- ఓంకార నాదంతో మార్మోగిన క్షేత్రం
గాంధీనగర్: 'సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ 2026' వేడుకల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ శనివారం సాయంత్రం గుజరాత్లోని పవిత్ర సోమనాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన జ్యోతిర్లింగ స్వరూపుడైన సోమనాథుడికి అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, 'అభిషేకం' నిర్వహించారు. ఆలయ గర్భాలయంలో అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో ప్రధాని చురుగ్గా పాల్గొన్నారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, శ్రీ సోమనాథ్ ట్రస్ట్ సభ్యులు కూడా ఉన్నారు.
పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సామూహిక 'ఓంకార మంత్ర' పఠనంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. వేలాదిమంది భక్తులు, పండితులు ఏకధాటిగా చేసిన ఓంకార నాదంతో ఆలయ పరిసరాలన్నీ ఆధ్యాత్మిక శోభతో మార్మోగిపోయాయి. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి సంబంధించిన ప్రస్తుత పనులను ప్రధాని సమీక్షించారు. ముఖ్యంగా యాత్రికుల సౌకర్యార్థం నిర్మించిన నూతన వసతులను ఆయన పరిశీలించారు. ఆధ్యాత్మికతతో పాటు ఆధునిక మౌలిక సదుపాయాలను జోడించి సోమనాథ్ క్షేత్రాన్ని అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
రాత్రి వేళ ఆలయ గోపురంపై ప్రదర్శించిన ప్రత్యేక లేజర్ షో, విద్యుత్ అలంకరణలను ప్రధాని ఆసక్తిగా తిలకించారు. 'సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్' ఒక పండుగ మాత్రమే కాదని, ఇది భారతీయ సంస్కృతి, ఆత్మగౌరవానికి ప్రతీక అని ఆయన ఈ సందర్భంగా అభివర్ణించారు. రేపు కూడా ప్రధాని సోమనాథ్లోనే ఉండి మరికొన్ని అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ప్రధాని రాకతో సోమనాథ్ పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. భద్రతా అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు
No comments:
Post a Comment