మహిళల వన్డే ప్రపంచ కప్ సెమీస్లో ఆసీస్పై భారత ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్ సంచలన ఇన్నింగ్స్ ఆడింది. భారీ లక్ష్య ఛేదనలో జెమీమా కీలక పాత్ర పోషించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ (89) ఔటైనా సరే.. చివరివరకూ క్రీజ్లో ఉండి మ్యాచ్ను గెలిపించింది. దీంతో మైదానంలోనే కన్నీళ్లు పెట్టుకున్న జెమీమా వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. ఇక డ్రెస్సింగ్ రూమ్లోనూ జెమీమా చేసిన వ్యాఖ్యలు ఆకట్టుకున్నాయి. ఒక దశలో తాను బ్యాటింగ్ చేయడం కూడా కష్టంగా మారిందని.. ఆ సమయంలో సహచర బ్యాటర్ దీప్తి శర్మను మాట్లాడిస్తూనే ఉండమని చెప్పినట్లు జెమీమా గుర్తు చేసుకుంది.‘‘నేను 85 పరుగుల వ్యక్తిగత స్కోరుతో ఉన్నప్పుడు అప్పటికే చాలా అలసిపోయా. దీంతో దీప్తిశర్మకు ఒకటే చెప్పా. ‘ప్లీజ్ దీపు.. నాతో మాట్లాడుతూనే ఉండు. లేకపోతే నేను స్కోర్ చేయలేను’ అని అడిగా. అక్కడినుంచి ప్రతి బంతికి దీప్తి వచ్చి నాతో మాట్లాడేది. నన్ను ఉత్సాహపరిచేది. నా పరుగు కోసం తన వికెట్ను కూడా త్యాగం చేసింది. పెవిలియన్కు వెళ్తూ కూడా ‘ఏం కంగారు వద్దు. నువ్వు మ్యాచ్ను ఫినిష్ చేయాలి’ అని చెప్పింది. ఇలాంటి పార్టనర్షిప్లు లేకపోతే భారీ లక్ష్యాన్ని ఛేదించడం చాలా కష్టం. దీప్తి, రిచా, అమన్ ఆఖర్లో ఆడిన ఇన్నింగ్స్ కూడా చాలా కీలకం. హర్మన్తో కలిసి గొప్ప భాగస్వామ్యం నిర్మించడం బాగుంది. గతంలో వికెట్లు పడిపోయే కొద్దీ మ్యాచ్ను చేజార్చుకొనేవాళ్లం. ఇప్పుడు టీమ్ఇండియా మారిపోయిందని నిరూపించాం’’ అని జెమీమా వ్యాఖ్యానించింది.
మన బాధ్యత పూర్తి కాలేదు..
‘‘ఆస్ట్రేలియాపై సెమీస్లో విజయం సాధించాం. అయితే, ఇక్కడితో మన పని పూర్తి కాలేదు. మరో మ్యాచ్లో విజృంభించాలి. అప్పుడే సగర్వంగా టైటిల్ను అందుకోగలం. అప్పటివరకు మనం విశ్రమించకూడదు’’ అని జెమీమా వెల్లడించింది. ఆదివారం జరిగే మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాతో టీమ్ఇండియా తలపడనుంది.





