Tuesday, 14 October 2025

రిజర్వేషన్లు బీసీల హక్కు, దయాదాక్షిణ్యం కాదు: కోదండరాం




హైదరాబాద్: బీసీ రిజర్వేషన్లు బీసీల హక్కని, ఇవి దయాదాక్షిణ్యాలతో ఇచ్చేవి కావని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం స్పష్టం చేశారు. సమానత్వం ఆధారంగా నూతన సమాజ నిర్మాణానికి రిజర్వేషన్లు ఉద్దేశించినవని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, రిజర్వేషన్ల సాధన కోసం ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు నేతృత్వంలో ఒక సబ్-కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కమిటీ ఇతర సంఘాలతో కలిసి పనిచేస్తుందన్నారు.  “కొన్ని రాజకీయ పార్టీలు రిజర్వేషన్ల విషయంలో ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయి. కేసులు వేసిన వ్యక్తులకు మద్దతు ఇస్తూనే, బీసీలకు అన్యాయం జరిగిందని ప్రచారం చేస్తున్నాయి. తెజస్‌కు ఇలాంటి రెండు నాలుకల వైఖరి లేదు. 42% బీసీ రిజర్వేషన్లకు మేం పూర్తి మద్దతు ఇస్తాం. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బీసీ బిల్లును ఆమోదించేలా చేయడమే మా పోరాట లక్ష్యం” అని కోదండరాం వెల్లడించారు.  తెజస్ ఉపాధ్యక్షుడు పీఎల్ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ, బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ర్యాలీలు, సమావేశాలు, ధర్నాలు నిర్వహిస్తామని, సుప్రీంకోర్టులో న్యాయపరంగా పోరాటం చేస్తామని తెలిపారు. అక్టోబర్ 16న గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పిస్తామన్నారు. ఈ సందర్భంగా తెజస్ బీసీ రిజర్వేషన్లపై పలు తీర్మానాలు చేసింది. అక్టోబర్ 18న బీసీ సంఘాలు నిర్వహించే బంద్‌కు పూర్తి మద్దతు ప్రకటించింది.  బీసీ రిజర్వేషన్లపై కోర్టు స్టే ఇవ్వడం న్యాయం కాదని ఎంపీ, బీసీ రిజర్వేషన్ల సాధన సమితి కన్వీనర్ ఆర్. కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. స్టే ఇవ్వడం ద్వారా బీసీల నోటికాడ ముద్దను లాక్కున్నారని, బీసీల వాదన వినకుండా కోర్టు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. 

No comments:

Post a Comment

Featured post

అస్సాం అసెంబ్లీ పోరు: కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష

ప్రియాంక గాంధీ ముందున్న సవాళ్లు ఇవే డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కిం...