- ప్రముఖ ఆర్థికవేత్త రుచిర్ శర్మ విశ్లేషణ
- అభివృద్ధి కంటే నగదు బదిలీలే ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయని వెల్లడి
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ ఇన్వెస్టర్, రచయిత రుచిర్ శర్మ ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. భారత ఎన్నికల చరిత్రలో రాష్ట్రాల ఆర్థికవృద్ధి రేటుకు, ముఖ్యమంత్రుల పునరాగమనానికి మధ్య ఎటువంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. సాధారణంగా ఏ దేశంలోనైనా ఆర్థికాభివృద్ధి సాధించిన ప్రభుత్వాలకు ఓటర్లు పట్టం గడతారని, కానీ భారతదేశంలో మాత్రం అది కేవలం 50-50 శాతంగానే ఉందని ఆయన పేర్కొన్నారు. తలసరి ఆదాయంలో 8 శాతం అంతకంటే ఎక్కువ వృద్ధిని నమోదు చేసిన ముఖ్యమంత్రులు కూడా ఎన్నికల్లో ఓడిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయని, ఇది భారత రాజకీయాల్లోని ఒక విచిత్రమైన పరిస్థితి అని ఆయన అభిప్రాయపడ్డారు.
బెంగాల్ ఎన్నికల్లో అభివృద్ధి అనేది ప్రధాన అజెండా కాదని, ఇక్కడ కేవలం మతం, గుర్తింపు, చొరబాట్లు, బుజ్జగింపు రాజకీయాలే కీలకపాత్ర పోషిస్తున్నాయని రుచిర్ శర్మ విశ్లేషించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ పార్టీ దగ్గర కూడా నిర్దిష్టమైన ప్రణాళిక ఉన్నట్లు కనిపించడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా బెంగాల్ తలసరి ఆదాయం పడిపోతూనే ఉందని, ముర్షిదాబాద్ వంటి జిల్లాల్లో వెనుకబాటుతనం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు. అభివృద్ధి స్థానాన్ని ఇప్పుడు నేరుగా ఓటర్ల ఖాతాల్లోకి నగదు బదిలీ చేసే పథకాలు ఆక్రమించాయని, డిజిటలైజేషన్ వల్ల ఈ ప్రయోజనాలు నేరుగా ప్రజలకు అందుతుండటంతో ప్రతి రాష్ట్ర ప్రభుత్వం దీనినే నమ్ముకుంటోందని ఆయన వివరించారు.
ఈసారి బెంగాల్లో నమోదవుతున్న చారిత్రాత్మక ఓటింగ్ శాతం (93 శాతం వరకు) వెనుక ఓటర్ల జాబితాల సవరణ (SIR) ప్రభావం ఉండవచ్చని రుచిర్ శర్మ అభిప్రాయపడ్డారు. సాధారణంగా ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంటే బలమైన క్యాడర్ లేని పార్టీలకు ప్రయోజనం చేకూరుతుందని, తక్కువ ఓటింగ్ నమోదైతే క్యాడర్ బలం ఉన్న పార్టీలు పైచేయి సాధిస్తాయని నిపుణుల అంచనా అని ఆయన గుర్తు చేశారు. గత ఎన్నికల్లో టీఎంసీ , బీజేపీ మధ్య ఉన్న 10 శాతం ఓట్ల వ్యత్యాసాన్ని ఒక్క ఎన్నికల చక్రంలోనే అధిగమించడం కష్టమైనా, భారత రాజకీయాల్లో అసాధ్యం మాత్రం కాదని ఆయన వ్యాఖ్యానించారు. తమిళనాడులో గతంలో జయలలిత ఇటువంటి భారీ వ్యత్యాసాన్ని అధిగమించి మళ్ళీ అధికారంలోకి వచ్చిన ఉదాహరణను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
No comments:
Post a Comment