  తెలంగాణ కు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని వారికి అందించారు. దశాబ్దాల పాటు తెలంగాణ ఉద్యమం అనేక ఆటుపోట్ల గురైంది. అయినా ఆ ఉద్యమ జ్వాల ఆరిపోకుండా కాపాడినవారు జయశంకర్ సార్. మలి దశ తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న సందర్భంలో కొన్ని స్వార్థ శక్తులు ఇరు ప్రాంతాల ప్రజల్లో వైషమ్యాలు సృష్టించాలని చూశాయి. అలాంటి కుట్రలను సార్ బద్దలు కొట్టారు. ప్రాంతాలుగా విడిపోదాం, ప్రజలుగా కలిసి ఉందాం అనే సందేశాన్ని సార్ అందించారు. ఉద్యమానికి దశను, దిశ ను చూపెట్టారు.

తెలంగాణ సిద్ధాంత కర్తగా రాష్ట్ర ఏర్పాటు కోసం సార్ చేసిన కృషి సువర్ణాక్షరాలతో లిఖించగలది. రాష్ట్ర సాధన కోసం అన్ని రాజకీయ పార్టీల నేతలతో కలిసి పనిచేసినా తన స్వేచ్ఛను కోల్పోలేదు. ఉద్యమ సమయంలో తెలంగాణ వస్తే ఏమస్తుందో సారు చెప్పిన మాటలు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆవిష్కృతం అవుతున్నాయి. నీళ్ళు, నిధుల గురించి సార్ చెప్పిన సత్యాలు నేడు నిజం అవుతున్నాయి. సార్ చెప్పినట్టే గోదావరి, కృష్ణ నదుల్లో మన వాటాను హక్కుగా వినియోగించుకుంటున్నాం. నిధులు ఇక్కడి అభివృద్ధికి ఖర్చు చేసుకుంటున్నాం.

తెలంగాణ కు జరిగిన అన్యాయం వల్ల నాలుగు తరాలు నష్టపోయాయి. కాబట్టి యువత త్యాగాలు చేయవద్దు. త్యాగాలు మేము చేస్తాం. మీరు రేపటి రాష్ట్ర ఫలాలు అందుకోవాలి అన్నారు. నియామకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలి. అప్పుడే నీళ్లు, నిధులు, నియామకాలు అన్న ట్యాగ్ లైన్ లక్ష్యం నెరవేరుతుంది. సార్ కల సంపూర్ణం కావాల్సి ఉన్నది. ఇందుకోసం సార్ ఆశయాలను నెరవేర్చాల్సిన బాధ్యత నాటి ఉద్యమ పార్టీ అయిన నేటి అధికార పార్టీపై ఉన్నది.

(సార్ జయంతి నేడు. జోహార్ ఆచార్య కొత్త పల్లి జయశంకర్ సార్)


-రాజు

Labels: ,

ఆశావహులకు అశనిపాతమే

 

తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన 2026 తర్వాత చేపడుతామని కేంద్ర హోం శాఖ మంగళవారం ఎంపీ రేవంత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో సమాధానం ఇచ్చింది. ఈ ప్రకటన రాజకీయ ఆశావహుల ఆశలపై నీళ్లు చల్లింది.  నిజానికి విభజన చట్టంలోని సెక్షన్ 15తో సంబంధం లేకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్ 170లోని నిబంధనల ప్రకారం తెలంగాణ అసెంబ్లీ స్థానాలను 119 నుంచి 153కు, ఏపీ 175 నుంచి 225కు పెంచాలని విభజన చట్టంలోని సెక్షన్ 26 (1) స్పష్టం చేస్తున్నది.  కానీ రాజ్యాగంలోని ఆర్టికల్ 179 (3) అనుసరించి 2026 తర్వాత ప్రచురించే జనాభా లెక్కల అనంతరమే రెండు రాష్ర్టాల్లో అసెంబ్లీ సీట్ల సర్దుబాటు జరుగుతుందని కేంద్ర మంత్రి తెలిపారు. అయితే దీనిపై కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నేత వినోద్‌లు స్పందించారు. జమ్మూ-కశ్మీర్‌కు ఒక న్యాయం, తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు ఒక న్యాయం అన్నట్టు కేంద్రం వ్యవహరిస్తున్నదని విమర్శించారు. రాజ్యాంగమే ప్రామాణికం, జమ్మూ-కశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన చేస్తే ఇక్కడ కూడా చేయాలని డిమాండు చేశారు.  ప్రతి పదేండ్లకు ఒకసారి జనాభాల లెక్కల సేకరణ జరుగుతుంది. 2021 తర్వాత మళ్లా 2031లోనే జనగణన జరుగుతుంది. కేంద్రం చెప్పినట్టు 2026 తర్వాత అంటే 2031లో చేపట్టే జనగణన వివరాలు ప్రచురించిన తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టనున్నట్టు స్పష్టమౌతున్నది. గత అనుభవాల దృష్ట్యా 2039 ఎన్నికల నాటికి మాత్రమే కొత్త నియోజకవర్గాలు అందుబాటులోకి రావచ్చని రాజకీయవర్గాల అంచనా.

