టోక్యో:జపాన్ తొలి మహిళా ప్రధానమంత్రిగా అతివాద నేతగా పేరున్న సనై టకైచి ఎన్నికయ్యారు. జపాన్ పార్లమెంట్ మంగళవారం దేశ చరిత్రలోనే తొలి మహిళా ప్రధానిగా సనై టకైచిని ఎన్నుకుంది. పార్టీలో అంతర్గత విభేదాల నేపథ్యంలో జపాన్ ప్రధానిగా ఉన్న షిగెరు ఇషిబా ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్డీపీ) అధ్యక్షురాలిగా సనై టకైచి విజయం సాధించారు.
ఇటీవల దేశంలో జరిగిన ఎన్నికల్లో పార్లమెంటు ఎగువ సభలో అధికార పార్టీ మెజార్టీని సాధించలేకపోయింది. దీనికి ముందు దిగువ సభలో కూడా మెజార్టీ కోల్పోయింది. దీంతో ఇషిబాపై ఒత్తిడి పెరగడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో శనివారం పార్టీలో అధ్యక్ష ఎన్నికలు జరగ్గా.. మాజీ ప్రధాని కుమారుడు షింజిరో కొయిజుమితో పాటు మరో ముగ్గురు అభ్యర్థులను ఓడించి టకైచి విజయం సాధించారు.
నేడు పార్లమెంట్లో జరిగిన ఓటింగ్లో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ- జపాన్ ఇన్నోవేషన్ పార్టీ కూటమితో టకైచికి భారీ మద్దతు లభించింది. దీంతో జపాన్కు తొలి మహిళా ప్రధానిగా టకైచి అరుదైన ఘనత సాధించారు. 64 ఏళ్ల టకైచి 1993లో తన స్వస్థలమైన నారా నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఎల్డీపీలో ఆర్థిక భద్రత, అంతర్గత వ్యవహారాలు, లింగ సమానత్వ మంత్రితో సహా పలు కీలక పదవుల్లో పనిచేశారు.
శుభాకాంక్షలు తెలిపిన మోడీ
జపాన్ తొలి మహిళా ప్రధానిగా ఎన్నికైన సనై టకైచికి భారత ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. భారత్-జపాన్ దేశాల మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి టకైచితో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సుల విషయంలో ఇరుదేశాల బంధాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు.
No comments:
Post a Comment