Tuesday, 21 April 2026

సమయం నా శత్రువు కాదు


  • ఇరాన్ యుద్ధ విమర్శకులపై ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు
  •  అణు ఒప్పందంపై వెనక్కి తగ్గేదే లేదని స్పష్టీకరణ

పశ్చిమ ఆసియాలో ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన విమర్శకులపై విరుచుకుపడ్డారు. ఇస్లామాబాద్‌లో జరగాల్సిన శాంతి చర్చల భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొన్న తరుణంలో, ఒప్పందం కోసం తనపై ఎటువంటి ఒత్తిడి లేదని ఆయన స్పష్టం చేశారు. తన 'ట్రూత్ సోషల్' ప్లాట్‌ఫామ్ వేదికగా వరుస పోస్ట్‌లు చేసిన ట్రంప్, ఇరాన్ యుద్ధంలో అమెరికా భారీ విజయం దిశగా సాగుతోందని ధీమా వ్యక్తం చేశారు. గత 47 ఏళ్లుగా ఇతర అధ్యక్షులు ప్రదర్శించని ధైర్యం, ముందుచూపుతో తాము ఇరాన్ సృష్టించిన గందరగోళాన్ని చక్కదిద్దుతున్నామని, ఈ విషయంలో సమయం తనకు శత్రువు కాదని ఆయన పేర్కొన్నారు.



ముఖ్యంగా ఇరాన్‌పై దాడి చేయమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తనను ఒప్పించారనే వార్తలను ట్రంప్ తీవ్రంగా ఖండించారు. అక్టోబర్ 7 నాటి పరిణామాలు, ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదనే తన జీవితకాల దృఢ నిశ్చయమే ఈ యుద్ధానికి కారణమని ఆయన వివరించారు. ఇరాన్  కొత్త నాయకత్వం తెలివిగా వ్యవహరిస్తే ఆ దేశానికి గొప్ప భవిష్యత్తు ఉంటుందని, అయితే అక్కడ పాలనా మార్పు  జరగాలనే సంకేతాలను ఆయన ఇచ్చారు. ఇరాన్ విషయంలో తమ ఫలితాలు అద్భుతంగా ఉండబోతున్నాయని ఆయన ఈ సందర్భంగా జోస్యం చెప్పారు.


గతంలో బరాక్ ఒబామా, జో బైడెన్ హయాంలో కుదిరిన అణు ఒప్పందం దేశ భద్రతకే ముప్పుగా మారిందని, అది అణ్వాయుధాల తయారీకి రహదారిలా ఉండేదని ట్రంప్ విమర్శించారు. తాము ఇప్పుడు చేయబోయే ఒప్పందం గత ఒప్పందం కంటే ఎంతో మెరుగ్గా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఒకవేళ తాను పాత ఒప్పందాన్ని రద్దు చేయకపోయి ఉంటే, ఇప్పటికే ఇజ్రాయెల్, మధ్యప్రాచ్యంలోని అమెరికా సైనిక స్థావరాలపై అణ్వాయుధ దాడులు జరిగి ఉండేవని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజా శాంతి చర్చలు ఎలా సాగినా, అమెరికా ప్రయోజనాలే పరమావధిగా అడుగులు వేస్తామని ట్రంప్ స్పష్టం చేశారు.

No comments:

Post a Comment

Featured post

కేసీఆర్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట

జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక చెల్లదు  కాళేశ్వరం విచారణలో కీలక మలుపు హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు ...