- పాకిస్తాన్ రాయబార ప్రయత్నాలు విఫలం
- హార్ముజ్ జలసంధిపై పట్టుబట్టడమే చర్చల విచ్ఛిన్నానికి కారణమా?
ఇస్లామాబాద్/వాషింగ్టన్: అమెరికా , ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించి, కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చేందుకు పాకిస్తాన్ నేతృత్వంలో జరిగిన దౌత్య ప్రయత్నాలు భారీ ఎదురుదెబ్బతిన్నాయి. ఇస్లామాబాద్లో అమెరికా అధికారులతో ముఖాముఖి చర్చలు జరపడానికి తమ ప్రతినిధులను పంపే ప్రసక్తే లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ మేరకు మధ్యవర్తులకు అధికారికంగా సమాచారం అందించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. వాషింగ్టన్ విధిస్తున్న కఠిన నిబంధనలు ఏమాత్రం ఆమోదయోగ్యం కావని, ప్రస్తుతం ఉన్న చర్చల పంథాలో తాము ముందుకు వెళ్లలేమని ఇరాన్ తేల్చి చెప్పింది. ఈ పరిణామంతో శాంతి ప్రయత్నాలు ఒక్కసారిగా ప్రతిష్టంభనలోకి వెళ్లాయి.
ప్రస్తుతం పాకిస్తాన్ ప్రయత్నాలు ఫలించకపోవడంతో, టర్కీ , ఈజిప్ట్ దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఇస్లామాబాద్కు బదులుగా చర్చలకు వేదికగా ఖతార్ లేదా ఇస్తాంబుల్ నగరాలను ఎంచుకునే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యంగా ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ తిరిగి తెరవాలని, దానికి ప్రతిగా కాల్పుల విరమణ ప్రకటించాలని అమెరికా ప్రతిపాదిస్తోంది. ఇదే విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్తో ఫోన్లో చర్చించారు. హార్ముజ్ జలసంధిని పూర్తిగా స్వేచ్ఛాయుతంగా తెరిచే వరకు ఇరాన్పై దాడులు ఆపేది లేదని, అవసరమైతే ఆ దేశాన్ని రాతియుగం నాటి స్థితికి తీసుకెళ్తామంటూ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ 'ట్రూత్ సోషల్' లో హెచ్చరించారు. అయితే ఇరాన్ అధ్యక్షుడు కాల్పుల విరమణను కోరుకుంటున్నారన్న ట్రంప్ వాదనలను ఇరాన్ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది, అవన్నీ అవాస్తవాలని కొట్టిపారేసింది.
No comments:
Post a Comment