- చర్చలు జరపకుండానే ఇస్లామాబాద్ నుంచి నిష్క్రమణ
- దౌత్యవేత్తగా ఎదగాలనుకున్న పాక్ ప్రయత్నం విఫలం
ఇస్లామాబాద్: అమెరికా, ఇరాన్ మధ్య రెండో విడత శాంతి చర్చలకు ఆతిథ్యమిచ్చి, అంతర్జాతీయస్థాయిలో దౌత్యపరమైన గుర్తింపు పొందాలనుకున్న పాకిస్థాన్ ఆశలు అడియాసలయ్యాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ నేతృత్వంలోని ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం శనివారం సాయంత్రం పాకిస్థాన్ రాజధాని నుంచి అనూహ్యంగా నిష్క్రమించింది. అమెరికా ప్రతినిధులతో నేరుగా చర్చలు జరిపేందుకు ఇరాన్ నిరాకరించడమే కాకుండా, కేవలం తమ డిమాండ్ల జాబితాను పాక్ పాలకులకు అందజేసి పర్యటనను ముగించడం గమనార్హం. ఈ పరిణామంతో పాకిస్థాన్ చేసిన మధ్యవర్తిత్వ ప్రయత్నాలన్నీ ఒక్కసారిగా నీరుగారిపోయాయి.
ఈ కీలక పర్యటన కోసం పాక్ ప్రభుత్వం నగరాన్ని భారీ భద్రతా వలయంలో ఉంచి, రెడ్ జోన్ను పూర్తిగా మూసివేసింది. ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ సహా అగ్రశ్రేణి నాయకత్వమంతా ఇరాన్ ప్రతినిధులతో సుమారు రెండు గంటల పాటు భేటీ అయ్యారు. అయితే, ఇరాన్ మాత్రం చర్చల కంటే షరతులకే ప్రాధాన్యం ఇచ్చింది. ముఖ్యంగా హార్ముజ్ జలసంధిలో అమెరికా విధిస్తున్న నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేస్తేనే తాము చర్చల మేజా వద్దకు వస్తామని ఇరాన్ తెగేసి చెప్పింది. అమెరికా పంపిన ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్లను కలిసేందుకు కూడా ఇరాన్ సుముఖత చూపకపోవడంతో పాక్ దౌత్యపరమైన వైఫల్యం స్పష్టమైంది.
అమెరికా ప్రతినిధులతో నేరుగా మాట్లాడకుండానే అబ్బాస్ అరాగ్చీ తదుపరి పర్యటనల కోసం ఒమన్, రష్యాకు బయలుదేరి వెళ్లారు. దీనిని బట్టి ప్రాంతీయ శాంతి విషయంలో ఇరాన్.. పాకిస్థాన్ కంటే ఒమన్ , రష్యాలనే నమ్మకమైన భాగస్వాములుగా భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. గతంలో జరిగిన 21 గంటల సుదీర్ఘ చర్చలు కూడా ఎటువంటి ఫలితాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు రెండో విడత చర్చలు కూడా జరగకుండానే ముగియడం పాకిస్థాన్ వ్యూహాత్మక వైఫల్యానికి నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య వారధిగా నిలవాలనుకున్న పాకిస్థాన్ చివరకు ఒక మూగ ప్రేక్షకునిగా మిగిలిపోయింది.
No comments:
Post a Comment