- ఆ దేశాలపై 25 శాతం సుంకం విధిస్తూ ట్రంప్ సంచలన నిర్ణయం
వాషింగ్టన్: ఇరాన్తో వాణిజ్య సంబంధాలను కొనసాగించే దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక యుద్ధం ప్రకటించారు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్తో వ్యాపారం చేసే ఏ దేశమైనా, అమెరికాతో జరిపే మొత్తం వాణిజ్యంపై 25 శాతం టారిఫ్ (సుంకం) చెల్లించాల్సి ఉంటుందని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ను ఆర్థికంగా ఏకాకిని చేసే వ్యూహంలో భాగంగా ట్రంప్ ఈ కఠినమైన చర్యకు పూనుకున్నారు. మరోవైపు, ఇరాన్ విషయంలో సైనికచర్యతో సహా అన్నిమార్గాలు తెరిచే ఉన్నాయని వైట్ హౌస్ ప్రకటించినప్పటికీ, దౌత్యానికే తమ మొదటి ప్రాధాన్యమని స్పష్టం చేసింది.
అమెరికా ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇరాన్ నుంచి అందుతున్న దౌత్యపరమైన సంకేతాలను పరిశీలించడానికి ట్రంప్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇరాన్ బహిరంగంగా చేసే ప్రకటనలకు, ప్రైవేటుగా అమెరికాకు అందుతున్న సమాచారానికి మధ్య వ్యత్యాసం ఉందని ఆమె పేర్కొన్నారు. అవసరమని భావిస్తే సైనికశక్తిని ఉపయోగించడానికి ట్రంప్ వెనుకాడబోరని ఆమె హెచ్చరించారు. ఇదే క్రమంలో, వెనెజువెలా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడోతో గురువారం ట్రంప్ భేటీ కానున్నట్లు లీవిట్ ధృవీకరించారు.
ఈ పరిణామాలపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. తమ దేశంపై ఎలాంటి దాడి జరిగినా ధీటుగా సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయ్ హెచ్చరించారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు విదేశీ జోక్యం ద్వారా తమ దేశంలో అశాంతిని రేకెత్తిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం ఇరాన్లో పెరిగిన ద్రవ్యోల్బణం, ఆర్థిక కష్టాలు , ప్రభుత్వ పాలనపై ఆగ్రహంతో పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ అల్లర్లలో ఇప్పటివరకు 600 మందికి పైగా మరణించారని, 10 వేల మందికి పైగా అరెస్టయ్యారని అమెరికాకు చెందిన ఒక మానవహక్కుల సంస్థ వెల్లడించింది.
No comments:
Post a Comment