- బిల్లు వీగిపోయినా 2029 లక్ష్యంగా కొత్త వ్యూహాలు
- విపక్షాల ప్రతిఘటనను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న మోదీ ప్రభుత్వం
మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో ఆగిపోయినప్పటికీ, 2029 ఎన్నికల నాటికి 33 శాతం కోటాను అమలుచేయాలనే పట్టుదలతో కేంద్ర ప్రభుత్వం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ లక్ష్యం కోసం బహుముఖ వ్యూహాలను సిద్ధం చేస్తోందని విశ్వసనీయవర్గాల సమాచారం. లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు విఫలమైనా, కేంద్రపాలిత ప్రాంతాలు, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన మిగిలిన రెండు బిల్లులను ప్రభుత్వం ఇంకా ఉపసంహరించుకోలేదు. వీటిని తమకు అనుకూలమైన సమయంలో ఓటింగ్కు తెచ్చే అవకాశం ఉంది. 2023లో ఆమోదించిన 'నారీ శక్తి వందన్ అధినియం' (106వ రాజ్యాంగ సవరణ) ఇప్పటికే అమలులో ఉన్నందున, మహిళా రిజర్వేషన్ల మార్గం పూర్తిగా మూసుకుపోలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి రిజర్వేషన్లు అమలు కావాలంటే ప్రభుత్వం ముందు ప్రధానంగా మూడు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. మొదటిది, అన్ని రాజకీయపార్టీలతో చర్చలు జరిపి, అవసరమైతే వర్షాకాల సమావేశాల్లో బిల్లును తిరిగి ప్రవేశపెట్టడం. రెండోది, లోక్సభ సీట్ల సంఖ్యను పెంచకుండా కేవలం నియోజకవర్గాల సరిహద్దులను మార్చడం ద్వారా రిజర్వేషన్లు కల్పించడం. దీనిపై రాజకీయ ఏకాభిప్రాయం సాధించడం సులభమని ప్రభుత్వం భావిస్తోంది. మూడోది, ఆర్టికల్ 334ఏను సవరించి, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)తో సంబంధం లేకుండా ప్రస్తుతం ఉన్న 543 సీట్లపైనే రిజర్వేషన్లను అమలు చేయడం. ప్రస్తుతం జరుగుతున్న జనాభా గణన 2027 నాటికి పూర్తయ్యే అవకాశం ఉన్నందున, ఆ తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారా 2029 లక్ష్యాన్ని చేరుకోవచ్చని కేంద్రం అంచనా వేస్తోంది.
మరోవైపు, ఈ అంశంపై రాజకీయంగా దూకుడు పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహిళా బిల్లును అడ్డుకున్న విపక్షాలను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టేందుకు దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. మహిళల హక్కులను కాలరాసిన విపక్షాల అసలు రంగును ఎండగట్టడమే లక్ష్యంగా బీజేపీ తన ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది. చట్టపరమైన అడ్డంకులను తొలగించుకుంటూనే, రాజకీయంగా విపక్షాలను ఇరకాటంలో పెట్టేలా మోదీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
No comments:
Post a Comment