 అయితే కేంద్రం ప్రకటించిన తాజా నిర్ణయం రాజకీయ ఆశావహులకు అశనిపాతమే. ముఖ్యంగా తెలంగాణలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అధికార టీఆర్‌ఎస్‌కు ఈ నిర్ణయంతో ఇబ్బందే. ఎందుకంటే ఉద్యమపార్టీగా పేరొందిన టీఆర్‌ఎస్‌ను ప్రజలు రెండుసార్లు ఆదరించారు. పధ్నాలుగేండ్ల సుదీర్ఘ కాల పోరాటంలో ఆ పార్టీలో పనిచేస్తున్న వారి జాబితా పెద్దదే. అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి కొంతమందికి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఇట్లా  అవకాశం ఇచ్చుకుంటూ వస్తున్నారు. చట్టసభల్లో పోటీచేసే అవకాశం లేనివారికి కార్పొరేషన్ పదవులు లేదా ఇతర పదవులు కట్టబెట్టారు. దీనికితోడు రాజకీయ పునరేకీకరణలో భాగంగా ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన వారి సంఖ్య కూడా గణనీయంగానే ఉన్నది. ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరు కొన్నినియోజకవర్గాల్లో అయితే ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు. నియోవజర్గాల పునర్విభజన జరిగితే వీళ్లను సర్దుబాటు చేయవచ్చు అని ఇంతకాలం భావిస్తూ వస్తున్నారు. కానీ తాజాగా కేంద్ర హోం శాఖ ఇచ్చిన సమాధానం అధికారపార్టీకి మింగుడు పడని అంశమే. విభజన చట్టంలో ఇచ్చిన హామీని అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నా వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి అది అమల్లోకి వచ్చేది. కానీ ఇప్పట్లో లేదు కేంద్రం స్పష్టతను ఇచ్చింది. అలాగే రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు రోజురోజుకూ మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు రాష్ట్రంలో పాగా వేయడానికి ప్రణాళికలు వేసుకుంటూ  ముందుకు పోతున్నాయి. వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా ప్రతిపక్ష పార్టీలు కార్యాచరణతో ముందుకుపోతున్నాయి. 

నియోజకవర్గాల పునర్విభజన లేదు అని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో అధికారపార్టీ నుంచి ఇతర పార్టీలకు వలసలు పెరిగే అవకాశం ఉన్నది. హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారనున్నాయి. అట్లనే ఏపీలో కూడా ఏ ఎన్నిక జరిగినా వైసీపీ, టీడీపీ మధ్యనే ఉన్నది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షపార్టీలను ఐక్యం చేసే పనిలో ఉన్నది. బీజేపీ కూడా దక్షిణాది రాష్ర్టాల్లో తమ బలం పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నది. ఏపీ, తెలంగాణ రాష్ర్టాల్లోనూ కొన్ని ఎంపీ సీట్లు గెలుచుకునేందుకు ఇప్పటి నుంచే పథకాలు రూపొందించుకుంటున్నాయి. కాబట్టి నియోజకవర్గాల పునర్విభజన అంశం ప్రతిపక్ష పార్టీల్లో చేరికలకు ద్వారాలు తెరిచిందనేది రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

