- హామీల వర్షం కురిపిస్తున్న అగ్రనేతలు
ముంబై: మహారాష్ట్రలోని 29 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నగారా మోగడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. జనవరి 15న జరగబోయే పోలింగ్ కోసం ప్రధాన పార్టీల అగ్రనేతలందరూ క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే పింప్రి-చించ్వాడ్లో నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొని ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఫడ్నవీస్ మాట్లాడుతూ.. నగరంలో మెట్రో నెట్వర్క్ను మరింత విస్తరిస్తామని, రవాణా సౌకర్యాలను అంతర్జాతీయస్థాయికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.
పుణె నగరంలో రాజకీయ సమీకరణలు ఆసక్తికరంగా మారాయి. ఎన్సీపీలోని రెండు వర్గాలైన శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాలు కలిసి ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేశాయి. ఇందులో పౌరులందరికీ ఉచిత మెట్రో, బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. మరోవైపు, శివసేన (యూబీటీ), మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) కూటమి కూడా తమ మేనిఫెస్టోను ప్రకటించింది. వృద్ధులకు ఉచిత మందులు, మహిళలకు ఉచిత ప్రయాణం, పుణెను నేరరహిత నగరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నాయి.
ముంబైలోని ధారవి పునరాభివృద్ధి ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ధారవి వాసులందరికీ అదే ప్రాంతంలో గృహవసతి కల్పిస్తామని, ఎస్ఆర్ఏ (SRA) భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వమే ఈ ప్రాజెక్టును అమలు చేస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే కొల్హాపూర్, నాసిక్ ప్రాంతాల్లో పర్యటిస్తూ.. చారిత్రక కట్టడాల పరిరక్షణతో పాటు స్మార్ట్ సిటీల అభివృద్ధికి తమను గెలిపించాలని కోరారు. అహిల్యానగర్, సాంగ్లీ జిల్లాల్లో కూడా పార్టీల రోడ్షోలు, ర్యాలీలతో ఎన్నికల వాతావరణం పీక్ స్టేజ్కు చేరుకుంది.
No comments:
Post a Comment