- ఓటమిని కప్పిపుచ్చుకోవడానికే ట్రంప్ అబద్ధాలాడుతున్నారని విమర్శ
అమెరికాకు చెందిన ఎఫ్-15 యుద్ధ విమాన సిబ్బందిని ఇరాన్ భూభాగం నుంచి సురక్షితంగా రక్షించామన్న వాదనలపై ఇరాన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఇదంతా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆడుతున్న డ్రామా అని, యుద్ధంలో ఎదురైన పరాజయాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఇటువంటి కట్టుకథలు అల్లుతున్నారని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘై ఎద్దేవా చేశారు. ఇరాన్ గడ్డపై ఎటువంటి రెస్క్యూ ఆపరేషన్ జరగలేదని, అమెరికా చేస్తున్నవన్నీ నిరాధారమైన ఆరోపణలని ఆయన కొట్టిపారేశారు. క్షేత్రస్థాయిలో అమెరికా బలగాలు ఎదుర్కొంటున్న వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు వాషింగ్టన్ ప్రయత్నిస్తోందని ఆయన మండిపడ్డారు.
మరోవైపు, అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్ సైనిక, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు భారీగా దెబ్బతిన్నాయన్న వార్తలను కూడా బఘై ఖండించారు. ఇజ్రాయెల్ , అమెరికా ఉమ్మడిగా సాగిస్తున్న దుష్ప్రచారంలో ఇదొక భాగమని ఆయన విమర్శించారు. ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలు అత్యంత పటిష్టంగా ఉన్నాయని, శత్రువుల దాడులను తిప్పికొట్టే సామర్థ్యం తమకుందని ఆయన స్పష్టం చేశారు. అమెరికా పదేపదే చేస్తున్న ఇటువంటి ప్రకటనలు కేవలం మానసిక యుద్ధంలో భాగమేనని, వాస్తవానికి ఇరాన్ రక్షణ వ్యవస్థలకు ఎటువంటి నష్టం వాటిల్లలేదని చెప్పారు.
No comments:
Post a Comment