Tuesday, 28 October 2025

తీరం దాటిన ‘మొంథా’ తుపాను




  • గంటకు 100 కి.మీ. వేగంతో గాలులు


బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర ‘మొంథా’ తుపాను ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ సమీపంలో తీరం దాటే ప్రక్రియను ప్రారంభించిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం రాత్రి తెలిపింది. థాయ్ భాషలో‘మొంథా’ అంటే సువాసన గల పువ్వు అని అర్థం.ఈ తుపాను ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ.. తరువాతి 3-4 గంటల్లో మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ చుట్టుపక్కల ప్రాంతంలో గంటకు 90-100 కి.మీ. గరిష్ట స్థిరమైన గాలుల వేగంతో (110 కి.మీ.కు పెరిగే అవకాశం) తీవ్ర తుపానుగా ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటిందని ఐఎండీ తన తాజా ప్రకటనలో తెలిపింది.


తుపాను ప్రభావం, హెచ్చరికలు


‘మొంథా’ తుపాను ప్రభావంతో కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, తెలంగాణ, దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఒడిశాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాకినాడ, కృష్ణా, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, డాక్టర్‌ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలలో, అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు, రంపచోడవరం డివిజన్లలో తుపాను ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఈ తుపాను రాష్ట్రంలోని 22 జిల్లాల్లోని 403 మండలాలపై ప్రభావం చూపవచ్చు. ఐఎండీ హెచ్చరికల ప్రకారం.. ఈ తుఫాను వలన లోతట్టు, నీట మునిగిన ప్రాంతాలలో ఉన్న వరి,  కూరగాయల పంటలకు నష్టం కలిగే అవకాశం ఉంది. రైతులు తమ పొలాల నుంచి అదనపు నీటిని వీలైనంత వరకు బయటకు పంపాలని సూచించారు.


ప్రభుత్వ చర్యలు, సంసిద్ధతలు


తుపాను తీవ్రత దృష్ట్యా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన పేర్కొన్న ఏడు జిల్లాలలో మంగళవారం రాత్రి 8.30 నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించింది. ప్రజల భద్రత కోసం వాతావరణ బులెటిన్‌లను తెలుసుకోవాలని, ప్రభుత్వం జారీ చేసే సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. అత్యవసర సమాచార వ్యవస్థ నిరంతరాయంగా కొనసాగించడానికి, 81 వైర్‌లెస్ టవర్లు, 21 పెద్ద దీపాలను (లాంప్‌లను) ఏర్పాటు చేశారు. విరిగిపడిన చెట్లను తొలగించడానికి 1,447 ఎర్త్‌మూవర్‌లు, 321 డ్రోన్‌లు,  1,040 చైన్‌సాలు సిద్ధంగా ఉంచారు. ముందుజాగ్రత్త చర్యలలో భాగంగా.. రాష్ట్రవ్యాప్తంగా 3.6 కోట్ల మందికి హెచ్చరిక మెస్సేజ్‌లు పంపించారు.


వర్షపాత వివరాలు

ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య, నెల్లూరు జిల్లాలోని ఉలవపాడులో అత్యధికంగా 12.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత కావలి (12.2 సెం.మీ.), దగ్గదర్తి (12 సెం.మీ.), సింగరాయకొండ (10.5 సెం.మీ.), బి. కోడూరు (6 సెం.మీ.), విశాఖపట్నం, తునిలో (2 సెం.మీ. చొప్పున) వర్షపాతం నమోదైంది. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు నిర్వహించిన సమీక్షా సమావేశంలో, ఇప్పటివరకు నెల్లూరు జిల్లాలోనే అత్యధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు  తెలియజేశారు.

No comments:

Post a Comment

Featured post

అస్సాం అసెంబ్లీ పోరు: కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష

ప్రియాంక గాంధీ ముందున్న సవాళ్లు ఇవే డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కిం...