Wednesday, 14 January 2026

కాశీ-తమిళ సంగమం: భారతీయ సంస్కృతుల అపూర్వ కలయిక


  • వైవిధ్యాన్ని గౌరవిస్తూనే ఐక్యతను చాటే వేదికగా ప్రధాని మోడీ అభివర్ణన!

న్యూఢిల్లీ: భారతదేశంలోని విభిన్న సంప్రదాయాల సజీవ ఐక్యతకు ‘కాశీ-తమిళ సంగమం’ ఒక నిలువుటద్దమని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. వివిధ జాతీయ దినపత్రికలలో ప్రచురితమైన తన ప్రత్యేక వ్యాసంలో ప్రధాని ఈ కార్యక్రమం విశిష్టతను వివరించారు. అనాది కాలం నుంచి కాశీ నగరం భారత నాగరికతకు ఒక బలమైన పునాదిగా ఉందని, జ్ఞానం, మోక్షం కోసం ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తుంటారని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి మహత్తరమైన సంగమానికి ఆతిథ్యం ఇవ్వడానికి కాశీ కంటే మించిన పవిత్రమైన ప్రదేశం మరొకటి లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా తమిళ ప్రజలతో, వారి సంస్కృతితో కాశీకి అత్యంత లోతైన, పురాతనమైన అనుబంధం ఉందని ప్రధాని గుర్తుచేశారు. కాశీలో బాబా విశ్వనాథుడు కొలువై ఉంటే, తమిళనాడులో రామేశ్వరుడు వెలసి ఉన్నారని, ఇది రెండు ప్రాంతాల మధ్య ఉన్న ఆధ్యాత్మిక బంధాన్ని చాటుతుందని ఆయన అన్నారు.



అంతకుముందు, ఢిల్లీలోని కేంద్ర మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ నివాసంలో జరిగిన పొంగల్ వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొంగల్ వంటి పంట పండుగలు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తిని మరింత బలోపేతం చేస్తాయని ఉద్ఘాటించారు. పొంగల్ పండుగ తమిళుల శక్తివంతమైన సంస్కృతిని, ప్రకృతితో మానవాళికి ఉన్న విడదీయలేని బంధాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన ప్రశంసించారు. దేశంలోని విభిన్న సంప్రదాయాలను, వాటి ప్రత్యేకతలను గౌరవిస్తూనే.. దేశం మొత్తాన్ని ఒకే తాటిపైకి తీసుకురావడంలో ఇటువంటి సాంస్కృతిక ఉత్సవాలు కీలక పాత్ర పోషిస్తాయని ప్రధాని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment

Featured post

తొలి బిడ్డను ఆహ్వానించడానికి ముందే ఒక తేదీని అనుకున్నాం

  పాత ఇంటర్వ్యూలో సమంత చేసిన వ్యాఖ్యలు వైరల్ మా ఇంటి బంగారం" విజయంతో పాటు గర్భధారణ వార్తలతో హెడ్‌లైన్స్‌ లో నిలిచిన స్టార్ హీరోయిన్ దర్...