- ఎన్నికల వేళ అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు
ముంబై: బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతున్న వేళ, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఓట్ల కోసం మతపరమైన అంశాలను వాడుకోవడం లేదా రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని ఆయన స్పష్టం చేశారు. తాను మొదటి నుంచీ లౌకికవాద ఆలోచనా దృక్పథం (Secular Mindset) కలిగిన వ్యక్తినని, మతాల మధ్య చిచ్చు పెట్టే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఎన్నికల సమయంలో కొందరు నాయకులు చేసే వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందిస్తూ, అభివృద్ధి ఎజెండాతోనే ముందుకు వెళ్లాలని, సమాజంలో విద్వేషాలు నింపే ధోరణి ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయన హితవు పలికారు.
ముంబై ఎన్నికల బరిలో మహాయుతి కూటమిలో భాగంగా ఉన్నప్పటికీ, తమ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటామని అజిత్ పవార్ పునరుద్ఘాటించారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉండవచ్చు కానీ అవి హుందాతనాన్ని దాటకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా సున్నితమైన అంశాలను ప్రచారంలోకి తీసుకురావడం వల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, అటువంటి ప్రయత్నాలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ప్రగతిశీల మహారాష్ట్రలో అందరూ కలిసికట్టుగా ఉండాలన్నదే తన ఆకాంక్షని, ఓట్ల వేటలో నైతికతను వదులుకోకూడదని అజిత్ పవార్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి.
No comments:
Post a Comment