Tuesday, 28 October 2025

కాకినాడకు 150 కి.మీ దూరంలో మొంథా తీవ్ర తుపాను


  •  రాత్రికి తీరం దాటనుంది



పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తీవ్ర తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం ఈ తుపాను విశాఖపట్నం నుంచి దక్షిణాన 250 కి.మీ, కాకినాడ నుంచి ఆగ్నేయంగా 150 కి.మీ, మచిలీపట్నం నుంచి దక్షిణ ఆగ్నేయంగా 70 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. గత 6 గంటల్లో గంటకు 15 కి.మీ వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. తీరం దాటే సమయంలో గంటకు 90–110 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీయనున్నాయి. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఉభయ గోదావరి జిల్లాల్లో గాలుల తీవ్రత పెరిగింది. కాకినాడ, యానం తీరాల్లో సముద్ర కెరటాలు ఎగసిపడుతున్నాయి. ఈ ప్రాంతాలకు ఉప్పెన ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యానంలో కనకలపేట, గెస్ట్‌హౌస్, పాత కోర్టు భవనం, ఎస్‌ఆర్‌కే కళాశాల వద్ద చెట్లు నేలకూలాయి. సహాయ సిబ్బంది వాటిని తొలగిస్తున్నారు. అగ్నిమాపక, విద్యుత్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి.


పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు

మొంథా తుపాను కాకినాడ తీరం వైపు దూసుకొస్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆకస్మిక వరద (ఫ్లాష్ ఫ్లడ్) హెచ్చరికలు జారీ చేసింది. రేపు ఉదయం వరకు గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలతోపాటు తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం; ఒడిశాలో గజపతి, గంజాం జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ సంభవించే అవకాశం ఉంది.తాజా సమాచారం ప్రకారం, తుపాను విశాఖకు దక్షిణంగా 280 కి.మీ, కాకినాడకు ఆగ్నేయంగా 190 కి.మీ, మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 110 కి.మీ దూరంలో ఉంది. గత 6 గంటల్లో 15 కి.మీ వేగంతో కదులుతూ కాకినాడ సమీపంలో తీరం దాటనుంది.


చీరాల వాడరేవు తీరం రాకాసి అలల దెబ్బకు కోత




 బాపట్ల జిల్లా చీరాల వాడరేవు తీరంలో తుపాను ప్రభావంతో రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి. అలల ఉధృతికి తీరంలో కొంత భాగం కోతకు గురైంది. ముందు జాగ్రత్తగా బీచ్‌లను మూసివేశారు. పర్యాటకులను నిన్నటి నుంచే అనుమతించడం లేదు. వాడరేవు, రామాపురం, కటారివారిపాలెం, మోటుపల్లి, చినగంజం తీరాల్లో నిశ్శబ్దం అలుముకుంది.తీరం దాటినప్పుడు గంటన్నర పాటు తీవ్ర ప్రభావంవిశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథకుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పలుచోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కర్నూలు, అనంతపురం, సత్యసాయి, చిత్తూరు జిల్లాల్లోనూ వర్షాలు పడతాయని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మత్స్యకారులు మూడు రోజుల పాటు సముద్రంలోకి వెళ్లొద్దని సూచించారు.కాకినాడలో 10వ నంబరు, విశాఖ-గంగవరంలో 9వ నంబరు, మచిలీపట్నం-కృష్ణపట్నం-నిజాంపట్నంలో 8వ నంబరు ప్రమాద సంకేతాలు ఎగురవేశారు. ఈ సాయంత్రం నుంచి రాత్రి లోగా తుపాను తీరం తాకనుందని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాకినాడకు 190 కి.మీ దూరంలో ఉన్న తుపాను తీరం దాటినప్పుడు గంటన్నర పాటు తీవ్ర ప్రభావం ఉంటుందని, ఎప్పటికప్పుడు బులిటెన్లు జారీ చేస్తామని తెలిపారు.


No comments:

Post a Comment

Featured post

అస్సాం అసెంబ్లీ పోరు: కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష

ప్రియాంక గాంధీ ముందున్న సవాళ్లు ఇవే డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కిం...