-రాజు

Labels: , ,

హాకీ ఆటగాళ్ళూ హాట్సాప్

ఒలింపిక్స్ జరుగుతున్న ప్రతీసారి పతకాల పట్టికలో భారత్ స్థానం సంపాదించేవరకు ఉత్కంఠే. మన అథెట్లు కొన్ని పతకాలు సాధించి దేశం పేరు నిలబెట్టగానే ఊపిరి పీల్చుకున్న సందర్భాలు అనేకం. కానీ ఈసారి ఆ టెన్షన్ లేదు. 

మీరాబాయి సాయికోమ్ చాను క్రీడలు ప్రారంభమైన రెండో రోజే వెండి పతకాన్ని సాధించింది. వెయిట్ లిఫ్టర్‌గా 2016 ఒలింపిక్స్‌లో ఎదుర్కొన్న పరాభవం నుంచే మీరాబాయి చాను పాఠాలు నేర్చుకున్నది. ఫీనిక్ష్ పక్షి వలె పునరుజ్జీవం పొంది టోక్యోలో మెరిసింది. కట్టెల మోతతో మొదలైన ఆమె విజయ ప్రస్థానం వెనుక ఎన్నో ఉత్థానపతనాలున్నాయి. అస్సాంకు చెందిన బాక్సర్ లవ్లీనా కాంస్య పతకాన్ని సాధించింది. అయితే తన తొలి ఒలింపిక్స్‌లోనే పతకంతో తన పవర్‌ను ప్రపంచానికి చాటింది. భారత షట్లర్ పి.వి. సింధు రియోలో రజతం, టోక్యో కాంస్యం ఒలింపిక్స్‌లలో పతకాలు సాధించింది.  వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది. 


2011 ఏప్రిల్ 2న వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కెప్టెన్ ధోనీ సిక్సర్ కొట్టినప్పుడు 120 కోట్ల భారతీయులు భావోద్వేగానికి లోనయ్యారు. 1983 తర్వాత భారత క్రికెట్ జట్టు ప్రపంచకప్‌ను ముద్దాడింది. ధోనీసేన విశ్వవిజేతగా నిలిచింది. ఆ భావోద్వేగమే 41 ఏండ్ల తర్వాత ఒలింపిక్స్‌లో జర్మనీపై గెలిచి భారత్ కాంస్య పతకాన్ని సాధించినప్పుడు కలిగింది. మన దేశ జాతీయ క్రీడ హాకీ. కానీ క్రికెట్ మానియాలో చాలా క్రీడలు ఒలింపిక్స్, ఆసియా క్రీడల వంటి సమయాల్లోనే పతాక శీర్షికల్లో కనిపిస్తాయి. అందుకే జర్మనీతో గెలిచిన తర్వాత  భారత్‌లో ప్రజలు హాకీని మర్చిపోయారు. నిజానికి వారు హాకీని ప్రేమిస్తారు. కానీ మేము గెలుస్తామని నమ్మడం మానేశారు. కానీ మేము ఈరోజు గెలిచాం. భవిష్యత్తులో వారు మా నుంచి మరింత ఆశిస్తారు, మమ్మల్ని నమ్ముతారు డ్రాగ్ ఫ్లికర్ రూపిందర్ పాల్ అన్న మాటలు అక్షరాల నిజం.


బెల్జియంతో పోరు అన్నప్పుడే మన హాకీ ఆటగాళ్లు ఏదో ఒక పతకాన్ని పట్టుకొస్తారనే నమ్మకం కలిగింది. బెల్జియంపై ఓడిపోయినా మనోైస్థెర్యం కోల్పోలేదు. రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతాక విజేత. 1980 తర్వాత భారత్ ఒలింపిక్స్‌లో పతక పోరులో తలపడిన సందర్భం లేదు. కానీ కోట్లాది మంది భారతీయుల కల నెరవేర్చాలనే తపన, కసి ఉన్నాయి. ఉత్కంఠను అధిగమించింది. హాకీకి పునర్ వైభవమే లక్ష్యంగా ఆటగాళ్లు పోరాడారు. ఇదే 41 ఏండ్ల తర్వాత భారత్‌కు పతకాన్ని అందించింది. అందుకే పసిడి పతకాన్ని తలదన్నేలా ఈ పోరు జరిగిందని క్రీడా విశ్లేషకులు వ్యాఖ్యానించారు. 


