- తిరుప్పూర్లో సీఎం ఎం.కె.స్టాలిన్ ఎన్నికల శంఖారావం
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పతాకస్థాయికి చేరిన వేళ, ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ విపక్ష కూటమిపై విరుచుకుపడ్డారు. శనివారం తిరుప్పూర్లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో ఎన్డీయే (NDA) కూటమికి ఓటు వేస్తే అది రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమేనని హెచ్చరించారు. డీఎంకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకం ఒక మైలురాయిగా నిలుస్తుందని, అయితే ఏఐఏడీఎంకే , బీజేపీ కలిసి ఈ ప్రాంత పారిశ్రామిక వృద్ధిని కుంటుపరిచాయని ఆయన ఆరోపించారు. ఎన్డీయేకు పడే ప్రతి ఓటు తమిళనాడు పురోగతికి అడ్డంకిగా మారుతుందని, ఈ వాస్తవాన్ని ప్రజలు గుర్తించాలని ఆయన పిలుపునిచ్చారు.తమిళనాడులో అమలవుతున్న వినూత్న పథకాలను నేడు దేశమంతా అనుసరిస్తోందని, చివరకు కేంద్ర ప్రభుత్వం కూడా తమ కార్యక్రమాలను కాపీ కొట్టేందుకు ప్రయత్నిస్తోందని స్టాలిన్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు పరమావధి అని, తమిళనాడును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలంటే మళ్లీ డీఎంకేనే గెలవాలని ఆయన స్పష్టం చేశారు. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, స్టాలిన్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వేడిని పెంచాయి. తమిళనాడు ఆత్మగౌరవాన్ని, ఆర్థికవృద్ధిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఓటర్లపైనే ఉందని ఆయన పునరుద్ఘాటించారు.
No comments:
Post a Comment