- అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో రివల్యూషనరీ గార్డ్స్ ఇంటెలిజెన్స్ చీఫ్ మజిద్ ఖదేమీ మృతి
టెహ్రాన్: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ జ్వాలల మధ్య ఇరాన్ అగ్రశ్రేణి సైనిక, నిఘా వ్యవస్థకు భారీ విఘాతం కలిగింది. ఇరాన్ పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) నిఘా విభాగం అధిపతి మేజర్ జనరల్ మజిద్ ఖదేమీ, సోమవారం తెల్లవారుజామున అమెరికా, ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. రాజధాని టెహ్రాన్లోని పలు నివాస ప్రాంతాలే లక్ష్యంగా జరిగిన ఈ దాడుల్లో ఖదేమీతో పాటు సుమారు 25 మందికి పైగా మరణించినట్లు సమాచారం. గతేడాది జూన్లో ఇజ్రాయెల్ చేతిలో హతమైన జనరల్ మహమ్మద్ కాజేమీ స్థానంలో ఖదేమీ బాధ్యతలు చేపట్టారు. కేవలం నిఘా రంగానికే పరిమితం కాకుండా, దేశ భద్రత, విదేశీ శత్రువులను వ్యూహాత్మకంగా ఎదుర్కోవడంలో ఆయన ఐదు దశాబ్దాల అనుభవం ఇరాన్కు మార్గదర్శకంగా ఉండేదని ఐఆర్జీసీ తన టెలిగ్రామ్ ఛానల్లో పేర్కొంది.
ఇరాన్ నిఘా సంస్థ అత్యంత శక్తివంతమైనది మాత్రమే కాకుండా, ఇది నేరుగా దేశ అత్యున్నత నాయకుడికే (Supreme Leader) జవాబుదారీగా ఉంటుంది. విదేశీయుల నిర్బంధం, దేశ వ్యతిరేక శక్తుల అణచివేత, సరిహద్దుల వెలుపల జరిగే రహస్య ఆపరేషన్లలో ఈ సంస్థ పాత్ర కీలకమైనది. సోమవారం జరిగిన ఈ దాడుల ధాటికి టెహ్రాన్ నగరం దద్దరిల్లిపోయింది. షరీఫ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ సమీపంలోని ఆజాదీ స్క్వేర్ వద్ద భారీ ఎత్తున నల్లటి పొగలు కమ్ముకున్నాయి. హర్మూజ్ జలసంధిని తెరవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు సమీపిస్తున్న తరుణంలో, ఇరాన్ కూడా ఇజ్రాయెల్, పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలపై క్షిపణులతో విరుచుకుపడింది.
గత నెల రోజులుగా సాగుతున్న ఈ యుద్ధంలో ఇరాన్ తన రాజకీయ , సైనిక మేధావులను వరుసగా కోల్పోతోంది. మాజీ అత్యున్నత నాయకుడు అలీ ఖమేనీతో పాటు, వ్యవస్థలో కీలక స్తంభంగా ఉన్న అలీ లారిజానీ మరణం ఇరాన్కు ఇప్పటికే పెద్ద లోటుగా మారింది. మార్చి 17న జరిగిన దాడుల్లో జాతీయ భద్రతా మండలి చీఫ్, ఆయన కుటుంబ సభ్యులు మరణించగా, తాజాగా బసిజ్ కమాండర్ గులాంరెజా సులేమానీ, రివల్యూషనరీ గార్డ్స్ ప్రతినిధి అలీ మొహమ్మద్ నైనీ కూడా ఇజ్రాయెల్ దాడుల్లో బలయ్యారు. ఒకవైపు అంతర్జాతీయ మధ్యవర్తులు యుద్ధ విరమణ ప్రతిపాదనలతో ప్రయత్నిస్తున్నప్పటికీ, అగ్రశ్రేణి నాయకత్వం వరుసగా తుడిచిపెట్టుకుపోతుండటం ఇరాన్ ఉనికికే సవాలుగా మారింది.
No comments:
Post a Comment