అలాగే టోక్యో ఒలింపిక్స్‌లో ఈసారి మన ఆటగాళ్ల ప్రదర్శన గతంలో కంటే మెరుగ్గా ఉన్నది. రైతు బిడ్డ రవి కుమార్ దహియా అద్భుత పోరాటంతో రెజ్లింగ్ 57 కిలోల విభాగంలో రజతం సాధించాడు. హరియాణలోని సోనెపత్‌కు సమీపంలోని నాహ్రి రవి కుమార్ దహియా స్వగ్రామం. ఏ మాత్రం వసతులు లేని కుగ్రామం నుంచి వచ్చిన ఈ మల్ల యోధుడు పసిడి పతకమే లక్ష్యంగా పోరాడి రజతంతో మెరవడం విశేషం. 


ప్రపంచంలో మన కంటే చిన్నదేశాలు ఒలింపిక్స్‌లో అద్భుతమైన ప్రదర్శనను చూపెడుతున్నాయి. మనం కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఆటగాళ్లను తీర్చిదిద్దాలి. ఈసారి పతకాలు సాధించిన వారి నేపథ్యం చూస్తే దేశంలోని మారుమూల కుగ్రామాల నుంచి ఎన్నో కష్టాల కడలిని దాటి ఇక్కడిదాకా వచ్చారు. దేశ ప్రతిష్ఠను నిలబెట్టారు. గ్రామీణ ప్రాంతాలలో ఇలాంటి మట్టిమాణిక్యాలు ఇంకా ఎందరో ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టిగా కృషి చేసి అలాంటి వారిని గుర్తించాలి. వారికి అన్నిరకాల మౌలిక సదుపాయాలు కల్పించాలి. సరైన శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దితే  రానున్నరోజుల్లో మన దేశం నుంచి మరింత మంచి అత్యుత్తమ ఆటగాళ్లు తయారవుతారు. 

-రాజు


Monday 2 August 2021

ఉప ఎన్నిక, ఉద్యమకారులు


హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి ఎవరూ అన్నది వారం, పది రోజుల్లోగా అధికారికంగా వెల్లడి కానున్నది. ఈటల రాజేందర్ రాజీనామా తర్వాత హుజురాబాద్ లో రాజకీయ వాతావరణం హీటెక్కింది. ఈటల బీజేపీ లో చేరిన తర్వాత ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం మండలాల వారీగా ఇంచార్జి లను ప్రకటించి ప్రచారం మొదలుపెట్టింది. కాంగ్రెస్ నుంచి కౌశిక్ రెడ్డి పోటీ చేస్తారు అని అందరూ అనుకుంటుండగానే ఈ నెల రోజుల్లో అనేక రాజకీయ పరిణామాలు జరిగాయి.
చివరికి కౌశిక్ టీ ఆర్ ఎస్ కండువా కప్పుకోవడం, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ గా రాష్ట్ర క్యాబినెట్ ఆయనను నామినేట్ చేయడం వంటి నిర్ణయాలు చక చకా జరిగిపోయాయి. అలాగే అధికార పార్టీ ఆహ్వానం మేరకు తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ, ఈటల చేరిక తర్వాత బీజేపీలో అంతర్గతంగా జరిగిన పరిణామాలతో మాజీమంత్రి పెద్దిరెడ్డి ఇంకా కొంతమంది ఆ పార్టీని వీడి టీఆర్ఎస్ చేరారు.

