- ఢిల్లీలో కామన్వెల్త్ దేశాల స్పీకర్ల భారీ సదస్సు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ పార్లమెంటరీ చరిత్రలో మరో కీలక ఘట్టానికి భారత్ వేదిక కానుంది. 28వ కామన్వెల్త్ దేశాల స్పీకర్లు ,ప్రిసైడింగ్ ఆఫీసర్ల సదస్సు (CSPOC) బుధవారం నుండి దేశ రాజధాని ఢిల్లీలో ప్రారంభం కానుంది. జనవరి 14 నుండి 16 వరకు మూడు రోజుల పాటు జరగనున్న ఈ ప్రతిష్టాత్మక సదస్సులో 60కి పైగా కామన్వెల్త్ దేశాలు మరియు స్వయంప్రతిపత్తి కలిగిన పార్లమెంట్ల నుండి స్పీకర్లు, సభాధ్యక్షులు పాల్గొననున్నారు. ఈ మేరకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా న్యూఢిల్లీలో వివరాలను వెల్లడించారు. సదస్సులో భాగంగా తొలిరోజున కార్యనిర్వాహక మండలి (Executive Council) సమావేశం జరగనుంది.
జనవరి 15న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సదస్సును అధికారికంగా ప్రారంభించి కీలకోపన్యాసం చేస్తారు. ఈ సదస్సులో ఆధునిక ప్రజాస్వామ్య సవాళ్లపై లోతైన చర్చలు జరగనున్నాయి. ముఖ్యంగా పార్లమెంటరీ కార్యకలాపాల్లో 'కృత్రిమ మేధ' (Artificial Intelligence) వినియోగం, సభ్యుల మధ్య ఉత్తమ పద్ధతులు , వినూత్న ఆలోచనల మార్పిడి, సోషల్ మీడియా ప్రభావం వంటి అంశాలపై ప్రత్యేక సెషన్లు ఉంటాయి. అలాగే పార్లమెంటు పట్ల ప్రజల్లో అవగాహన పెంచడం, ఎంపీల భద్రత, ఆరోగ్యం వంటి సామాజిక అంశాలపై కూడా ప్రతినిధులు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.
భారతదేశ ప్రజాస్వామ్య ప్రయాణంలో ఈ సదస్సు ఒక గర్వకారణమైన మైలురాయిగా నిలవనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్య దేశాల ప్రతినిధులు ఒకే చోట చేరి చర్చించడం వల్ల అంతర్జాతీయ సంబంధాలు మరింత బలపడతాయని భావిస్తున్నారు. భారత్ ఈ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వడం ఇది నాలుగోసారి కావడం విశేషం. అత్యాధునిక సాంకేతికతను పార్లమెంటరీ వ్యవస్థలో ఎలా భాగం చేయాలనే దానిపై భారత్ సాధించిన ప్రగతిని ఈ వేదిక ద్వారా ప్రపంచానికి చాటిచెప్పనున్నారు.
No comments:
Post a Comment