- పుతిన్తో భేటీకి సిద్ధమవుతున్న వేళ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ఇంకా ఫలించలేదు. ఇప్పటికే పలుమార్లు ఇరు దేశాధినేతలతో ఆయన మాట్లాడినా కాల్పుల విరమణ ఒప్పందం కుదరలేదు. ఈ నేపథ్యంలో, తాజాగా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యాను ఉక్రెయిన్ ఓడించగలదని తాను నమ్మినప్పటికీ, ప్రస్తుతం అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదని ఆయన అన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో త్వరలో భేటీ కానున్న సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
వైట్హౌస్లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్, "వారికి (ఉక్రెయిన్ను ఉద్దేశిస్తూ) గెలిచే అవకాశం ఉంది. కానీ, వారు గెలుస్తారని నేను అనుకోవడం లేదు" అని అన్నారు. యుద్ధం అనేది చాలా అనూహ్యమైన విషయమని, అందులో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని ఆయన పేర్కొన్నారు. యుద్ధాన్ని ముగించేలా ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఆ డీల్ జరిగితే చాలా మంచిదని, లేదంటే ప్రజలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. రాబోయే కొద్ది వారాల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్తో బుడాపెస్ట్లో ముఖాముఖీ భేటీ అయ్యేందుకు ట్రంప్ ప్రణాళికలు రచిస్తున్నారు.
దొనెట్స్క్ అంశంపై స్పష్టత
ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ.. ట్రంప్తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో దొనెట్స్క్ ప్రాంతం చర్చకు వచ్చినట్లు కొన్ని కథనాలు వచ్చాయి. పుతిన్ డిమాండ్ చేస్తున్నట్లు దొనెట్స్క్ ప్రాంతాన్ని రష్యాకు అప్పగించాలని ట్రంప్, జెలెన్స్కీకి సూచించినట్లు ఆ కథనాల సారాంశం. అయితే, ట్రంప్ ఈ వార్తలను తాజాగా ఖండించారు. తమ భేటీలో దొనెట్స్క్ అంశం చర్చకు రాలేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా, అమెరికా అందిస్తున్న ఆయుధాలకు కీవ్ (ఉక్రెయిన్) చెల్లింపులు చేస్తోందని ఆయన వెల్లడించారు.

No comments:
Post a Comment