దళిత బంధు పథకం, హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యం ప్రతిపక్ష పార్టీలలో భిన్నస్వరాలకు వేదిక అయ్యాయి. కొన్నిరోజులుగా చర్చలో ఉన్న ఉప ఎన్నికల్లో అధికార పార్టీ ఎవరన్నది కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తున్నది. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఎన్నికల సందర్భంలో ఉద్యమం, ఉద్యమకారులు అనే ప్రశ్నలు పౌర సమాజం నుంచి వస్తున్నాయి. ఎందుకంటే టీఆర్ఎస్ మాత్రమే చాలామంది ఉద్యమకారులను గుర్తించింది. వారి సేవలు రాష్ట్ర పునర్ నిర్మాణంలో వినియోగించుకుంటున్నది.

ఉద్యమ సమయంలో ఉద్యమానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్ర బిందువుగా నిలిచింది. అందుకే దుబ్బాక, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల సమయంలో పెద్దగా ప్రధాన అంశం కాలేదు. కాని హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఉద్యమకారుల విషయం ఇప్పుడు ప్రధానం అయ్యింది. బీసీ సామాజిక సమీకరణలు వంటివే కాకుండా ఈటల రాజేందర్ కు ఉద్యమ నేపథ్యం ఉండటంతో అధికార పార్టీ కూడా అలాంటి అభ్యర్థి వైపే చూసేలా చేసింది. ఈ కోణంలోనే ఉద్యమకారుడు, బీసీ అయిన టీఆర్ ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ అభ్యర్థి అయితేనే గెలుపు అవకాశాలు ఉంటాయి అనే అభిప్రాయం అధికార పార్టీలో ఉన్నది. సంక్షేమ పథకాలకు తోడు ఉద్యమకారుడు వర్సెస్ ఉద్యమకారుడు అనేవి తమకు లాభిస్తాయి అనే ఆలోచనలో టీఆర్ ఎస్ అధినాయకత్వం ఉన్నదని అర్థం అవుతున్నది. గెల్లు అభ్యర్థిత్వం అధికారికంగా ప్రకటించడమే మిగిలింది ఇక. ఆ తర్వాత హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకోనున్నది.

- ఆసరి రాజు

Labels: , , , ,

ప్రకటనలకే పరిమితం

 కొన్ని నెలలుగా కొలువుల ముచ్చట ప్రకటనలకే పరిమితం అయ్యింది. జూలై 13, 14 తేదీల్లో జరిగిన క్యాబినెట్ భేటీల్లో 50 వేల కొలువుల భర్తీ కి ఆమోదముద్ర పడుతుంది అని నిరుద్యోగులు ఆశించారు. కానీ వారి ఆశలు అడియశలే అయ్యాయి. అధికారులు అందించిన ఖాళీల వివరాలు అసంపూర్తిగా ఉన్నాయి అని పూర్తి వివరాలతో రావాలని క్యాబినెట్ ఆదేశించింది. ఆ తర్వాత మరో ఐదు రోజులకు క్యాబినెట్ మీట్ ఉంటుంది అని వార్తలు వచ్చాయి. తిరిగి 17 రోజుల తర్వాత ఆగస్టు 1న క్యాబినెట్ భేటీ జరిగింది. నిన్న కూడా కొత్త నియామకాలకు గ్రీన్ సిగ్నల్ వస్తుంది అనుకున్నారు.  కానీ నిన్న కూడా నిరుద్యోగులకు నిరాశే ఎదురైంది. జూలై 9న 50 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన కూడా వెలువడింది. జూలై నెలలో దాదాపు కొలువుల ముచ్చటే నడిచింది. ఖాళీల వివరాలు అసమగ్రం, వాటిపై అధ్యయనం అనేవి ఉత్త ముచ్చట్లే.ఎందుకంటే ఒక్కరోజులో సమగ్ర కుటుంబ సర్వే చేసి రికార్డు సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వివరాలు లేవంటే నమ్మశక్యంగా లేదు. దాదాపు ఏడు నెలలుగా నియామకాల అంశంపై ప్రభుత్వం అనేక ప్రకటనలు చేసింది. కాబట్టి ఖాళీల సమగ్ర వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. కానీ వాటిని భర్తీ చేయాలనే సంకల్పమే లేదు.


Labels: ,