- ట్రంప్ హెచ్చరికలపై విరుచుకుపడ్డ ఇరాన్
- హార్ముజ్ జలసంధిపై కొనసాగుతున్న ఉత్కంఠ
హార్ముజ్ జలసంధి వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. జలసంధిని వాణిజ్య నౌకల కోసం తెరిచినట్లు ఇరాన్ ప్రకటించిన కొద్దిసేపటికే, తమతో ఒప్పందం కుదిరే వరకు నౌకాదళ దిగ్బంధం కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఒకవేళ చర్చలు సఫలం కాకపోతే మళ్ళీ బాంబుల వర్షం కురిపిస్తామని ఆయన చేసిన హెచ్చరికలపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బగేర్ గాలిబాఫ్ ఘాటుగా స్పందించారు. ట్రంప్ కేవలం ఒక గంట వ్యవధిలోనే ఏడు అసత్య ప్రకటనలు చేశారని, సోషల్ మీడియా పోస్టులు జలసంధి భవిష్యత్తును నిర్ణయించలేవని ఆయన ఎద్దేవా చేశారు. అమెరికా తన దిగ్బంధనాన్ని కొనసాగిస్తే, హార్ముజ్ జలసంధిని మూసివేస్తామని, ఇరాన్ అనుమతితోనే నౌకల రాకపోకలు సాగుతాయని గాలిబాఫ్ హెచ్చరించారు.
ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియంను (న్యూక్లియర్ డస్ట్) భారీ యంత్రాలతో వెలికితీసి అమెరికాకు తరలిస్తామన్న ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. తమ యురేనియం నిల్వలను ఏ దేశానికీ తరలించే ప్రసక్తే లేదని, చర్చల్లో అసలు అటువంటి ప్రతిపాదనే రాలేదని టెహ్రాన్ స్పష్టం చేసింది. యుద్ధంలో అబద్ధాలతో గెలవలేకపోయిన అమెరికా, ఇప్పుడు చర్చల్లో కూడా అవే తప్పుడు ప్రచారాలతో లబ్ధి పొందాలని చూస్తోందని ఇరాన్ మండిపడింది. హార్ముజ్ జలసంధి ద్వారా ప్రపంచ చమురు సరఫరాలో ఐదో వంతు జరుగుతున్న నేపథ్యంలో, దీనిని ఇరాన్ ఒక 'అణు నిరోధక ఆయుధం'లా వాడుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు, ఇరాన్ జలసంధిని తెరిచినట్లు ప్రకటించినా, అంతర్జాతీయ వాణిజ్య నౌకలు అక్కడ ప్రయాణించేందుకు ఇంకా వెనుకాడుగు వేస్తున్నాయి. స్పష్టమైన భద్రతా హామీలు లభించే వరకు కార్యకలాపాలు పునఃప్రారంభించడం కష్టమని షిప్పింగ్ సంస్థలు భావిస్తున్నాయి. ఒకవైపు చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ చెబుతున్నా, మరోవైపు బాంబు దాడులు చేస్తామన్న ఆయన బెదిరింపులు గల్ఫ్ ప్రాంతంలో ఆందోళనను పెంచుతున్నాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఈ దౌత్యపరమైన ఉద్రిక్తతలు ప్రపంచ చమురు ధరలపై , అంతర్జాతీయ భద్రతపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.
No comments:
Post a Comment