- ఇరాన్ గడువు పొడిగింపుతో భారత్కు కలిగే ప్రయోజనాలేంటి?
- మధ్యవర్తిగా పాకిస్థాన్ వ్యూహమిదే!
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: పశ్చిమ ఆసియాలో యుద్ధ జ్వాలలు ఇప్పుడప్పుడే చల్లారేలా కనిపించకపోయినా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ గడువును పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయం ప్రపంచ దేశాలకు, ముఖ్యంగా భారత్, పాకిస్తాన్లకు పెద్ద ఊరటనిచ్చింది. ఇరాన్పై దాడులు తాత్కాలికంగా ఆగిపోవడం వల్ల కేవలం యుద్ధం వాయిదా పడటమే కాకుండా, దక్షిణాసియా దేశాల ఆర్థిక,భౌగోళిక రాజకీయ ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ గడువు పొడిగింపు వెనుక పాకిస్తాన్ కీలక మధ్యవర్తిగా వ్యవహరిస్తుండగా, భారత్ తన వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుకునే పనిలో పడింది.
భారత్కు చాబహార్ ఓడరేవు కీలకం
ఇరాన్తో యుద్ధం తీవ్రమైతే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయం, ఇది భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ట్రంప్ నిర్ణయంతో ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉండటం భారత్కు కలిగే అతిపెద్ద ప్రయోజనం. అంతేకాకుండా, ఇరాన్లోని చాబహార్ ఓడరేవు భారత్కు వ్యూహాత్మకంగా ఎంతో కీలకం. మధ్య ఆసియా దేశాలకు వాణిజ్య మార్గంగా ఉన్న ఈ రేవును కాపాడుకోవడానికి, అక్కడ ఉన్న భారతీయ పెట్టుబడులకు ప్రమాదం కలగకుండా ఉండటానికి ఈ శాంతి గడువు ఎంతో అవసరం. ఇరాన్ చుట్టూ ఉద్రిక్తతలు తగ్గితేనే భారత్ తన వాణిజ్య లక్ష్యాలను సురక్షితంగా చేరుకోగలదు.
మధ్యవర్తిగా పాకిస్తాన్ కు లబ్ధి
మరోవైపు, ఈ సంక్షోభంలో పాకిస్తాన్ కీలక పాత్రను పోషిస్తోంది. అమెరికా , ఇరాన్ మధ్య చర్చలకు వేదికగా నిలవడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో తన పరపతిని పెంచుకోవాలని ఇస్లామాబాద్ ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా అమెరికాతో సంబంధాలను మెరుగుపరుచుకోవడం ద్వారా ఆర్థిక సహాయం పొందాలని, అలాగే పొరుగునే ఉన్న ఇరాన్తో యుద్ధం వస్తే తలెత్తే శరణార్థుల సమస్య, అశాంతిని నివారించాలని పాక్ భావిస్తోంది. ఈ చర్చలు సఫలమైతే పాకిస్తాన్ ఒక బాధ్యతాయుతమైన ప్రాంతీయశక్తిగా గుర్తింపు పొందుతుంది. మొత్తానికి ట్రంప్ ఇచ్చిన ఈ అదనపు సమయం, యుద్ధం అంచున ఉన్న దేశాలకే కాకుండా, స్థిరత్వాన్ని కోరుకునే భారత్ వంటి దేశాలకు కూడా కొత్త ఆశలను చిగురింపజేస్తోంది.
No comments:
Post a Comment