Sunday, 6 July 2025

నాడు మద్రాస్‌, నేడు హైదరాబాద్‌






తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్న సమయం. ఎడిట్‌ పేజీలో పరాంకుశం వేణుగోపాల స్వామి, నేను, జ్యోతింధ్రనాథ్‌ ఉండేవాళ్లం. వేణు సార్‌, నేను తెలంగాణ జ్యోతింధ్రనాథ్‌ గారు ఆంధ్ర. కాబట్టి సహజంగానే ఆయన విభజనను వ్యతిరేకిస్తారు. అయితే ఆయన చాలా ప్రోగ్రెసివ్‌. విభజనను గుడ్డిగా వ్యతిరేకిస్తూ బాధకృష్ణ లాంటి వాళ్ల వాదనను వినిపించేవారు కాదు. తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వినిపించేవారు. అయితే విభజన అనివార్యమైతే తర్వాత జరగబోయే పరిణామాలపై ఆయనకు కొంత బాధ ఉండేది. ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టిశ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఆయన దీక్షకు అప్పటి నెహ్రూ ప్రభుత్వం స్పందించింది. దీక్ష విరమించాలని కోరింది. కానీ మద్రాస్‌తో కూడిన ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ను కొంతమంది ముందుకు తెచ్చి శ్రీరాములు దీక్ష కొనసాగించేలా చేశారు. ఫలితంగా ఏ రాష్ట్ర సాధన కోసం దీక్ష చేశారో ఆయన అది చూడకుండానే కన్నుమూశారు. 


తెలంగాణ ఉద్యమ సమయంలోనూ కేసీఆర్ పదే పదే ఒక మాట చెప్పేవారు. మా పోరాటం తెలంగాణ వనరులను దోచుకునేవారిపై, ఇక్కడ పెత్తనం చేసే వారిపై మాత్రమేనని పొట్టగూటి కోసం హైదరాబాద్‌కు వచ్చే వారిపై కాదన్నారు. ఉద్యమ సమయంలో ఉద్రేకపూరిత పూరిత ప్రసంగాలు చేసినా రాష్ట్ర ఆవిర్భావం అనంతరం పాలకుడిగా తన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తించారు. ఏ ప్రాంత ప్రజలపై వివక్ష చూపెట్టలేదు. అందుకే విభజనను అప్పుడు, ఇప్పుడు వ్యతిరేకించే ఉండవల్లి అరుణ్‌కుమార్‌ కూడా కేసీఆర్‌ పాలన విధానాన్ని ప్రశంసించారు. ఆంధ్ర వాళ్ల కాలి ముల్లు గుచ్చుకుంటే తన పంటితో తీస్తానన్న కేసీఆర్‌ మా వారి మనసు దోచారు. అంతేకాదు తన హయాంలో ఎక్కడా మత ఘర్షణలు, శాంతిభద్రత సమస్యలు తలెత్తకుండా చూశారు. 


తెలంగాణ ఉద్యమం సాగింది నీళ్లు, నిధులు, నియామకాల్లో ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయం మాత్రమే కాదు. ఆత్మగౌరవ కోసం కూడా. అందుకే అధికారంలో లేకున్నా ఆత్మగౌరవం కోసం, అస్తిత్వం కోసం తెలంగాణ ప్రజల పక్షాన నిలబడేది బీఆర్‌ఎస్‌ మాత్రమేనని గడిచిన 18 నెలల కాంగ్రెస్‌ పాలనలో రేవంత్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను చూస్తే అర్థమౌతుంది. ఇదందా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే అప్పుడు జ్యోతింధ్రనాథ్‌ ఒక మాట అన్నారు. విభజన జరిగితే అప్పుడు మద్రాస్‌ కోల్పోయాం. ఆ తర్వాత కర్నూల్‌ పోయింది. ఇప్పుడు హైదరాబాద్‌ మాకు కాకుండా పోతున్నదని ఆవేదన చెందారు. దీనికి స్వామిగారు ఫన్నీగా ఒక కామెంట్‌ చేశారు. అప్పుడు మద్రాస్‌, ఆ తర్వాత కర్నూల్‌, ఇప్పుడు హైదరాబాద్‌. రేపు ఇగ మిగిలేది బంగాళఖాతమే అన్నారు. ఆయన ఉద్దేశం ఏమిటంటే తెలంగాణపై కేసీఆర్‌కు ఉన్న ప్రేమ ఏపీపై ఆ ప్రాంత నాయకులకు లేదని. ఎందుకంటే మాట్లాడితే ఆంధ్రులు అని గొప్పలు చెప్పుకోవడమే గాని ఆరు దశాబ్దాల కాలంలో వారికంటూ ఒక రాజధాని నగరం అంటూ ఏదీ నిర్మించుకోలేకపోయారు. చంద్రబాబు మొదటి ఐదేళ్లు తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టడమే తప్ప శాశ్వత సెక్రటేరియట్‌ కట్టలేదు. ఆ తర్వాత జగన్‌ ఐదేళ్లు పాలించినా ఆయన సంక్షేమపై దృష్టి సారించారు. అలాగే అమరావతి పేరుతో గత ప్రభుత్వం చేసిన భూదందాను వెలికి తీశారు. అక్కడ పెట్టే పెట్టుబడి, నిర్మాణాలు వృథా అవుతాయని నిపుణుల సూచన ఆధారంగా అమరావతిలో ఎలాంటి పనులు చేపట్టలేదు. విశాఖ ను రాజధాని కేంద్రంగా చేయాలని, రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని, గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేయాలని అనుకున్నారు. దీనికే మూడు రాజధానులు అని పేరు పెట్టారు. 


అయితే ఈ అంశాన్ని చంద్రబాబు సామాజిక వర్గం అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించి జగన్‌కు వ్యతిరకంగా ప్రచారం చేసింది. దీనికితోడు ఉచితలు అభివృద్ధికి ఆటంకం అనే మోడీ కూడా చంద్రబాబు ఇచ్చిన అలవిగాని హామీలకు గ్యారెంటీ ఇవ్వకుండా ఆయనతో జట్టు కట్టింది. ఇప్పుడు ఆయన చెప్పిన సూపర్‌ సిక్స్‌ గురించి బాధకృష్ణ గాని, బాబు ఏం చేసినా బాకాలు ఊదే మీడియా చర్చ చేయదు. కానీ చంద్రబాబు ఏదో అద్భుతం చేయబోతున్నారని నిత్యం ప్రజలను ఏ మార్చే కథనాలు  వండివారుస్తుంటాయి. దీనివల్ల తెలంగాణ ప్రజలకు వచ్చిన నష్టమేమీ లేదు. కానీ ఆంధ్రులకు ఒక రాజధాని ఉండాలనే కల మాత్రం ఎన్నటికీ నెరవేరదు. దీనికి కారణం ఆచరణలో సాధ్యం కాని కోరికలు కొంతమంది పాలకులకు, మీడియా ప్రతినిధులకు, కొంతమంది పెట్టుబడి దారులకు ఉండటమే. నాడు మద్రాస్‌పై మమకారాన్ని వదులుకోలేదు. విభజన జరిగి 11ఏండ్లు అయినా హైదరాబాద్‌పై ఆశలు వదులుకోవడం లేదు. హైదరాబాద్‌ కేంద్రంగానే చంద్రబాబు అండ్‌ కో, బాధకృష్ణ లాంటి వాళ్లు చేస్తున్న కుట్రల ఫలితంగా అమరావతి రాజధాని పత్రికల్లో, ప్రచారంలో ఉంటుంది. కానీ ఎన్నటికీ అక్కడి ప్రజలకు అందుబాటులోకి రాదు.

No comments:

Post a Comment

Featured post

అస్సాం అసెంబ్లీ పోరు: కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష

ప్రియాంక గాంధీ ముందున్న సవాళ్లు ఇవే డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కిం...